RBI On UPI Transactions: యూపీఐ! దేశంలో సగం మందికి దీని పూర్తి పేరు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ అని తెలీదు. అయితేనేం! కిరాణా కొట్టులో బిస్కెట్టు కొన్నా, బజార్లో  కొబ్బరి బోండాం తాగినా, శ్రీమతికి లిప్‌స్టిక్‌ కొనాలన్నా, పిల్లలకు డైపర్లు కావాలన్నా, సన్నిహితులకు నగదు బదిలీ చేయాలన్నా ఇదే వ్యవస్థను వాడుతున్నారు. బహుశా స్వాత్రంత్యం వచ్చాక ఇంతగా సూపర్‌ హిట్టైన ఆర్థిక సౌకర్యం మరొకటి లేదనే చెప్పొచ్చు. ఇన్నాళ్లూ ఉచితంగా వాడుకున్న ఈ సేవలకు రుసుములు విధించాలని ఆర్బీఐ ఎందుకు భావిస్తోంది! అసలు ఒక యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతుంది?


2016లో యూపీఐ విప్లవం


ఒకప్పుడు అవతలి వ్యక్తికి నగదు పంపించడం ఓ ప్రహసనం. బ్యాంకుకు వెళ్లాలి. డీడీ లేదా నగదు డిపాజిట్‌ ఫామ్‌ నింపాలి. వరుసలో నిలబడాలి. అక్కడ క్యాషియర్‌కు డబ్బులిచ్చి రసీదు తీసుకోవాలి. సాంకేతికత అభివృద్ధితో ఈ తలనొప్పి తగ్గింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ను వాడుకోవడం మొదలైంది. అయినప్పటికీ కొన్ని రకాల రుసుముల వల్ల అధికంగా వాడేవాళ్లు కాదు. ఆ తర్వాత డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరిగింది. ఏదైనా కొనుగోలు చేసినప్పుడు వ్యాపార కేంద్రాలు, స్టోర్లలో వీటినే వాడేవారు. వీటికీ ఛార్జీలు ఉండేవి. 2016లో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ యూపీఐ చెల్లింపుల వ్యవస్థ తీసుకురావడంతో ఒక్కసారిగా మార్పు మొదలైంది. ప్రపంచంలోనే ఇదో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది.


నెలకు రూ.10 లక్షల కోట్లు


యూపీఐ రాకతో చెల్లింపుల ప్రక్రియ మంచినీళ్ల ప్రాయంగా మారిపోయింది. క్షణాల్లో అవతలి వారికి నగదు పంపించడం మొదలైంది. మొదట్లో యూపీఐ ఐడీ (UPI ID) ఎంటర్‌ చేయాల్సి వచ్చేది. క్రమంగా యూపీఐ స్కానింగ్‌ కోడ్స్‌ వచ్చేశాయి. రూపాయి నుంచి లక్ష రూపాయల విలువైన లావాదేవీలను రెప్పపాటు సమయంలో ఉచితంగా చేపట్టొచ్చని తెలియడంతో జనాలు విపరీతంగా వాడేయడం ఆరంభించారు. మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) ఛార్జీలు లేకపోవడంతో కిరాణా కొట్లు, వస్త్ర దుకాణాలు, స్టోర్లు, వ్యాపారులు యూపీఐనే ప్రోత్సహించారు. అంతకు ముందు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు వాడితే ఆ లావాదేవీకి అయ్యే ఖర్చు మర్చంట్లే భరించాల్సి వచ్చేది. ఇక్కడేమో అంతా ఉచితమే. అందుకే 2016, జులై నాటికి నెలకు రూ.38 లక్షల విలువైన లావాదేవీలుంటే 2022, జులై నాటికి ఇది రూ.10 లక్షల కోట్ల విలువకు చేరుకుంది.


రూ.800కి రూ.2 ఖర్చు


ఇప్పుడంతా బాగానే ఉంది! ప్రజలు సునాయాసంగా యూపీఐ లావాదేవీలు చేపడుతున్న తరుణంలో ఆర్బీఐ ఛార్జీల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తోందనేదే అసలు సందేహం! ఒక యూపీఐ లావాదేవీకి అసలెంత ఖర్చు అవుతుంది? చెల్లింపుల వ్యవస్థలో ఎవరికి ఎంత భారం పడుతోంది? అన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఒక లావాదేవీ జరగాలంటే నగదు పంపిస్తున్న బ్యాంకు, పొందుతున్న వారి బ్యాంకు, మధ్యవర్తి (ఫోన్‌ పే, పేటీఎం etc), ఎన్‌పీసీఐ సహకారం అవసరం. ఉదాహరణకు ఓ స్టోర్లో మీరు రూ.800 సరుకులు కొన్నారు. ఆ మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించారని అనుకుందాం. అప్పుడు డబ్బు చెల్లిస్తున్న వారి బ్యాంకుకు 80 పైసలు, లబ్ధిదారుడి బ్యాంకు, లబ్ధిదారుడి యూపీఐ యాప్‌ ప్రొవైడర్‌, పీఎస్‌పీ బ్యాంకుకు మొత్తంగా 56 పైసలు, చెల్లిస్తున్న వారి యూపీఐ యాప్‌ ప్రొవైడర్‌, పీఎస్‌పీ బ్యాంకుకు 48 పైసలు, ఎన్‌పీసీఐకి 16 పైసలు ఖర్చవుతాయి. అంటే రూ.800 లావాదేవీకి రూ.2 ఖర్చవుతుంది. ఇప్పుడున్న మొత్తం లావాదేవీలను చూసుకుంటే నెలకు రూ.1250 కోట్ల వరకు ఖర్చవుతుంది. అందుకే రుసుముల వ్యవహారం తెరపైకి వచ్చింది.


రుసుము విధిస్తే ప్రభావం ఏంటి?


ఇన్నాళ్లూ బాగా నడుస్తున్న యూపీఐ లావాదేవీలపై రుసుములు విధిస్తే మరి ఎలాంటి ప్రభావం ఉంటుంది? ప్రజలపై భారం పడుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే ఆర్బీఐ ప్రజల స్పందనను కోరుతోంది. లావాదేవీపై ఫీజు పెడితే అది స్థిరంగా ఉండాలా? నగదు విలువ బట్టి ఉండాలా? ఛార్జీలు ఆర్బీఐ విధించాలా? మార్కెట్‌ శక్తులు నిర్ణయించాలా? ఛార్జీలేమీ వద్దంటే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలా? అని అడుగుతోంది.


ఒకవేళ ఛార్జీలు అమలు చేసినా ప్రతికూల ప్రభావం తక్కువే ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మీరు మీ స్నేహితుడికి నగదు పంపిస్తున్నారనుకోండి, ఛార్జీలు వేయకపోవచ్చు. స్టోర్లు, వ్యాపార సంస్థలకు డబ్బు చెల్లిస్తుంటే రుసుములు విధించొచ్చు. అదే జరిగితే ఒకపై రూ.100కు మించిన యూపీఐ లావాదేవీలకే వ్యాపారస్థులు అనుమతించొచ్చు. లేదంటే ప్రతి లావాదేవీకి ఒక రూపాయి అదనంగా వసూలు చేయొచ్చు. ఏదేమైనా డెబిట్‌, క్రెడిట్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌తో పోలిస్తే స్వల్ప ఛార్జీలే ఉండొచ్చని అంచనా. అక్టోబర్‌ వరకూ ఆగితే ఆర్బీఐ ఏం చేస్తుందో క్లారిటీ వస్తుంది.