Infosys Share Price: ఇవాళ్టి (గురువారం) ఇంట్రా డే ట్రేడింగ్‌లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) మేజర్ ఇన్ఫోసిస్ (Infosys) షేరు ధర 1 శాతం క్షీణించి రూ. 1,360 వద్ద కొత్త 52 వారాల కనిష్టానికి పడిపోయింది. కంపెనీ భవిష్యత్‌ వృద్ధి మీద పెట్టుబడిదారులకు ఉన్న ఆందోళనల వల్ల కొంతకాలంగా స్టాక్‌ పడుతూనే ఉంది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్‌ 14 శాతం నష్టపోయింది. ఇదే నెల రోజుల కాలంలో BSE సెన్సెక్స్ ఒక శాతం లోపే నష్టంలో ఉంది.


ఈ స్టాక్, ఈ ఏడాది జూన్ 17 నాటి మునుపటి 52 వారాల కనిష్ట స్థాయి రూ.1,367.20 కంటే ఇవాళ మరింత దిగువకు పడిపోయింది. గతేడాది మే నెల తర్వాత మళ్లీ ఇప్పుడు కనిష్ట స్థాయిలో ట్రేడవుతోంది.


నెగెటివ్‌ రిటర్న్స్‌ 
గత ఆరు నెలల కాలంలో 27 శాతం నష్టపోయిన ఈ స్క్రిప్‌, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) చూసినా దాదాపు 28 శాతం నెగెటివ్‌ రిటర్న్స్‌ అందించింది.


బుధవారం, యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ (యూఎస్ ఫెడ్‌) మరో 75 bps రేటు పెంపును ప్రకటించింది. దీంతో అక్కడి IT స్టాక్స్‌ పేకమేడల్లా కుప్పకూలాయి. బలహీనమైన గ్లోబల్‌ క్యూస్‌ కారణంగా మన ఐటీ స్టాక్స్‌ కూడా నష్టపోయాయి. 


టాప్‌ లూజర్లలో ఐటీ ఇండెక్స్
నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇవాళ్టి టాప్‌ లూజర్లలో ఒకటి. ఉదయం సెషన్‌లో, ఇంట్రా డే కనిష్ట స్థాయి 26,552ని తాకింది, NSEలో 52 వారాల కనిష్ట స్థాయి 26,189కి దగ్గరగా ట్రేడయింది. 


ఇన్ఫోసిస్‌తో పాటు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఒక్కో శాతం చొప్పున క్షీణించాయి. మిగిలిన ఐటీ కంపెనీల షేర్లు కూడా ఇదే బాటలో ఉన్నాయి.


భారత్‌లో ఐటీ కంపెనీల ప్రధాన మార్కెట్‌ అమెరికా. అక్కడి నుంచే వీటికి ఎక్కువ భాగం ఆర్డర్లు వస్తాయి. పెరిగిన వడ్డీ రేట్లను భరించలేక అమెరికన్‌ కంపెనీలు తమ ప్రాజెక్టులను తగ్గించుకుంటాయి. ఆ ప్రభావం ఆటోమేటిక్‌గా భారత్‌లోని ఐటీ సెక్టార్‌ మీద పడుతుంది. అందుకే, వడ్డీ రేట్లు పెంచగానే అక్కడి మార్కెట్లు, ఇక్కడి మార్కెట్లు పడిపోయాయి.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ (Q1FY23) మన ఐటీ కంపెనీలు దెబ్బ తిన్నాయి. ఆ త్రైమాసికంలో జీతాలు పెంపు, సరఫరా వైపు సవాళ్లు, సబ్ కాంట్రాక్టర్ ఖర్చులు పెరగడం, ప్రయాణాలు & వీసా సంబంధిత ఖర్చుల కారణంగా చాలా IT కంపెనీల ఆపరేటంగ్‌ మార్జిన్లు దెబ్బతిన్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.