ఢిల్లీ: ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ డిస్నీని కొనుగోలు చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయం తీసుకుందని ఇటీవల ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే వాల్ట్ డిస్నీతో రిలయన్స్ భారీ డీల్ కుదుర్చుకుంది. రిలయన్స్, డిస్నీ మీడియా రూ.70,352 కోట్లతో జాయింట్ వెంచర్ కు శ్రీకారం చుట్టాయి. ఇందులో రిలయన్స్ సంస్థ వాటా 63.16 శాతం ఉండగా, డిస్నీ వాటా 36.84 శాతమని తెలిపారు. 2024 చివరి త్రైమాసికంలో ఈ డీల్ కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు పూర్తికానున్నాయి. లేకపోతే 2025 తొలి త్రైమాసికానికి డీల్ కు సంబంధించి పూర్తి ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం.


ఇకనుంచి భారత కుబేరుడు ముకేష్ అంబానీకి  చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), వాల్ట్ డిస్నీ (Walt Disney) కలిసి పని చేయనున్నాయి. మీడియా కార్యకలాపాలను విలీనం చేసేందుకు రెండు కంపెనీల మధ్య డీల్ కుదిరింది. ఈ జాయింట్ వెంచర్ కు నీతా అంబానీ ఛైర్ పర్సన్‌గా వ్యవహరించనుండగా, ఉదయ్ శంకర్ వైస్ ఛైర్ పర్సన్ గా వ్యవహరించనున్నారని సంయుక్త ప్రకటన విడుదల చేశారు.


రిలయన్స్‌కు చెందిన వయాకామ్, వాల్ట్ డిస్నీ సంస్థ స్టార్ ఇండియా విలీనానికి డీల్ కుదిరింది. రూ.70,352 కోట్ల జాయింట్ వెంటర్ ఏర్పాటు చేయగా.. ఇందులో రిలయన్స్ రూ.11,500 ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎప్పటినుంచో రిలయన్స్, వాల్డ్ డిస్నీ విలీనానికి సంబంధించి జరుగుతున్న ప్రచారానికి బుధవారం నాడు ఈ సంస్థలు చెక్ పెట్టాయి. తాజా ఒప్పందం ప్రకారం రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో విలీనం అవుతుంది. తాజాగా ఏర్పడిన జాయింట్ వెంచర్‌లో అత్యధికంగా వయాకామ్ కు 46.82 శాతం వాటా ఉండగా, డిస్నీకి 36.84 శాతం వాటా, రిలయన్స్‌కు 16.34 శాతం వాటాలు ఉండనున్నాయి. 


రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 నుంచి 38 ఛానళ్లు, స్టార్ ఇండియా 70 ఛానళ్లు కలిపి 110 ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. దేశంలో అతిపెద్ద మీడియా సంస్థగా అవతరించనున్నామని ముకేశ్ అంబానీ తెలిపారు. ఎంటైర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో కొత్త శకానికి ఈ డీల్ ద్వారా నాంది పలికామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ అన్నారు. డిస్నీతో తమ జాయింట్ వెంచర్ ఏర్పాటుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఓవైపు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూనే మరోవైపు ప్రేక్షకులకు సాధ్యమైనంత తక్కువ ధరలకే సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. తాజాగా జరిగిన విలీన ఒప్పందం ప్రక్రియ ఈ ఏడాది చివరి త్రైమాకంలో, లేనిపక్షంలో వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో పూర్తి కానుందని స్పష్టం చేశారు.