Benefits Of UPS: "ఏకీకృత పింఛను పథకం" (Unified Pension Scheme - UPS) ప్రకటన తర్వాత, NPS కింద పదవీ విరమణ చేసిన వారికి UPS ప్రయోజనాలు లభిస్తాయా, లేదా? అన్న విషయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం చూస్తే, ఈ ప్రశ్నకు సమాధానం "ఔను". UPS బెనిఫిట్స్‌ పొందడానికి రెండు ఆప్షన్లు ఉంటాయి.


ఉద్యోగులు కోరుకుంటే, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లేదా యూనిఫైడ్‌ పెన్షన్ స్కీమ్‌లో (UPS) ఒకదానిని ఎంచుకోవచ్చు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు NPSకు కాంట్రిబ్యూట్‌ చేసి, అన్ని నిబంధనలను అనుసరించినట్లయితే, భవిష్యత్తులో అతను UPS కింద ప్రయోజనాలను పొందగలడు. అయితే, ఏకీకృత పింఛను పథకం కింద కొన్ని నిబంధనలు & షరతులు వర్తిస్తాయి. ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకాన్ని ఎన్‌పీఎస్‌తో అనుసంధానించి ఇప్పటికే పదవీ విరమణ చేసిన వ్యక్తులకు కూడా అమలు చేస్తే, వాళ్లు దాని ప్రయోజనాలను పొందవచ్చు.


UPS అంటే ఏంటి?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పెన్షన్ పథకమే "యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌". 24 ఆగస్టు 2024న‍ (శనివారం), ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించారు. 


ఇప్పుడు, నూతన పథకం నుంచి కొంచెం వెనక్కి వెళ్దాం. 'ఓల్డ్‌ పెన్షన్ స్కీమ్' ‍(OPS) 31 డిసెంబర్ 2003 లోపు ఉద్యోగంలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. పాత పింఛను విధానంలో, పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి నిర్ణీత మొత్తాన్ని ఇచ్చేది. ఈ పెన్షన్ విధానాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 2004 నుంచి తొలగించింది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, 01 జనవరి 2004 నుంచి NPSను అమల్లోకి తెచ్చింది. ఈ తేదీ నుంచి ఉద్యోగంలో చేరినవాళ్లకు NPS వర్తిస్తుంది.


UPSకు ఎవరు అర్హులు?
ఈ పెన్షన్ పథకం 01 ఏప్రిల్ 2025 నుంచి అమలవుతుంది. ఈ పథకం ప్రయోజనం 31 మార్చి 2025 నాటికి పదవీ విరమణ చేయబోయే అందరికీ అందుబాటులో ఉంటుంది. UPS ద్వారా 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.


NPS అంటే ఏంటి?
దీనిని న్యూ పెన్షన్‌ స్కీమ్‌ అని కూడా పిలుస్తారు. ఈ పథకం కింద, ఉద్యోగం చేసే వ్యక్తులు (ప్రభుత్వం & ప్రైవేట్) తమ జీతం నుంచి కొంత డబ్బును పెన్షన్ స్కీమ్‌కు జమ చేస్తారు. ఉద్యోగి పని చేసే సంస్థ యాజమాన్యం (కంపెనీ లేదా ప్రభుత్వం) కూడా తమ వంతు వాటా చెల్లిస్తారు. పదవీ విరమణ తర్వాత పెన్షన్‌తో పాటు పెట్టుబడి ప్రణాళికగా NPSను ప్రారంభించారు. ఉద్యోగుల పెట్టుబడి పెరిగితే, పెన్షన్‌ రూపంలో వచ్చే డబ్బు కూడా పెరుగుతుంది. ఉద్యోగి పెట్టే పెట్టుబడి స్టాక్‌ మార్కెట్‌తో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ పథకాల్లో నష్టభయం కూడా ఉంది. నష్టభయాన్ని భరిస్తున్నప్పటికీ, రిటైర్‌ అయిన వ్యక్తి యాన్యుటీ ప్లాన్స్‌ నుంచి 15% వరకు మాత్రమే రాబడిని పొందగలడు. NPS కింద, ఉద్యోగుల మూల వేతనం + DAలో 10 శాతాన్ని కాంట్రిబ్యూట్‌ చేయాలి. ప్రభుత్వం కూడా ఉద్యోగి జీతంలో 14% డబ్బును ఫండ్‌లో జమ చేస్తుంది. ఉద్యోగి ఈ ఫండ్‌లో కొంత భాగాన్ని ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.


NPS కింద, ఒక వ్యక్తి ఉద్యోగంలో ఉన్నప్పుడే కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రైవేట్ కంపెనీలకు చెందిన వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ICICI, SBI, HDFC లాంటి బ్యాంక్‌లు, LIC సహా మొత్తం 9 సంస్థలు పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నాయి.


రిటైర్‌ అయిన రోజున, అప్పటి వరకు పోగైన డబ్బు నుంచి గరిష్టంగా 60 శాతం వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు, ఆ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. కనీసం 40 శాతం డబ్బును యాన్యుటీ ప్లాన్స్‌లో పెట్టుబడి పెట్టాలి. ఈ ప్లాన్స్‌ నుంచి పెన్షన్‌ రూపంలో డబ్బు అందుతుంది. యాన్యుటీ ప్లాన్స్‌ అనేవి స్టాక్ మార్కెట్‌ పెట్టుబడి పథకాలు కాబట్టి, మార్కెట్‌ పెరిగితే పెన్షన్‌ పెరుగుతుంది, మార్కెట్‌ తగ్గితే పెన్షన్‌ తగ్గుతుంది. అంటే, పింఛను మొత్తం స్థిరంగా ఉండదు.


NPS, OPS నుంచి ఏ విషయాలను OPSలో చేర్చారు?
NPS కింద, ఉద్యోగుల పెన్షన్ కోసం వారి జీతం నుంచి 10 శాతం తగ్గిస్తారు. UPSలో కూడా ఉద్యోగి జీతంలో 10% తీసివేస్తారు. యూపీఎస్ పథకంలో మెడికల్ రీయింబర్స్‌మెంట్, బకాయిల్లో ఎలాంటి మార్పు లేదు. ఎన్‌పీఎస్ తరహాలోనే ఈ రెండు ప్రయోజనాలు లభిస్తాయి.


కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్‌ను అమలు చేసినప్పుడు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రతినెలా స్థిరమైన పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు, ఏకీకృత పింఛను పథకం కింద, ప్రతినెలా జీతంలో 50% పెన్షన్‌గా ఇస్తామని కేంద్రం చెప్పింది. ఈ నిబంధన OPS తరహాలో ఉంటుంది.


గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ప్రతి 6 నెలల సర్వీస్ పూర్తయిన తర్వాత, జీతం + DAలో 10% మొత్తాన్ని యాడ్‌ చేసుకుంటూ వెళ్లి, చివరలో ఒకేసారి ఆ మొత్తం ఇస్తారు. గ్రాట్యుటీని లంప్సమ్‌ (ఏకమొత్తం) అని కూడా పిలుస్తారు.


UPSలో ఉద్యోగులు & ప్రభుత్వ సహకారం ఎంత?
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ 10 శాతం మాత్రమే. కేంద్రం సహకారాన్ని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పునర్మూల్యాంకనం చేస్తారు. 


మరో ఆసక్తికర కథనం: లిబియా దెబ్బకు చమురు రేట్ల మంట - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి