RBI Repo Rate Cut May Boost Demand Of Electronic Gadgets: శుక్రవారం (07 ఫిబ్రవరి 2025) నాడు, ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాలను వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించినట్లు ప్రకటించింది. ఫలితంగా, రెపో రేట్ 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగి వచ్చింది. 2020 మే నెల తర్వాత, గత ఐదు సంవత్సరాలలో మొదటిసారిగా రెపో రేటు తగ్గింది. RBI రెపో రేట్ తగ్గడం వల్ల అన్ని బ్యాంక్లు & ఫైనాన్సింగ్ కంపెనీలు కూడా తక్కువ వడ్డీ రేట్లు & తక్కువ EMIలతో కొత్త లోన్లను ఆఫర్ చేస్తాయి. ఇది, ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకర్షిస్తుంది. ఫ్లోటింగ్ రేట్తో ఇప్పటికే తీసుకున్న లోన్ల మీద కూడా EMI తగ్గుతుంది, ఈ రూపంలోనూ జనం చేతిలో కొంత డబ్బు మిగులుతుంది. కొత్త & పాత లోన్లపై నెలనెలా చెల్లించాల్సిన ఈఎంఐ తగ్గడం వల్ల స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల కోసం డిమాండ్ పెరగవచ్చు. తదనుగుణంగా అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.
ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా
వ్యక్తిగత రుణాలు & క్రెడిట్ కార్డ్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ప్రజలు స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, ఓవెన్లు, ఎలక్ట్రానిక్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై ఎక్కువ ఖర్చు చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వేసవి కాలం ప్రారంభమైంది. సాధారణంగానే, సమ్మర్లో ఫ్రిజ్లు, ఏసీలు, కూలర్లు వంటి శీతల యంత్రాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు EMIలు తగ్గే అవకాశం వల్ల వీటి అమ్మకాలకు బూస్టర్ డోస్ దొరుకుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ అమ్మకాల్లో ఫైనాన్సింగ్ (EMI పద్ధతిలో వస్తువులు కొనడం) పెద్ద పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ప్రజలు స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీల వైపు ఎక్కువగా మొగ్గు చూపొచ్చని అంచనా వేశారు.
దేశంలో ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో RBI రెపో రేటును తగ్గించింది. తద్వారా, ప్రజల వినియోగం, పొదుపులు & పెట్టుబడుల శక్తి పెరుగుతుంది. వీటి వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుని, దేశ ఆర్థిక వృద్ధిలో వేగం పెరుగుతుంది.
2025 బడ్జెట్లో ఆదాయ పన్నుపై భారీ ఉపశమనం
ఆర్బీఐ రెపో రేట్ను కోతను తగ్గించడానికి ముందు, ఫిబ్రవరి 01న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) సమర్పించిన కేంద్ర సాధారణ బడ్జెట్ (Union Budget 2025)లో, రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను ఉపశమనం లభించింది. ఇది, మన దేశంలో మెజారిటీ వినియోగ వర్గమైన మధ్య తరగతి ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతుంది, వాళ్ల చేతుల్లో డబ్బు మిగులుతుంది. దీనివల్ల కూడా, భవిష్యత్లో వివిధ ఉత్పత్తులకు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ పెరగవచ్చు.
మరో ఆసక్తికర కథనం: రూ.87,000 పైనే గోల్డ్, స్థిరంగా సిల్వర్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ