Gaddar Awards Committee: సినీ కళాకారులను ప్రభుత్వాలు సత్కరిస్తుంటాయి. ప్రతిభ ఉన్నవాళ్లకు నంది అవార్డులు ఇచ్చేవారు. ఈ వేడుకను ఎంతో వైభవంగా నిర్వహించేవారు. కానీ.. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత... ఈ వైభవం కళ  తప్పింది. 2014లో ఏపీ ప్రభుత్వం సినీ కళాకారులకు నంది అవార్డులు ప్రకటించి... విజేతలకు అందించింది. కానీ...  ఆ కార్యక్రమంలో గత వైభవం కనిపించలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత... ఆ దిశగా ఆలోచనలు చేసింది.  గద్దర్‌ జయంతి వేడుకల సందర్భంగా... సినీ కళాకారులకు నంది అవార్డుల స్థానంలో... గద్దర్‌ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది గద్దర్‌ జంయతి రోజున అవార్డులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు... ఆ దిశగా మరో  అడుగు ముందుకు వేసింది తెలంగాణ ప్రభుత్వం.


తెలుగు చిత్ర పరిశ్రమకు ఇవ్వాలనుకున్న గద్దర్‌ అవార్డుల (Gaddar Awards) విషయంలో.. కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కార్యాచరణ ప్రారంభించింది. గద్దర్‌ అవార్డులకు సంబంధించి ప్రత్యేక కమిటీ (Special committee)ని  నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ... గద్దర్‌ అవార్డుల విధివిధానాలు, నియమ నిబంధనలు, లోగో రూపకల్పన వంటి అంశాలపై ప్రణాళిక రూపొందించనుంది. తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌  కార్పొరేషన్‌.. ఈ కమిటీతో చర్చించి కార్యాచరణ మొదలుపెట్టనుంది.


గద్దర్‌ అవార్డుల కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే...
గద్దర్‌ అవార్డుల కమిటీకి ప్రముఖ సినీ దర్శకుడు బి.నర్సింగరావు (B.Narsing Rao) ను చైర్మన్‌ (Chairman)గా నియమించింది ప్రభుత్వం. వైస్‌ చైర్మన్‌ (Vice Chairman)గా ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) వ్యవహరించనున్నారు.  అలాగే.. కమిటీ సలహారులుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, చంద్రబోస్‌, గుమ్మడి వెన్నెల, తనికెళ్ల భరణి, డి.సరేష్‌ బాబు, నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్‌, సానా యాదిరెడ్డి, అల్లాణి  శ్రీధర్‌, హరీష్‌ శంకర్‌, బలగం వేణు వంటి వారు ఉంటారు. ఈ కమిటీ సభ్యలు అందరూ కలిసి గద్దర్‌ అవార్డులపై చర్చిస్తారు. విధివిధానాలు రూపొందించిన తర్వాత... తుది నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తారు. 


సీఎం రేవంత్‌రెడ్డి గద్దర్‌ జయంతి వేడుకల్లోనే.. సినీ కళాకారులకు గద్దర్‌ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. అయితే... దీనిపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన రాలేదు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తారు. తాము  అవార్డులు ఇస్తామన్నా... చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. దీంతో... అగ్ర నటుడు, మెగాస్టార్‌ చిరంజీవి.. ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. గద్దర్‌ అవార్డులు ఇస్తాంటూ... తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనపై ముందుకు  వెళ్లాలని చిత్ర పరిశ్రమను కోరారు. దీంతో ఫిల్మ్‌ ఛాంబర్‌, నిర్మాతల మండలి రియాక్ట్‌ అయ్యింది. తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (FDC)తో చర్చించింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన, మెగాస్టార్‌ చిరంజీవి కోరిక మేరకు.. అవార్డుల విషయంలో  విధివిధానాలపై ఎలా ముందుకువెళ్లాలో ఆలోచిస్తామన్నారు. తమ ప్రతిపాదనను సీఎం రేవంత్‌రెడ్డి ముందు ఉంచారు. తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించడంతో... సీఎం రేవంత్‌రెడ్డి గద్దర్‌ అవార్డులపై కమిటీని నియమించారు. అంటే.. వచ్చే ఏడాది గద్దర్‌  జయంతి రోజు.. సినీ పరిశ్రమలో ఉత్తమ నటులు, ఉత్తమ కళాకారులు.. గద్దర్‌ అవార్డులు అందుకోబోతున్నట్టే.