Rs 4,760 Cr Bank Fraud: 


దేశంలో మరో భారీ బ్యాంకు మోసం బయటపడింది! జీటీఎల్‌ ఇన్ఫ్రా కంపెనీ రూ.4,760 కోట్ల మేర బ్యాంకుల కన్సార్టియమ్‌ను మోసగించింది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సంబంధిత కంపెనీ, డైరెక్టర్లు, కొందరు బ్యాంకు అధికారులపై కేసులు నమోదు చేసింది.


మొత్తం 24 బ్యాంకుల కన్సార్టియమ్‌ను జీటీఎల్‌ ఇన్ఫ్రా మోసగించిందని సీబీఐ తెలిపింది. బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఉద్దేశించి పనుల కోసం ఉపయోగించలేదు. కొందరు వెండార్లు, బ్యాంకు అధికారులతో కలిసి ఇతర అవసరాలకు మళ్లించింది. ముడి సరుకులు, వస్తువులు సరఫరా చేయనప్పటికీ ఏటా వెండార్లకు అడ్వాన్సులు చెల్లించింది. చివరికి వీటిని ప్రావిజన్స్‌లో చూపినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది.


మోసం చేసేందుకు జీటీఎల్‌ ఇన్ఫ్రా దురుద్దేశ పూర్వకంగా కొందరు వెండార్లను సృష్టించిందని సీబీఐ వెల్లడించింది. ఇందులో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.650 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నుంచి రూ.467 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.412 కోట్లు రుణంగా తీసుకుంది. కొన్ని ప్రత్యేకమైన వ్యాపార అవసరాల కోసం స్వల్ప కాల రుణాలను తీసుకుంటున్నట్టు చెప్పిన జీటీఎల్‌ ఇన్ఫ్రా వీటిని ఇతర అవసరాలకు మళ్లించింది.


మోసం జరిగిన తీరు


మొదట జీటీఎల్‌ ఇన్ఫ్రా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. వీటిని తామే సృష్టించిన వెండార్లకు అడ్వాన్స్‌ చెల్లింపుల రూపంలో మళ్లించింది. ఆ తర్వాత మార్జినల్‌ సప్లై ఉద్దేశం కోసం వెండార్లు తిరిగి జీటీఎల్‌ లిమిటెడ్‌కు డబ్బు పంపించేవాళ్లు. అలాగే వెండార్లు పంపించిన వర్కింగ్‌ క్యాపిటల్‌ నిధులను జీటీఎల్‌ స్థిరాస్తుల కొనుగోలుకు ఉపయోగించింది. అలాగే ఇతర కంపెనీల్లో షేర్లను కొనుగోలు చేసింది.


బ్యాంకులు 2009-10 ఆర్థిక ఏడాదిలో రూ.1055 కోట్లను జీటీఎల్‌కు రుణాలుగా ఇచ్చాయి. 2010-11లో రూ.1970 కోట్లను మంజూరు చేశాయి. ఈ రుణాల్లో రూ.649 కోట్లను జీటీఎల్‌ 2009-10లో స్వల్ప కాల మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టింది. 2010-11లో మరో రూ.1095 కోట్లను పెట్టుబడి పెట్టింది. అదే ఏడాది రూ.135 కోట్లను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేసింది. అంతేకాకుండా ఆ రెండేళ్లలో సేల్‌ బిల్లు డిస్కౌంట్ల రూపంలో వచ్చిన డబ్బులో ఎక్కువ వాటాను లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టింది.