Apollo Tyres Ceat Shares: బలమైన డిమాండ్, Q2లో మార్జిన్లు పెరుగుతాయన్న అంచనాలతో ఇవాళ్టి (మంగళవారం) అస్థిర మార్కెట్‌లోనూ టైర్ కంపెనీల షేర్లు 8 శాతం వరకు ర్యాలీ చేశాయి.


అపోలో టైర్స్‌ షేరు ధర 8 శాతం పెరిగి రూ.274.25 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని తాకగా; సియట్ షేరు ధర 5 శాతం పెరిగి రూ.1,459 వద్ద రికార్డ్‌ స్థాయిని టచ్‌ చేసింది. జేకే టైర్ & ఇండస్ట్రీస్ 12 శాతం పెరిగి రూ.171.70కి చేరుకోగా, ఎంఆర్‌ఎఫ్‌, టీవీఎస్‌ శ్రీచక్ర, గుడ్‌ఇయర్ ఇండియా 4 శాతం వరకు లాభపడ్డాయి. వీటితో పోలిస్తే సెన్సెక్స్, నిఫ్టీ తీవ్ర ఒడిదొడుకుల్లో ఉన్నాయి.


రెండు సంవత్సరాల కష్టాల తర్వాత, భారతీయ టైర్ పరిశ్రమ FY22లో కోలుకుంది. FY22లో వాల్యూమ్స్‌ పెరగడంతో వ్యాపార వృద్ధి కొనసాగుతోంది. ప్రస్తుత డిమాండ్, టైరు కంపెనీలకు అనుకూలంగా ఉన్నప్పటికీ; కీలక ముడి పదార్థాలయిన నేచురల్‌ రబ్బర్‌ వంటి వాటి ధరలు ఎక్కువగా ఉండడం పరిశ్రమను ఇబ్బంది పెడుతోంది. పెట్టుబడి వ్యయాలు పెరగడం వల్ల పరిశ్రమ మార్జిన్లు, ఆదాయాలు ఒత్తిడిలో ఉన్నాయి. మొత్తంగా చూస్తే; కరోనా భయాలు దాదాపుగా తొలగిపోవడం,  OEMలు & రీప్లేస్‌మెంట్ సెగ్మెంట్ల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా టైర్ పరిశ్రమ మంచి పనితీరు కనబరుస్తుందని భావిస్తున్నారు.


ఫోకస్‌లో అపోలో టైర్స్
గత నెల రోజుల్లో అపోలో టైర్స్ స్టాక్ ధర 17 శాతం పెరిగింది. దీనితో పోలిస్తే సెన్సెక్స్‌ కేవలం 1.3 శాతం పెరిగింది. జూన్ త్రైమాసికంలో (Q1FY23) 11.6 శాతం ఎబిటా మార్జిన్‌ను (YoYలో 75 bps తగ్గుదల, QoQలో 38 bps పెరుగుదల) ప్రకటించి, బలమైన సంకేతాలను పంపడం వల్లే అపోలో టైర్స్‌ దూసుకెళుతోంది.


ద్రవ్యోల్బణం కారణంగా ముడిసరుకు రేట్లతోపాటు ఇతర ఖర్చులు (ఎనర్జీ, రవాణా ) బాగా పెరగడం వల్ల ఆపరేటింగ్ పెర్ఫార్మెన్స్‌ ప్రభావితమైందని అపోలో టైర్స్ ప్రకటించింది. కంపెనీ భారతదేశ వ్యాపారంతోపాటు యూరప్ వ్యాపారం కూడా టాప్ లైన్‌లో (YoY) బలమైన రెండంకెల వృద్ధిని నివేదించాయి. వాల్యూమ్స్‌లో పెరుగుదల, టైర్ల రేట్లు పెంచడం వల్ల టాప్‌ లైన్‌ పెరిగింది.


యూరోపియన్ మార్కెట్‌లో, ప్రత్యేకించి ప్యాసింజర్ వెహికల్ (PV) స్పేస్‌లో, మీడియం - లాంగ్‌ టర్మ్‌ డిమాండ్ ఔట్‌లుక్ మీద కంపెనీ చాలా ఆశాజనకంగా ఉంది. రుతుపవన ప్రభావం ప్రభావంతో ఏర్పడే సైక్లికాలిటీ కారణంగా రీప్లేస్‌మెంట్ సెగ్మెంట్‌లో Q2FY22లో డిమాండ్ మందకొడిగా ఉంటుందని మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల మీద వ్యయాలు పెంచిన నేపథ్యంలో, ఈ ఏడాది రెండో అర్ధభాగంలో (H2FY23) CV OEMల నుంచి పికప్‌ను ఆశిస్తోంది. 


రెగ్యులర్‌గా ధరలు పెంచడం, హయ్యర్‌ వాల్యూమ్‌లను దృష్టిలో పెట్టుకుని, మొత్తం FY23లో అపోలో టైర్స్ ఏకీకృత ఆదాయంలో రెండంకెల వృద్ధిని రిలయన్స్ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. FY24లోనూ బలమైన వాల్యూమ్ ట్రాక్షన్‌ను ఆశిస్తున్నారు. రూపాయి విలువ క్షీణించడంతోపాటు ధరల పెంపు వల్ల ఎక్స్‌పోర్ట్స్‌ అధిక ఆదాయం వస్తుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. 


టార్గెట్ ప్రైస్‌ రూ.290
భవిష్యత్తులో వాల్యూమ్స్‌ వృద్ధి, ఎప్పటికప్పుడు ధరల పెంపు, ఆరోగ్యకరమైన ఎగుమతి సామర్థ్యం, యూరోపియన్ కార్యకలాపాల్లో సానుకూలతలు, మంచి వాల్యుయేషన్ దృష్ట్యా... అపోలో టైర్‌ స్టాక్‌ కోసం ఈ బ్రోకరేజ్  సంస్థ బయ్‌ సిఫార్సు చేసింది. అంతేకాదు, టార్గెట్ ధరను రూ.290కి పెంచింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, బంగారం సహా కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.