ఒమిక్రాన్‌ కేసులపై ఇప్పుడిప్పుడే ఒక అంచనా వస్తోందని హైసియా అధ్యక్షుడు భరణి అన్నారు. తీవ్రత ఎక్కువగా ఉండదని, ఆక్సిజన్‌ అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువుంటుంది కాబట్టి మున్ముందు పరిస్థితులపై అవగాహన వస్తుందని అంచనా వేశారు. ఐటీ కంపెనీల్లో ఎక్కువగా ఇంటి నుంచే పనిచేస్తున్నారని, పూర్తి స్థాయిలో కార్యాలయాలకు ఎప్పుడొస్తారో చెప్పలేమని తెలిపారు. 'ఏబీపీ దేశం'తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.


ఉద్యోగులు వస్తున్నారు
గతంలో ఇచ్చిన పిలుపు మేరకు కొద్ది స్థాయిలో ఉద్యోగులు కార్యాలయాకు వస్తున్నారని భరణి తెలిపారు. 'పెద్ద కంపెనీల్లో 5, మధ్య స్థాయి కంపెనీల్లో 30, చిన్న కంపెనీల్లో 70 శాతం వరకు ఉద్యోగులు వస్తున్నారు. ఉద్యోగులు ఆఫీసులకు రావాలని హైసియా పిలుపునిచ్చేదమీ లేదు. ఆయా కంపెనీలే దీనిపై నిర్ణయం తీసుకుంటాయి. ఐటీలో సపోర్టింగ్‌ సెక్టర్లు ఉంటాయి. ఐటీలో ఒక్కో ఉద్యోగికి ఐదారు సపోర్టింగ్‌ సెక్టార్ల వారు సేవలందిస్తారు. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేయడం వల్ల వారి జీవన భృతి పోతోంది' అని అన్నారు.


టీకాలు పూర్తి
ఐటీలో దాదాపుగా వ్యాక్సినేషన్‌ పూర్తైంది. కార్పొరేట్‌ ఆస్పత్రులతో కలిసి ఉద్యోగుల కుటుంబ సభ్యులకూ టీకాలు వేయించారు. వాక్సిన్‌ వేయించుకున్నా ఒమిక్రాన్‌ వ్యాపిస్తోందని తెలుస్తోంది. టీకాల వల్ల వైరస్‌ తీవ్రత తక్కువుగా ఉంటోంది. నాలుగైదు నెలలుగా ఐటీ పరిశ్రమలో పెద్దగా ఇబ్బందులేమీ రాలేదు. అయితే కొంత కాలం మనం కొవిడ్‌తో కలిసి జీవించాల్సిందే' అని భరణి తెలిపారు.


వర్క్‌స్పేస్‌లో మార్పులు
కొవిడ్‌ వల్ల పని వాతావరణం మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నెగ్గాలనేది చూసుకోవాలి. ఐటీ వాళ్లు ఇంటి నుంచి పనిచేస్తుండటంతో కేసుల తీవ్రత పరిశ్రమలో పెరగలేదు. సపోర్టింగ్‌ రంగాల వారికి భృతి దొరకాలంటే ఉద్యోగులు ఆఫీసులకు రావాలి. కార్యాలయాల్లో అయితే  కలిసి పనిచేయడం, మాట్లాడటం, సామవేశాలు పెట్టడం వల్ల ఒత్తిడి ఉండదు. ఆఫీసులకు వస్తేనే సీనియర్ల పనితీరు అర్థమవుతుంది. సమస్యలను వారెలా పరిష్కరిస్తున్నారో కొత్తవారికి తెలుస్తుంది. సమగ్ర పనితీరు తెలుస్తుంది.



హైబ్రీడ్‌ పెరగొచ్చు
ఐటీలో టోకెన్‌ సిస్టమ్‌లో 25 శాతం మంది ఆఫీస్‌ నుంచే పనిచేస్తుంటారు. ఇదీ రొటేషనల్‌గా ఉంటుంది. హైబ్రీడ్‌ పని వాతావరణం వస్తోంది. అలాంటప్పుడు కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుంది. 2022లో టోకెన్‌ సిస్టమ్‌, హైబ్రీడ్‌ సిస్టమ్‌ కీవర్డ్స్‌ అయ్యే అవకాశం ఉంది. మొదటి వేవ్‌ తగ్గిన తర్వాత కరోనా ముగిసిందని అనుకున్నాం. అంతలోనే డెల్టా రావడంతో వినియోగదారులు, సరఫరాదారులపై ప్రభావం పడింది. ఇలాంటప్పుడు ఏప్రిల్‌, జూన్‌, జులై ఇలా ఏ నెలల్లో ఏమవుతుందో చెప్పలేం. పరిస్థితులకు తగ్గట్టు ముందుకెళ్లాలి. వచ్చే ఏడాదీ మరో కొత్త వేరియెంట్‌ వచ్చినా చెప్పలేం. హైబ్రీడ్‌ పద్ధతిలో వచ్చే ఏడాది ఉద్యోగులు ఆఫీసులకు వస్తారు.


మేం అడ్వైజరీగా ఉంటున్నాం
హైసియా తరఫున మేం సర్వేలు చేస్తున్నాం. కంపెనీలు, ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకుంటున్నాం. ఇంటి నుంచి పనిలో ప్రొడక్టివిటీ ఎక్కువే ఉన్నా రిలాక్సేషన్‌ తక్కువ. కాస్త భయం తగ్గడంతో ఉద్యోగులు ఆఫీసులకు రావాలనే అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఫైనల్‌ వర్కింగ్‌ మోడల్‌ ఏంటో చెప్పలేం.  వర్క్‌ ఫ్రం హోంలో ఎథిక్స్‌ పరంగా సమస్యలు వస్తున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీస్‌లో మార్పు రావడంతో నైపుణ్యాల కొరత పెరిగింది. అందుకే అట్రిషన్‌ రేటు పెరిగింది. 


ప్రభుత్వాల సాయం
ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ప్రభుత్వాలు ప్రొయాక్టివ్‌గా పనిచేశాయి.  భద్రత, వాక్సినేషన్‌, ఇతర చర్యలకు తీసుకున్నారు. టీకాలు ఇప్పించేందుకు కృషి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగానికి ఎక్కువగానే తోడ్పడింది. ఇక ఉద్యోగులు ఆఫీసులకు ఎప్పుడొస్తారన్నది మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. ఏప్రిల్‌ నుంచి ఎక్కువ మంది వస్తారని అంచనా.