Stocks to watch today, 26 September 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 170 పాయింట్లు లేదా 0.98 శాతం రెడ్‌ కలర్‌లో 17,162 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్: ఇవాళ ఈ షేరు లిస్ట్‌ కాబోతోంది. ఈ నెల 14-16 తేదీల్లో నిర్వహించిన IPOలో రూ.314-330 ప్రైస్‌ బ్యాండ్‌లో షేర్లను విక్రయించడం ద్వారా ఈ కంపెనీ రూ.755 కోట్లను సమీకరించింది. ప్రెసిషన్ బేరింగ్ కేజ్‌ల తయారీలో దేశంలోనే అతి పెద్ద కంపెనీ ఇది.


భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL): ఈ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ, విభిన్న ప్రాంతాల నుంచి చమురును దిగుమతి చేసుకోవాలన్న ప్రణాళికలో భాగంగా లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్‌ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి బ్రెజిల్ జాతీయ చమురు కంపెనీ పెట్రోబ్రాస్‌తో (Petrobras) ఒప్పందం కుదుర్చుకుంది. 


బ్రిటానియా ఇండస్ట్రీస్: కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా వరుణ్ బెర్రీని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రజనీత్ కోహ్లీని ఈ FMCG మేజర్ డైరెక్టర్ల బోర్డు నియమించింది. ఈ నియామకాలు తక్షణం అమల్లోకి వచ్చాయి.


కోల్ ఇండియా: 4 ఉపరితల గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు మూడు ప్రభుత్వ రంగ సంస్థలు - భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), GAIL (ఇండియా)తో ఈ ప్రభుత్వ రంగ బొగ్గు గని సంస్థ  ఒప్పందాలు కుదుర్చుకోనుంది.


సుజ్లాన్ ఎనర్జీ: రైట్స్‌ జారీ ద్వారా రూ.1,200 కోట్లు సమీకరించేందుకు ఈ ప్రభుత్వ రంగ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో షేరును రూ.5 ఇష్యూ ధరతో, రూ.2 ముఖ విలువ కలిగిన 240 కోట్ల షేర్లను జారీ చేసి రూ.1,200 కోట్లను సమీకరించనుంది.


రెడింగ్టన్ ఇండియా: యాపిల్ కొత్త ఫోన్ మోడల్‌ ఐఫోన్ 14 భారత్‌లో అసెంబుల్‌ చేయనున్నారు. గ్లోబల్ టెక్ టైటన్ కంపెనీ, మన దేశంలో తయారీ సామర్థ్యం కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 14 మరికొన్ని రోజుల్లో భారతీయ వినియోగదారుల చేతుల్లోకి చేరుతుంది.


PI ఇండస్ట్రీస్: ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 10 లక్షల షేర్లను 315 కోట్ల రూపాయలకు ఈ ఆగ్రో కెమికల్స్ కంపెనీ ప్రమోటర్ ఆఫ్‌లోడ్ చేసారు. దేశీయ మ్యూచువల్ ఫండ్స్ (MFs), విదేశీ ఇన్వెస్టర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు షేర్లు కైవసం చేసుకున్నాయి.


స్టెరిలైట్ టెక్నాలజీస్: ఈ ఐటీ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి మిహిర్ మోదీ రాజీనామా చేశారు. అక్టోబర్ 15 నుంచి విధుల నుంచి ఆయన రిలీవ్ కానున్నారు.


యూనికెమ్ లేబొరేటరీస్: ఆప్టిమస్ డ్రగ్స్‌లో (Optimus Drugs) తనకున్న 19.97 శాతం ఈక్విటీ షేర్లను సెఖ్‌మెట్ ఫార్మావెంచర్స్‌కు ‍‌(Sekhmet Pharmaventures) విక్రయాన్ని యూనికెమ్‌ పూర్తి చేసింది. మొదటి విడత అమ్మకానికి సంబంధించిన సొమ్మును పొందింది.


స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్: ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ ద్వారా రూ.40.35 కోట్లు సమీకరించింది. 10,03,924 ముఖ విలువ గల 402 నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన జారీ చేసింది. ఏప్రిల్ 1, 2024ని వీటి మెచ్యూరిటీ తేదీగా నిర్ణయించారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.