అగ్రరాజ్యం అమెరికాకు మరో చిక్కు వచ్చిపడింది! 'ది గ్రేట్‌ రిసిగ్నిషన్‌' పేరుతో ఓ ఉద్యమమే నడుస్తోంది. ఉన్నపళంగా మహిళలు, పురుషులు ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. ఫలితంగా లేబర్ మార్కెట్లో ఉద్యోగులకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. వస్తున్న వారికన్నా పోతున్న వారే ఎక్కువగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.


Also Read: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? ఈ 5 అంశాలు తెలుసుకోండి


ఆగస్టులో ముదిరింది


గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. ఆగస్టులో దాదాపుగా 3 శాతం మంది ఉద్యోగాలను వదిలేశారు. సంఖ్యా పరంగా చెప్పాలంటే వెళ్లిపోయిన వారి సంఖ్య 43 లక్షలకు చేరుకుంది. ఇక అదే నెలలో కరోనా మహమ్మారి కారణం చెప్పి లేఆఫ్‌లు ప్రకటించారు. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 13 లక్షల వరకూ ఉంది. పురుషుల (4.4%)తో పోలిస్తే మహిళలు (5.5%) ఎక్కువగా రాజీనామా చేశారు. సెప్టెంబర్లో 3 లక్షల మంది స్త్రీలు ఉద్యోగం వదిలేయగా కొత్తగా 1.94 లక్షల మందికే ఉద్యోగాలు వచ్చాయి.


ఎందుకిలా?


నాలుగో తరం సేవా కంపెనీలపై గ్రేట్‌ రిసిగ్నిషన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. వినియోగదారులను డీల్‌ చేయడం, ఆస్పత్రుల్లో నర్సులుగా సేవలందించడం, చిన్నారులను చూసుకోవడం, రెస్టారెంట్లు, రిటైల్‌ ఇండస్ట్రీస్‌, పాఠశాలల్లో మహిళల అవసరం ఎంతైనా ఉంది. కరోనా కాలంలో వీరిలో చాలామంది ఇంటి వద్ద పిల్లలను చూసుకున్నారు. అటు పనులు చేశారు. కార్యాలయాల్లో శక్తికి మించి శ్రమించారు. దాదాపు రోజుకు 12 గంటలకు పైగా పనిచేశారు. పైగా వేతనాల్లో కోతలు, లేఆఫ్‌ల వంటివి వారిని వేధించాయి. చాలా వరకు అలసిపోవడం, ఎక్కువ శ్రమించడం వల్లే రాజీనామాలు చేస్తున్నారు. త్వరలో కొవిడ్‌ పరిహారం ఆగిపోతుందని తెలిసినా లక్షల సంఖ్యలో ఉద్యోగాలను వదిలేయడంతో ఆర్థిక వ్యవస్థ నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.


Also Read: మనదేశంలో బీఎండబ్ల్యూ మొదటి స్కూటర్ వచ్చేసింది.. షాకిచ్చే ధర.. ఏకంగా కారే కొనచ్చు!


మహిళలే ఎక్కువ
వ్యాక్సినేషన్‌ పూర్తవుతుండటం, ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకోవడంతో ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతోంది. అలాంటి సమయంలో మహిళలు, పురుషులు ఒక్కసారిగా రాజీనామాలు చేయడంతో కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. 2020 ఫిబ్రవరితో పోలిస్తే ఇప్పటికీ 32 లక్షల మంది కార్మికులు తక్కువగా ఉన్నారు. దాంతో ఇప్పుడు ఉన్న ఉద్యోగులను కాపాడుకొనేందుకు కంపెనీలు అదనపు భత్యాలు, వేతనాలు ఇవ్వడం మొదలు పెట్టాయి. రాజీనామాలు చేసే వారికి ఇంటివద్దే పనిచేయమని చెబుదామన్నా.. ఆస్పత్రులు, రెస్టారెంట్లు, చైల్డ్‌కేర్‌ సెంటర్లలో అలాంటివి కుదరడం లేదు.


ఇదే మంచి తరుణం!
కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదే సరైన తరుణమని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారు ఇప్పుడు ప్రవేశించడం మంచిదని అంటున్నారు. కాగా ఉద్యోగాలు వదిలేస్తున్నవారు కొత్తగా ఎక్కడైనా చేరుతున్నారా అంటే లేదనే తెలుస్తోంది. ప్రభుత్వం వద్దనున్న సమాచారం దానినే సూచిస్తోంది. రాజీనామా చేసిన ప్రతి పది మందిలో నలుగురు రెస్టారెంట్లు, ఆతిథ్యం, రిటైల్‌ లొకేషన్‌ రంగాలకు చెందినవారే. ఏదేమైనా గ్రేట్‌ రిసిగ్నిషన్‌ ఉద్యమంతో ఇప్పుడున్న ఉద్యోగులు, కొత్తవారికి అదనపు వేతనాలు, ఇన్సెంటివ్‌, ఇతర భత్యాలు భారీ స్థాయిలోనే ఇవ్వనున్నారని అంచనా వేస్తున్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి