Mutual Funds: కొన్నాళ్లుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల హవా పెరుగుతోంది. చాలా మంది తమ డబ్బును స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో కొందరు నేరుగా తమ డబ్బును ఈక్విటీస్, డెరివేటివ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్ వంటి సాధనాల్లో పెట్టుబడిగా కొనసాగిస్తున్నారు. అయితే ఇదే సమయంలో మార్కెట్లపై పూర్తిగా అవగాహన లేకపోయినా తమ డబ్బును స్టాక్ మార్కెట్లలో భాగం చేయాలనుకుంటున్న వారు మాత్రం మ్యూచువల్ ఫండ్స్ సరైనవిగా భావిస్తున్నారు.


ఒకప్పుడు కేవలం సాంప్రదాయ పెట్టుబడి మార్గాలైన ఎల్ఐసీ, పోస్టల్ స్కీమ్స్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మాత్రమే పరిమితమైన భారతీయులు ప్రస్తుతం రూటు మార్చేశారు. కొందరు తమ డబ్బును రెట్టింపు చేసుకునేందుకు ఐపీవోలను వినియోగించుకుంటుండగా.. కొందరు మాత్రం మ్యూచువల్ ఫండ్లలో క్రమపద్ధతిగా ప్రతినెల కొంత మెుత్తాన్ని ఎస్ఐపీ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజా గణాంకాలను గమనిస్తే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్న భారతీయుల సంఖ్య కొన్నేళ్లుగా బలమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో SIP పెట్టుబడులకు ఆదరణ గణనీయంగా పెరిగినట్లు కంపెనీల ఏఎంయూల డేటా చెబుతోంది. పైగా మ్యూచువల్ ఫండ్లలో డబ్బును తక్కువ మెుత్తంలో సైతం పొదుపు చేసుకునేందుకు వీలు ఉండటం చాలా మందిని ఆకర్షిస్తోంది. 


చిన్న మెుత్తాల్లో పెట్టుబడిదారులు దాచుకున్న సొమ్మును మ్యూచువల్ ఫండ్ హౌస్ సమీకరించి బాండ్స్, ఈక్విటీస్ వంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ శుభవార్త ఏమిటంటే సామాన్యులు దాచుకున్న సొమ్మును అనుభవం కలిగిన ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. వివిధ రకాల పెట్టుబడుల్లో ప్రావీణ్యం ఉన్న వీరు సమర్థవంతంగా పెట్టుబడులను నిర్వహించటమే కాకుండా వీటిని సెబీ పర్యవేక్షణ కలిగి ఉండటం చాలా మందిలో నమ్మకాన్ని నింపుతూ లాభాలను సైతం తెచ్చిపెడుతోంది. పెట్టుబడిదారుని సొమ్ముకు సమానమైన మెుత్తంలో యూనిట్లను మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందిస్తుంటాయి. మార్కెట్ కరెక్షన్ల వచ్చే మార్పు చేప్పులను ఇవి ప్రతిరోజూ విలువలో ప్రతిబింబిస్తుంటాయి. 


అయితే ఇక్కడ కేవలం రూ.1000 పెట్టుబడితో కోట్లు సంపాదించే మ్యూచువల్ ఫండ్ లెక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా వ్యక్తి 40 ఏళ్ల వయస్సులో పెట్టుబడిని ప్రారంభించాడనుకుందాం. నెలకు 12 శాతం రాబడిని అందించే ఫండ్ లో ఎస్ఐపీ రూపంలో రూ.1000 పెట్టుబడి చేయటం ప్రారంభిస్తే.. అతను 60 ఏళ్ల వయస్సు వచ్చేనాటిని రూ.1.14 కోట్లు అందుకుంటారు. ఈ కాలంలో సదరు వ్యక్తి పెట్టుబడి మెుత్తం కేవలం రూ.4.80 లక్షలుగా ఉంది. ఇదే క్రమంలో పెట్టుబడిని 20వ ఏట ప్రారంభించి కనీసం 10 శాతం రాబడితో రూ.1000 ప్రతినెల పెట్టుబడిని కొనసాగిస్తే వారు ఏకంగా రూ.3.50 కోట్లను అందుకుంటారు. అందుకే నిపుణులు ఎల్లప్పుడు తక్కువ వయస్సు నుంచి డబ్బును పొదుపు చేయటం లేదా ఇన్వెస్ట్ చేయటం ఉత్తమంగా చెబుతుంటారు. కాంపౌండింగ్ పవర్ వల్ల తక్కువ మెుత్తంలో పెట్టుబడులు పెట్టినప్పటికీ కాలానుగుణంగా వారికి ఎక్కువ రాబడులు అందుతాయి.