Stocks to watch today, 6 September 2022: ఇవాళ ఉదయం 7.30 గంటల సమయానికి సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఆ సమయంలో 47.5 పాయింట్లు లేదా 0.27 శాతం గ్రీన్‌లో 17,732 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ సానుకూలంగా ప్రారంభమవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


డ్రీమ్‌ఫోక్స్‌ సర్వీసెస్‌: ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ఇవాళ లిస్ట్‌ కానుంది. గత నెల 24-26 తేదీల్లో సాగిన ఐపీవోలో, 56.68 రెట్లు ఇది సబ్‌స్క్రైబ్‌ అయింది. దీని ఇష్యూ ప్రైస్‌ రూ.326 కాగా, గ్రే మార్కెట్‌ ప్రీమియం (GMP) ప్రకారం దాదాపు రూ.400 దగ్గర లిస్ట్‌ కావచ్చని అంచనా. 


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL): వివిధ దేశాల్లో సౌర విద్యుత్‌కు సంబంధించిన సేవలు అందిస్తున్న  సెన్స్‌హాక్ ఇంక్‌లో (SenseHawk) మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందంపై రిలయన్స్‌ సంతకం చేసింది. ఈ మొత్తం లావాదేవీ విలువ $32 మిలియన్లు. భవిష్యత్ వృద్ధికి నిధుల కేటాయింపు, వాణిజ్య ఉత్పత్తుల విడుదల, R&Dకి కలిపి ఈ ఒప్పందం కుదిరింది.



టాటా మోటార్స్: దేశంలో మొట్టమొదటి CNG ట్రక్కును మీడియం & హెవీ కమర్షియల్ వెహికల్స్‌ (M&HCV) విభాగంలో 28, 19 టన్నుల నోడ్స్‌లో టాటా మోటార్స్‌ విడుదల చేసింది. CNG మోడళ్లు 5.7 లీటర్ల ఎస్‌జీఐ ఇంజిన్‌తో 180hp గరిష్ట శక్తిని, 650Nm టార్క్‌ను జెనరేట్‌ చేస్తాయి.


హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (HAL), లార్సెన్ & టూబ్రో (L&T): HAL, L&T ఏర్పాటు చేసిన స్పేస్ కన్సార్టియం, మరో ఐదు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ (PSLV) కోసం రూ.860 కోట్ల కాంట్రాక్ట్‌ దక్కించుకుంది. దేశీయ అంతరిక్ష & ఉపగ్రహ ప్రయోగాల పరిశ్రమలో ఆరోగ్యకరమైన వృద్ధి, ఏకీకరణకు ఇదొక సూచన.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: విలీనాలు & కొనుగోళ్లతో (M&A) దూకుడు మీదున్న గౌతమ్ అదానీ, తన వ్యూహాలను ముందుకు తీసుకెళ్లే కొత్త నాయకుడి కోసం వెతుకుతున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ M&A యాక్టివిటీని ప్రస్తుతం నడిపిస్తున్న వినోద్ బహేటీని త్వరలో కొత్త బిజినెస్ వర్టికల్‌కు మార్చనున్నారు.


మెటల్ రంగం: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ ఇండస్ట్రియల్‌ మెటల్స్‌ పరిస్థితి చాలా గందరగోళంగా మారింది. సరఫరాలో కోతలు, డిమాండ్ పడిపోవడం వంటి రెండు కోణాలూ కనిపించాయి. కొత్త సమీకరణాలు కూడా స్పష్టంగా లేవు. Q2FY23లో ఈ రంగం లాభాలు తగ్గవచ్చన్న అంచనాలు వస్తున్నాయి కాబట్టి, మెటల్ స్ప్రెడ్‌లు ఇంకా పడిపోయే అవకాశం ఉంది.


ఆర్‌ఈసీ: బాండ్ల జారీ ద్వారా రూ.75,000 కోట్ల వరకు సమీకరించేందుకు నిర్ణయించిన ఈ ప్రభుత్వరంగ సంస్థ, ఈ నెల 16న జరగనున్న సమావేశంలో వాటాదారుల ఆమోదం కోరబోతోంది. తీర్మానం ఆమోదించిన తేదీ నుంచి ఒక సంవత్సరం వ్యవధిలో, ఒకేసారి లేదా విడతల వారీగా, ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన డిబెంచర్ల జారీ చేసి నిధులు సమీకరిస్తారు.


మణప్పురం, ముత్తూట్: దేశంలోని గోల్డ్ లోన్ వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉండడం వల్ల, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చని రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ & పూర్స్ (S&P) వెల్లడించింది. మార్కెట్ లీడర్లయిన మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్‌ మాత్రం ఇప్పటివరకు సేఫ్‌ సైడ్‌లోనే ఉన్నాయి.


ఎన్‌టీపీసీ: దేశంలో అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్‌టీపీసీ, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్ (IBC) ప్రక్రియ ద్వారా, అవంత గ్రూప్‌నకు చెందిన ఝబువా థర్మల్ ప్రాజెక్టును కొనుగోలు చేసింది. దీని సామర్థ్యం 600 మెగావాట్లు. 


అదానీ పోర్ట్స్: అదానీ పోర్ట్స్ అండ్‌ స్పెషల్ ఎకనామిక్ జోన్స్‌కు సుప్రీంకోర్టు నుంచి ఊరట దక్కింది. ప్రభుత్వ సంస్థలు పిలిచే టెండర్లలో అదానీ పోర్ట్స్‌ పాల్గొనవచ్చంటూ సుప్రీంకోర్టు వెల్లడించింది.


ఇవాళ F&O నిషేధంలో ఉన్న స్టాక్స్‌: డెల్టా కార్ప్


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.