Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) వరుసగా నాలుగో సెషన్లో నష్టపోయాయి. ఈ వారం సీపీఐ, ఐఐపీ డేటా వస్తుండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.  అంతర్జాతీయంగా మార్కెట్లలో అస్థిరత్వం చోటు చేసుకోవడం, ద్రవ్యోల్బణం భయాలు, ఎకానమీ మందగమనంలో ఉండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,167 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 276 పాయింట్లు నష్టపోయింది.

  


BSE Sensex


క్రితం సెషన్లో 54,364 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,544 వద్ద లాభాల్లో మొదలైంది. 54,598 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా అమ్మకాలు పెరగడంతో  53,519 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో కాస్త తేరుకొని 276 పాయింట్ల నష్టంతో 54,088 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 16,240 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,318 వద్ద ఓపెనైంది. ఉదయం నుంచి నష్టాల్లోనే కదలాడింది. 16,318 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. అమ్మకాల సెగతో 15,992 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఐరోపా మార్కెట్లు తెరుచుకున్నాక కాస్త కొనుగోళ్ల మద్దతు లభించింది. దాంతో 72 పాయింట్ల నష్టంతో 16,167 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ట్రేడై లాభాల్లోకి వచ్చింది. ఉదయం 34,686 వద్ద మొదలైంది. 34,143 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,793 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 210 పాయింట్ల లాభంతో 34,693 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభపడగా 28 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. శ్రీసెమ్‌, బజాజ్ ఫైనాన్స్‌, ఎల్‌టీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్‌ నష్టపోయాయి. బ్యాంకు, రియాల్టీ సూచీలు 0.05 శాతం వరకు లాభపడ్డాయి. ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, పవర్‌, క్యాపిటల్స్‌ గూడ్స్‌ సూచీలు ఎరుపెక్కాయి.