Housing Sales: మన దేశంలో స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దీంతో, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో బూమ్‌ కనిపిస్తోంది. గత త్రైమాసికంలో (2022 అక్టోబర్‌ - డిసెంబర్‌ కాలం) నివాస గృహాల కొనుగోళ్ల విలువ 11 శాతం పెరిగింది. దేశంలోని టాప్-7 నగరాల్లో ఈ పెరుగుదల నమోదైంది. 


రేటింగ్ ఏజెన్సీ ICRA ప్రకారం... మూడో త్రైమాసికంలో, దేశంలోని 7 పెద్ద నగరాల్లో మొత్తం 149 మిలియన్ చదరపు అడుగుల పరిమాణంలో నివాస స్థలాలు అమ్ముడయ్యాయి. గత 10 సంవత్సరాల్లోని మూడో త్రైమాసికాల్లో నమోదైన గణాంకాలకంటే ఇదే అధికం. 


2021 అక్టోబర్‌ - డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే, 2022 అక్టోబర్‌ - డిసెంబర్‌ కాలంలో (సంవత్సరం ప్రాతిపదికన) నివాస స్థలాల విక్రయ విలువ 11 శాతం వృద్ధి చెందింది. 


2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల వరకు (2022 ఏప్రిల్‌- డిసెంబర్‌ కాలం), ఈ టాప్ 7 నగరాల్లో 412 మిలియన్ చదరపు అడుగుల భూమి చేతులు మారింది. 2021లో ఇదే సమయంలో, ఈ సంఖ్య 307 మిలియన్ చదరపు అడుగులు మాత్రమే.


నివాస స్థలాల విక్రయాలు పెరిగిన నగరాలు
ICRA డేటా ప్రకారం... బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, దిల్లీ-NCR, పుణె నగరాల్లో నివాస స్థలాల విక్రయాల్లో వృద్ధి కనిపించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో, ఈ నగరాల్లోని లగ్జరీ ఫ్లాట్ల అమ్మకాల్లో 16 శాతం, మీడియం ఫ్లాట్ల అమ్మకంలో 42 శాతం పెరుగుదల నమోదైంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 14 శాతం & 36 శాతంగా ఉంది.


2023-24లోనూ వృద్ధి కొనసాగుతుంది
2022-23 (FY23) ఆర్థిక సంవత్సరం బూమ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని ICRA వైస్ ప్రెసిడెంట్ అనుపమ రెడ్డి తెలిపారు. మొత్తం FY23లో, నివాస స్థిరాస్తి విభాగంలో విక్రయాల విలువ 8 నుంచి 12 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామని, FY24లో ఇది 14 నుంచి 16 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. 


ఆషియానా హౌసింగ్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, DLF లిమిటెడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, కీస్టోన్ రియల్టర్స్, కోల్టే-పాటిల్ డెవలపర్స్‌, మాక్రోటెక్ డెవలపర్స్‌, మహీంద్ర లైఫ్‌స్పేసెస్ డెవలపర్స్‌, ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, పురవంకర, శోభ లిమిటెడ్, సన్‌టెక్ రియల్టీ కంపెనీల్లో జరిగిన లావాదేవీలను తన సర్వే కోసం ఇక్రా తీసుకుంది.


రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేటును నిరంతరం పెంచిన తర్వాత గృహ రుణాలు చాలా ఖరీదుగా మారాయని అనుపమ రెడ్డి చెప్పారు. రెపో రేటుకు అనుగుణంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచినా, అవి ఇప్పటికీ కొవిడ్‌ పూర్వ స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయి, ప్రజల ఆర్థిక స్థోమత కూడా పెరిగిందని అనుపమ వెల్లడించారు. అందువల్లే, ప్రజలు స్థిరాస్తిపై భారీగా పెట్టుబడి పెట్టడానికి, ముఖ్యంగా పెద్ద నగరాల్లోని పెద్ద ఇళ్ల కోసం డబ్బులు ఖర్చు చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. 


ఇన్వెంటరీలు (అమ్ముడుపోకుండా మిగిలిన ఇళ్లు) 2021 డిసెంబర్‌ నాటికి ఉన్న 923 msf కంటే 2022 డిసెంబర్‌ నాటికి 839 msf కు తగ్గడాన్ని రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు సానుకూలమని అనుపమ రెడ్డి చెప్పారు. అయితే, మార్కెట్‌లో ఉద్యోగాల కొరత, వడ్డీ రేట్ల పెంపుదల ప్రభావం రానున్న కాలంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని కూడా వివరించారు.