Paytm Shares: పేటీఎం కంపెనీ ఇన్వెస్టర్లకు పెద్ద శుభవార్త. ఇటీవలి కాలంలో సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిజిటల్ పేమెంట్స్ దిగ్గజానికి సానుకూలమైన వార్త ఒకటి ఉంది. ఇది కంపెనీ వృద్ధిపై ఇన్వెస్టర్లలో కొత్త నమ్మకాన్ని నింపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి ముందు సీఈవో విజయ్ శేఖర శర్మ సైతం కంపెనీ తన కూతురు లాంటిదని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పేటీఎం విలువను 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. 


కష్టాల్లో ఉన్న డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఒక కీలకమైన అనుబంధ సంస్థలో 6 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి.. చైనా-లింక్డ్ పెట్టుబడులను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ ప్యానెల్ నుంచి రెండేళ్ల తర్వాత గ్రీన్ సిగ్నల్ అందుకుందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. ఈ వ్యవహారం గురించి ముగ్గురు వ్యక్తులు సమాచారం అందించినట్లు వెల్లడించింది. అయితే ఆమోదానికి ఇంకా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ అవసరమని తెలుస్తోంది. ఇది పేటీఎం చెల్లింపు సేవల కార్యకలాపాలు సాధారణ స్థితికి రావటాన్ని నిరోధించే ప్రాథమిక అడ్డంకిని తొలగించనుంది. 


దీనికి ముందు గతంలో ప్రభుత్వ ప్యానెల్ తన అనుమతిని వెనక్కి తీసుకుంది. అప్పట్లో పేటీఎం కంపెనీలో చైనాకు చెందిన యాంట్ గ్రూప్ దాదాపు 9.88 శాతం వాటాలు కలిగి ఉంటం కారణంగా చూపింది. 2020లో చైనా-భారత్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణ తర్వాత చైనా వ్యాపారాలపై భారత్ తన పరిశీలనను పెంచిన తరుణంలో ప్యానెల్ నిరాకరించింది. దీంతో అప్పటి నుంచి పేటీఎం ప్యానెల్ అనుమతి కోసం వేచి ఉంది. లేకుంటై మార్చి 2023లో కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఇచ్చిన ఆదేశాలతో కంపెనీ తన చెల్లింపుల వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చేదని వెల్లడైంది. 


పేటీఎం మెుత్తం వ్యాపారాల్లో పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ ఆదాయాల పరంగా చాలా కీలకమైనది. ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మెుత్తం ఆదాయంలో నాలుగో ఒంతు దీని నుంచే వచ్చినట్లు మార్చి 2023తో ముగిసిన కాలంలో కంపెనీ పేర్కొంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీకి సంబంధించిన మరో వ్యాపార యూనిట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆర్బీఐ ఆగ్రహానికి గురైంది. దీంతో వ్యాపారాన్ని పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. 


ఆమోదం అధికారికం అయిన తర్వాత పేటీఎం భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి "చెల్లింపు అగ్రిగేటర్" లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందుతుంది. ఈ వ్యవహారంపై పేటీఎం కంపెనీ గానీ, ప్రభుత్వ అధికారులు సైతం అధికారికంగా స్పందించలేదు. అయితే కంపెనీ మనుగడకు చాలా కీలకమైన ప్యానెల్ అప్రూవల్ పొందటంపై ఇన్వెస్టర్లు సంతోషంగా ఉన్నారు. దీంతో రేపు మార్కెట్లు తెరుచుకోగానే పేటీఎం స్టాక్ భారీగా లాభపడనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈరోజు మార్కెట్ల ముగింపు సమాయనికి పేటీఎం షేర్ ఒక్కోటి ఎన్ఎస్ఈలో స్వల్పంగా 2.4 శాతం నష్టంతో రూ.461 వద్ద స్థిరపడ్డాయి. ప్రస్తుతం పేటీఎం మెుత్తం మార్కెట్ క్యాప్ రూ.29,370 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లు రేపు మార్కెట్లు తెరుచుకోవటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.