Silver Rate July: 


బంగారం తర్వాత భారతీయులకు అత్యంత ఇష్టమైన లోహం 'వెండి'! పుత్తడితో నగలు మాత్రమే చేయించుకుంటే వెండిని (Silver Price) అనేక రకాలుగా ఉపయోగించుకుంటారు. నగలు, పాత్రలు, వస్తువులు, కళాఖండాలుగా వాడుకుంటారు. ఈ మధ్య కాలంలో స్వర్ణంతో పోలిస్తే రజతమే రంజితంగా మారింది. దాంతో ధరలు కొండెక్కుతున్నాయి. జులై నెల్లో ట్రెండ్‌ను పరిశీలిస్తే కిలో వెండి మళ్లీ రూ.83,000కు చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.


క్రమంగా పెరుగుదల


ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో (Silver Rate In Hyderabad) గ్రాము వెండి రూ.81.5గా ఉంది. ఇక కిలో రూ.81,800గా ఉంది. చివరి పది రోజుల్లోనే ట్రెండ్‌ మారింది. ధరలు విపరీతంగా పెరిగాయి. జులై ఎనిమిదిన కిలో వెండి రూ.76,700కు దొరికింది. 12న రూ.77,000కు చేరుకుంది. ఏమైందో తెలియదు గానీ ఆ మరుసటి రోజే ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. ఏకంగా 2.5 శాతం అంటే దాదాపుగా రూ.2500 పెరిగి రూ.79,500కు చేరింది. జులై 14న మరో రూ.1800 పెరిగింది. ఆ తర్వాతి రోజు రూ.500 ఎగిసింది. దాంతో జులై 16న కిలో వెండి ధర రూ.81,800కు ఎగబాకింది. నేడు రూ.300 వరకు తగ్గి రూ.81,500 వద్ద కొనసాగుతోంది.


ఏడాది నుంచీ ఇదే వరుస


చివరి 12 నెలల్లో వెండి ట్రెండు గమనిస్తే జులై ముగసే సరికి కిలో రూ.83,500 చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏప్రిల్‌ 2022లో కిలో వెండి కనిష్ఠ ధర రూ.68,800. గరిష్ఠం రూ.75,200. ఆ తర్వాత క్రమంగా తగ్గింది. సెప్టెంబర్‌లో రూ.58,000కు చేరుకుంది. ఎప్పుడైతే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం మొదలైందో ధరలు మళ్లీ విజృంభించాయి. ద్రవ్యోల్బణం, అమెరికా డాలర్‌ ఒడుదొడుకుల వంటివి ఇందుకు దోహదం చేశాయి. దాంతో ఈ ఏడాది జనవరిలో కనిష్ఠంగా రూ.73,500, గరిష్ఠంగా రూ.77,300కు పెరిగింది. ఏప్రిల్‌లో అయితే కనిష్ఠమే రూ.77,100. మే నెలలో కనిష్ఠ ధర రూ.77,100కు తగ్గినా రూ.83,000తో రికార్డు సృష్టించింది. ఆ మరుసటి నెల్లోనే రూ.83,700కు చేరుకొని ఆల్‌టైమ్‌ హై రికార్డు నెలకొల్పింది.


శ్రావణంలో మోతే?


సాధారణంగా ఆషాఢ మాసంలో వెండి, బంగారం, పట్టు వస్త్రాల ధరలు తగ్గుతుంటాయి. కానీ ఈసారి అలాంటిదేమీ కనిపించలేదు. ఎప్పట్లాగే ధరలు పెరిగాయి. జూన్‌ నెలలో కిలో వెండి కనిష్ఠ ధర రూ.74,000, గరిష్ఠ ధర రూ.79,800గా రికార్డైంది. జులై మాసం ఆరంభం నుంచీ ఇదే వరుస! ఒక రోజు విపరీతంగా పెరిగి మరుసటి రోజు కొద్దిగా తగ్గుతోంది. మంగళవారం నుంచి అధిక శ్రావణం మొదలైంది. ఆ తర్వాత శ్రావణ మాసం మొదలవుతుంది. శుభకార్యాలు, తిథులు, పుణ్య కార్యాలకు ఈ మాసం ఎంతో ప్రత్యేకం. చాలామంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అలాగే నూతన గృహ ప్రవేశాలు చేస్తుంటారు. పెళ్లి ముహూర్తాలు పెడుతుంటారు. అలాంటప్పుడు వెండి ధరలు పెరుగుతాయే తప్ప తగ్గవని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ గమనిస్తుంటే కిలో వెండి మరికొన్ని రోజుల్లో రూ.85,000కు చేరుకున్న ఆశ్చర్యం లేదు.


Also Read: పతంజలి ఫుడ్స్‌పై కన్నేసిన 'అదానీ ఇన్వెస్టర్‌'! టార్గెట్‌ పెంచేశారుగా!!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial