Income Tax Payers: గత కొన్నేళ్లుగా, ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) తర్వాత, మన దేశంలో ఆదాయ పన్ను చెల్లింపుదార్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడానికి ఆదాయ పన్ను విభాగం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించాయి.     

  


పన్ను ఎగవేతలను అరికట్టేందుకు, ఆదాయ పన్ను విభాగం గత కొన్నేళ్లుగా అనేక చర్యలు చేపట్టింది. పన్ను చెల్లింపుదార్ల కోసం అందుబాటులోకి వచ్చిన సేవలు పెరిగాయి, దీంతో పాటు ఫైలింగ్‌ అనుకూలత కూడా పెరిగింది. ఫలితంగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి (2015-16 అసెస్‌మెంట్‌ ఇయర్‌ నుంచి) నుంచి పన్ను చెల్లింపుదారుల సంఖ్య 58 శాతం పెరిగింది. దీనివల్ల ఆదాయ పన్ను వసూళ్లలో విపరీతమైన వృద్ధి కనిపించింది.


260% పెరిగిన ₹10 లక్షల పైగా సంపాదిస్తున్న వారి సంఖ్య      
2015-16 నుంచి 2021-22 మదింపు సంవత్సరాల మధ్య కాలంలో, వార్షిక ఆదాయం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్ల సంఖ్యల సమాచారం వెల్లడైంది. కొన్ని రోజుల క్రితం, ఈ అంశంపై పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా సంబంధిత గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.


కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏడాదికి రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారి సంఖ్య అతి భారీగా, విపరీతంగా పెరిగింది. 2015-16 మదింపు సంవత్సరంలో, రూ. 10 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 22,54,532 మాత్రమే. 2021-22 మదింపు సంవత్సరం నాటికి ఇది ఏకంగా 260 శాతం పెరిగి 81,06,067 కి చేరుకుంది.       


163% పెరిగిన ₹5-10 లక్షలు సంపాదిస్తున్న వారి సంఖ్య      
రూ. 5 నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తున్న పన్ను చెల్లింపుదార్ల సంఖ్యను పరిశీలిస్తే... 2015-16 అసెస్‌మెంట్ ఇయర్‌లో వీళ్ల సంఖ్య 53,34,381 కాగా, 2021-22 మదింపు సంవత్సరంలో 163 శాతం జంప్‌తో 1,40,74,602 కి పెరిగింది.


27% పెరిగిన ₹5 లక్షల లోపు ఆదాయ వర్గాల సంఖ్య
రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 2015-16 అసెస్‌మెంట్ సంవత్సరంలో 3,23,71,825 కాగా, 2021-22 మదింపు సంవత్సరంలో ఈ సంఖ్య 27 శాతం పెరిగి 4,11,60,543 కి చేరుకుంది. 


ఈ గణాంకాలను బట్టి మనం ఒక విషయం అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడు సంవత్సరాల్లో (2015-16 నుంచి 2021-22 మధ్య కాలంలో) ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగితే, తక్కువ సంపాదిస్తున్న వాళ్ల సంఖ్య చాలా తక్కువగా పెరిగింది. అంటే.. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్లు పేదవాళ్లలాగే మిగిలిపోతున్నారు.    


2015-16 అసెస్‌మెంట్ సంవత్సరంలో మొత్తం పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 3,99,60,738గా ఉంటే... 2021-22 మదింపు సంవత్సరంలో ఇది 58 శాతం పెరిగి 6,33,38,212 కి చేరుకుంది.       


మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, 2014-15 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ. 2,58,371 కోట్లు కాగా... 2021-22 నాటికి అది రూ. 6,73,413 కోట్లకు పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 4,28,924.74 కోట్లు కాగా.. 2021-22 ఆర్థిక సంవత్సంలో రూ. 7,12,037 కోట్లకు పెరిగాయి.