Nifty at 21000 Level: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ఫలితాలపై ఇన్వెస్టర్లు/ట్రేడర్లు దృష్టి పెట్టడంతో, ఈ రోజు (శుక్రవారం, 08 డిసెంబర్‌ 2023) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభమైంది. కీలక ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీలో సానుకూలత కనిపించింది.  నిఫ్టీ తొలిసారిగా 21000 మైలురాయిని దాటింది. 


ఇథనాల్‌ వినియోగం విషయంలో నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటనతో, ఈ రోజు షుగర్‌ స్టాక్స్‌ (Sugar Stocks today) చేదెక్కాయి.


ఈ రోజు ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, ఇండియన్‌ బుల్స్‌ ఆ సిగ్నల్స్‌ను పట్టించుకోలేదు. చమురు ధరలు బాగా తగ్గడం, నిన్న (గురువారం) US స్టాక్స్‌ బాగా పెరగడంతో స్వదేశంలో సెంటిమెంట్స్‌ బలపడ్డాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (గురువారం) 69,522 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 144 పాయింట్లు జంప్‌ చేసి 69,666 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గత సెషన్‌లో 20,901 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 33 పాయింట్ల స్వల్ప లాభంతో 20,934 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే, కీలక మానసిక స్థాయి 21000 మార్క్‌ను నిఫ్టీ అందుకుంది, 21,005.05 వరకు (ఉదయం 10.10 గంటల సమయానికి) వెళ్లింది. నిఫ్టీకి ఇది కొత్త జీవితకాల గరిష్టం (Nifty fresh all-time high).


ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో.. JSW స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, HCL టెక్‌, విప్రో, NTPC, ITC స్టాక్స్‌ లాభాలను లీడ్‌ చేస్తే... ICICI బ్యాంక్‌, మారుతి, SBI, భారతి ఎయిర్‌టెల్‌, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.


BSE మిడ్‌ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు బలంగా నిలబడ్డాయి, ఒక్కొక్కటి 0.4 శాతానికి పైగా పెరిగాయి.


నిఫ్టీ 50 ప్యాక్‌లో... JSW స్టీల్‌, యూపీఎల్‌, HCL టెక్‌, LTI మైండ్‌ట్రీ, అపోలో హాస్పిటల్స్‌ 1% పైగా లాభపడ్డాయి. ICICI బ్యాంక్‌, SBI, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌, మారుతి, డా.రెడ్డీస్‌ క్షీణించాయి.


ఓపెనింగ్‌ టైమ్‌లో, ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో, నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్‌ 1 శాతం పైగా పెరిగింది. 


2023-24 సీజన్‌లో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నందున, ఈ సంవత్సరం ఇథనాల్ తయారీకి చెరకును ఉపయోగించవద్దని కేంద్ర ప్రభుత్వం అన్ని చక్కెర ఫ్యాక్టరీలను ఆదేశించింది. B-హెవీ మొలాసిస్ నుంచి ఇథనాల్ ఉత్పత్తికి అనుమతించింది. దీంతో ఈ రోజు ట్రేడింగ్‌లోనూ షుగర్‌ స్టాక్స్‌ రెడ్‌ జోన్‌లోకి జారుకున్నాయి. ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌, రేణుక షుగర్స్‌, ద్వారికేష్‌ షుగర్స్‌ దాదాపు 5-6% స్లిప్‌ అయ్యాయి. 


రెండేళ్ల పాటు కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా IIFL సెక్యూరిటీస్‌పై సెబీ గతంలో ఇచ్చిన ఆర్డర్‌ను SAT పక్కన పెట్టడంతో,  IIFL సెక్యూరిటీస్‌ షేర్లు 12 శాతం ర్యాలీ చేశాయి. ఇది సంస్థను రెండేళ్లపాటు కొత్త క్లయింట్‌లను తీసుకోకుండా నిరోధించింది.


ఉదయం 10.10 గంటల సమయానికి సెన్సెక్స్‌ 304.54 పాయింట్లు లేదా 0.44% పెరిగి 69,826.23 స్థాయి వద్ద; నిఫ్టీ 88.75 పాయింట్లు లేదా 0.42% పెరిగి 20,989.90 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి