Kalyan Jewellers Shares Plunge 32% From All-time High: కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ల పతనం కొనసాగుతోంది. శుక్రవారం (07 ఫిబ్రవరి 2025), ఈ ఆభరణాల తయారీ కంపెనీ షేర్లు జనవరి 2 నాటి ఆల్ టైమ్ హై స్థాయి నుంచి 32 శాతం పడిపోయాయి. ఈ పతనంతో రెండు స్టాక్‌ ఎక్సేంజీలు BSE & NSE కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్‌ను అదనపు నిఘా చర్యల (Additional Surveillance Measure) కింద కఠినమైన పర్యవేక్షణలో ఉంచాయి. అధిక అస్థిరత ఉన్న షేర్లలో పెట్టుబడి పెట్టినప్పటికీ, స్టాక్ మార్కెట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నిలబెట్టడం దీని ఉద్దేశ్యం.


కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లను ప్రస్తుతం స్వల్పకాలిక నిఘాలో ఉంచారు. అంటే.., పెట్టుబడిదారులకు ఈ స్టాక్‌ గురించి మరింత సమాచారం అవసరం అన్న విషయాన్ని ఇది సూచిస్తుంది. ఈ స్టాక్ గురించి మార్కెట్‌లో ఆందోళనలు ఉన్నాయన్న సంగతిని కూడా ఈ చర్య ప్రతిబింబిస్తుంది. ఉద్దేశపూర్వకంగా షేర్‌ ధరలను తగ్గించడానికి ఏదైనా ప్రయత్నం జరుగుతుందా అని స్టాక్ ఎక్స్ఛేంజ్ గమనిస్తూ ఉంటుంది.


కళ్యాణ్ జ్యువెలర్స్ స్పందన
2025 జనవరి 02న, కళ్యాణ్ జ్యువెలర్స్ షేరు ధర ఒక్కో షేరుకు గరిష్టంగా రూ. 794.60 కి ‍‌(Kalyan Jewellers Shares All-time High Level) చేరుకుంది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి ఒక్కో షేరు ధర 0.45 శాతం పడిపోయి రూ. 539.65 స్థాయిలో ఉంది. ఓవరాల్‌గా చూస్తూ, రికార్డ్‌ గరిష్ట స్థాయి నుంచి 32 శాతం పతనమైంది. స్టాక్‌ ప్రైస్‌లో పతనంపై స్పందిస్తూ కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.  కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ ధరల పతనంలో కంపెనీ పాత్ర లేదని కంపెనీ ప్రమోటర్ టి.కె. సీతారామన్‌ చెప్పారు. మార్కెట్ పరిస్థితులు, మార్కెట్ కదలికలపై షేర్‌ ధర ఆధారపడి ఉంటుంది, తన నియంత్రణ ఏమీ లేదని వెల్లడించారు.


భారతీయ కంపెనీ కళ్యాణ్ జ్యువెలర్స్, వివిధ దేశాల్లో వ్యాపారం చేస్తోంది. దీనిని. 1993లో టి.ఎస్. కళ్యాణ్ రామన్ స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం కేరళలోని త్రిస్సూర్‌లో ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్‌కు భారతదేశంతో సహా మధ్యప్రాచ్య దేశాలలో షోరూమ్‌లు ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం, 2024 జులై నాటికి ఈ కంపెనీకి మొత్తం 277 షోరూమ్‌లు ఉన్నాయి.



కంపెనీ షేర్ల పతనం ఇందుకే...
డిసెంబర్ త్రైమాసిక బిజినెస్‌ అప్‌డేట్స్‌ విడుదలైనప్పటి నుంచి కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు క్షీణించాయి. మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కంపెనీలో ఆదాయ పన్ను అధికార్ల సోదాలు, ప్రమోటర్‌పై నమోదైన FIR వంటివి షేర్‌ ధర పతనానికి ప్రధాన కారణాలు. దీనితో పాటు, సోషల్ మీడియాలో చెలరేగిన పుకార్లు కూడా స్టాక్‌ను గణనీయంగా పడదోశాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మీ క్రెడిట్‌ రిపోర్ట్‌ ఒక సైలెంట్‌ కిల్లర్‌- కంప్లైంట్‌ చేయకపోతే మీ భవిష్యత్‌ నాశనం!