UPI Payments:


నగదు లావాదేవీలు, ఆన్లైన్‌ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI). ఈ వ్యవస్థను ఉపయోగించి రూపాయి నుంచి లక్షల వరకు ఈజీగా అవతలి వారికి బదిలీ చేయొచ్చు. అందుకే కిరాణా కొట్టు, కొబ్బరి బొండాల బండి, కూరగాయాల దుకాణాల వరకు అందరూ యూపీఐ స్కానర్లు వాడుతున్నారు. పైగా ఒక్క రూపాయి ఖర్చైనా లేకపోవడం అడ్వాంటేజీ! ఇప్పుడు ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌తో పన్లేకుండానే యూపీఐ పేమెంట్లు చేయొచ్చు.


సాధారణంగా యూపీఐ వ్యవస్థ అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. అనవసర తప్పులేమీ జరగవు. ఒకవేళ చెల్లింపులు ఆలస్యమైనా, నగదు మధ్యలోనే ఆగిపోయినా తక్కువ సమయంలోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎంత పటిష్ఠమైన వ్యవస్థే అయినప్పటికీ కొన్నిసార్లు మనవైపు నుంచీ తప్పులు జరుగుతుంటాయి. పొరపాటున ఒకరి బదులు మరొకరి యూపీఐ ఐడీ ఎంటర్‌ చేస్తే డబ్బులు నష్టపోక తప్పదు. ఒక స్కానర్‌ కోడ్‌ బదులు ఇంకోటి వాడితే నగదు మరొకరికి వెళ్తుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల మన డబ్బును తిరిగి పొందొచ్చు.


సామాన్యులు డబ్బు నష్టపోకుండా ఉండేందుకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొన్ని నిబంధనలు రూపొందించింది. పొరపాటున లేదా అనుకోకుండా మరొక యూపీఐ ఐడీకి పంపించిన డబ్బును రికవరీ చేసేందుకు వీలు కల్పించింది. ఇందుకు మొదట చేయాల్సింది నష్టపోయిన వ్యక్తి ఉపయోగించిన పేమెంట్‌ వ్యవస్థకు ఫిర్యాదు చేయాలి. ఉదాహరణకు పేటీఎం, గూగుల్‌ పే, పోన్ పే, బ్యాంకు యాప్‌లను యూపీఐ చెల్లింపులు చేసేందుకు ఉపయోగిస్తాం కదా! తొలుత వారికి ఫిర్యాదు చేయాలి. కస్టమర్‌ సర్వీస్‌ సాయం తీసుకొని రీఫండ్‌ చేయమని కోరాలి.


ఒకవేళ చెల్లింపుల వ్యవస్థ (Ex - పేటీఎం, ఫోన్‌ పే)లు సమస్యను పరిష్కరించలేకపోతే డిజిటల్‌ లావాదేవీల కోసం ప్రత్యేకంగా నియమించిన ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించాలి. ఆర్బీఐ నిబంధనలు అమలు చేయకపోయినా, యూపీఐ, భారత్‌ క్యూఆర్‌ కోడ్‌, ఇతర పేమెంట్‌ వ్యవస్థలు విఫలమైనా, లబ్ధిదారులకు నగదు బదిలీ చేయకపోయినా నిర్దేశిత సమయంలోగా అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాలి. లబ్ధిదారుల ఖాతాకు తప్పుగా నిధులు బదిలీ చేసినా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.


Also Read: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!


Also Read: ఇంటర్నెట్‌ లేకుండా UPI పేమెంట్స్‌ చేసే ట్రిక్‌, మీరూ ట్రై చేయండి


పెరిగిన లావాదేవీలు


డిజిటల్‌ పేమెంట్లలో భారత్‌ తిరుగులేని రికార్డులు సృష్టిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. 2022లో గ్రామీణ, చిన్న పట్టణాల్లోని దుకాణాల్లో యూపీఐ లావాదేవీలు 650 శాతం పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. విలువ పరంగా 25 శాతం, పరిమాణం పరంగా 14 శాతం వృద్ధిరేటు నమోదైందని బ్రాంచ్‌లెస్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ నెట్‌వర్క్‌ పే నియర్‌బై తెలిపింది.


గ్రామీణ, చిన్న చిన్న పట్టణాల్లో అసిస్టెడ్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్జాక్షన్స్‌ విపరీతంగా పెరిగాయని పే నియర్‌బై రిపోర్టు పేర్కొంది. ఇక మైక్రో ఏటీఎంలు, ఎంపీవోఎస్‌ పరికరాల డిమాండ్ 25 శాతం ఎగిసిందని వెల్లడించింది. ఆర్థిక సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీల్లో నెలసరి వాయిదాల వసూళ్లు (ఈఎంఐ) 200 శాతం వృద్ధి చెందాయని వివరించింది. కాగా నగదు ఉపసంహరణలో స్వల్ప తగ్గుదల కనిపించిందని తెలిపింది. 2021లో సగటున రూ.2620 నగదు విత్‌డ్రా చేయగా 2022లో అది రూ.2595కు తగ్గింది.