RBI MPC Meeting October 2024 Decisions: దేశంలోని సామాన్య ప్రజలకు ఈసారి కూడా ఉపశమనం లేదు. EMIల పెనుభారం తగ్గలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), తన పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. యథాతథంగా, 6.50 శాతం వద్ద  కొనసాగించింది. గత ఏడాది (2023) ఫిబ్రవరి నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ తన రెపో రేటును అలాగే కొనసాగిస్తూ వస్తోంది. రెపో రేట్‌లో ఎలాంటి మార్పు చేయకుండా, యథతథంగా కొనసాగించడం వరుసగా ఇది పదో సారి. 2024లో ఇది వరుసగా ఐదోసారి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.


మానిటరీ పాలసీ కమిటీలోని (RBI MPC) ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపో రేటు తగ్గింపును వ్యతిరేకించారు. దేశంలో రెపో రేటును తగ్గించకూడదంటూ ఐదుగురు సభ్యులు ఓటు వేసినట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం, RBI టాలరెన్స్ బ్యాండ్ అయిన 4 శాతం కంటే తక్కువగానే ఉన్నప్పటికీ, రెపో రేటులో కేంద్ర బ్యాంక్‌ ఎటువంటి మార్పు చేయలేదు. రెపో రేట్‌లో మార్పు ఉండదని మార్కెట్‌ ముందు నుంచీ ఊహిస్తోంది కాబట్టి, ఇదేమీ ఆశ్చర్యకరమైన నిర్ణయం కాదు.


ప్రపంచ ఉద్రిక్తతల వల్ల ప్రమాదం 
రెపో రేట్‌ మారదని ముందు నుంచి సిద్ధమైన మార్కెట్‌, ఆర్‌బీఐ గవర్నర్ ప్రసంగంపై మాత్రం నిశితంగా దృష్టి పెట్టింది. భవిష్యత్‌ కార్యాచరణ గురించి ఆయన ఏం చెబుతారన్నది ఇటు సామాన్య ప్రజలకు, అటు కార్పొరేట్లకు చాలా కీలకం. దేశ ఆర్థిక వ్యవస్థకు మార్గనిర్దేశం చేసే వ్యాఖ్యలు గవర్నర్‌ ప్రసంగంలో ఉంటాయి కాబట్టి, ఆయన మాటలను అర్ధం చేసుకోవడం ముఖ్యం. గవర్నర్‌ ప్రసంగంలోకి వెళ్తే... ద్రవ్యోల్బణానికి (Inflation) ప్రపంచ ఉద్రిక్తతలు అతి పెద్ద ముప్పుగా పరిణమించాయని అన్నారు. లోహాలు, ఆహార పదార్థాల ధరల్లో ఇటీవలి పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం ప్రమాదంలో ఉంది. 2024 జులై, ఆగస్టు నెలల్లో ప్రధాన ద్రవ్యోల్బణం (Core Inflation) పెరిగిందని, బేస్ ఎఫెక్ట్ కారణంగా చిల్లర ద్రవ్యోల్బణం (Retail Inflation) భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. 


ద్రవ్యోల్బణం అంచనాలు
2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం సగటున 4.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్‌) ద్రవ్యోల్బణం 4.1 శాతంగా, మూడో త్రైమాసికంలో (అక్టోబర్‌-డిసెంబర్‌) 4.8 శాతం, నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి) 4.2 శాతం ఉండొచ్చని చెప్పారు.


ఖరీదైన EMIల నుంచి లభించని ఉపశమనం
దేశంలో ద్రవ్యోల్బణం రేటును అదుపులో ఉంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఓవరాల్‌గా చూస్తే, ఇన్‌ఫ్లేషన్‌ అదుపులో ఉన్నట్లు కనిపించినప్పటికీ, ఆహార ద్రవ్యోల్బణం (Food Inflation) మాత్రం ఇప్పటికీ లక్ష్యానికి మించి ఉంది. అంటే, దేశంలో ఆహార పదార్థాల ధరలు అదుపులో లేవు. అందుకే, రెపో రేటును 6.50 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్‌ నిర్ణయించింది. రెపో రేట్‌ తగ్గితే, బ్యాంక్‌ రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. ఫలితంగా EMI తగ్గుతుంది. రెపో రేట్‌ తగ్గించకపోవడంతో, కోట్లాది మంది రుణగ్రహీతలు, బ్యాంకు ఖాతాదార్లు నిరాశకు గురయ్యారు. వడ్డీ రేట్లు తగ్గితే లోన్‌ తీసుకుందామని ఎదురు చూస్తున్నవారికి కూడా ఇది బ్యాడ్‌ న్యూసే. పండుగ సందర్భంగా ఆర్‌బీఐ నుంచి మంచి నిర్ణయం వినొచ్చని ఎదురు చూస్తున్న ప్రజలంతా (పారిశ్రామికవేత్తలు సహా) నిరుత్సాహపడ్డారు. 


మరో ఆసక్తికర కథనం: భారీగా తగ్గిన బంగారం ధరలు- వెండిపై కూడా అదే స్థాయిలో తగ్గుదల