Living Wage System: మన దేశంలో, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా కార్మికుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన 'కనీస వేతన చట్టం' (Minimum Wages Act) తర్వాత ప్రజల స్థితిగతులు మారాయి. కార్మికులకు అందుతున్న కనీస వేతనాలు చాలా వరకు పెరిగాయి. అయితే, చాలా కంపెనీలు & పారిశ్రామిక సంస్థల మీద వేతన ఖర్చుల భారం పెరిగింది. దీనిని తప్పించుకోవడానికి ఆయా సంస్థలు చాలా ఎత్తులు వేశాయి, చట్టంలోని లోపాలను అవకాశంగా మార్చుకున్నాయి. దీనివల్ల చాలా కంపెనీల్లో ఉద్యోగులు, కార్మికులకు 'కనీస వేతన చట్టం' ప్రకారం వేతనాలు అందడం లేదు. 


కార్మికులు, ఉద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కనీస వేతన చట్టానికి మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందన్న వాదనలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. కనీస వేతన చట్టం నియమనిబంధనలను గతం కంటే స్పష్టంగా & బలంగా మారిస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందని పరిశ్రమ ప్రముఖులు చెబుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా పని చేస్తోంది. త్వరలో, కనీస వేతనాల స్థానంలో జీవన వేతన విధానాన్ని (Living Wage System) తీసుకు వచ్చే సన్నాహాల్లో ఉంది.


2025లో ప్రారంభంకానున్న జీవన వేతన వ్యవస్థ!
ఇటీవల, అంతర్జాతీయ కార్మిక సంస్థ (International Labour Organisation - ILO) కూడా జీవన వేతన వ్యవస్థను సమర్థించింది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ILO సూచనలు జారీ చేసింది. లివింగ్ వేజ్ ద్వారా ప్రస్తుత వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చాలని ILO కోరింది. భారత్‌ కూడా, 2025లో కనీస వేతన వ్యవస్థ స్థానంలో జీవన వేతన వ్యవస్థను తీసుకొచ్చే మార్చే ప్రక్రియను ప్రారంభించబోతోందని సమాచారం. 


ప్రస్తుతం, మన దేశంలో దాదాపు 50 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 90 శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మందికి కనీస వేతనాలు అందడం లేదు.


కనీస వేతన వ్యవస్థ అంటే?
భారతదేశంలో కనీస వేతన విధానం ఇప్పుడు అమల్లో ఉంది. దీని ప్రకారం, గంటల లెక్కల జీతం లెక్కిస్తారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ రేటు ఒకేలా లేదు. ఏ ఉద్యోగికి కనీస మొత్తం కంటే తక్కువ వేతనం లేదా జీతం ఇవ్వకూడదు. మహారాష్ట్రలో, గంట పనికి కనీసం 62.87 రూపాయలు చెల్లిస్తుండగా, బిహార్‌లో ఈ లెక్క 49.37 రూపాయలుగా ఉంది. అమెరికాలో గంట పనికి 7.25 డాలర్లు లేదా 605.26 రూపాయలు తగ్గకుండా చెల్లిస్తారు. భారతదేశంలో, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజలు కనీస వేతనాలు పొందడం చాలా కష్టంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రంగంపై పెద్దగా చర్యలు తీసుకోలేకపోతున్నాయి.


జీవన వేతన వ్యవస్థతో ఏం మారుతుంది?
జీవన వేతన వ్యవస్థను సాధారణ భాషలో అర్థం చేసుకుందాం. 75 ఏళ్ల క్రితం, మనిషి కనీస అవసరాలుగా ఆహారం, ఆశ్రయం, దుస్తులను (కూడు, గూడు, గుడ్డ) లెక్కలోకి తీసుకున్నారు. మారుతున్న కాలం & సాంకేతికతతో పాటు కనీస అవసరాల్లో మరికొన్ని అంశాలు వచ్చి చేరాయి. మారిన జీవన పరిస్థితులను జీవన వేతనం పరిగణనలోకి తీసుకుంటుంది. కార్మికుడి సామాజిక అభ్యున్నతికి అవసరమైన అన్ని కీలకాంశాలపై శ్రద్ధ పెడుతుంది. ఈ వ్యవస్థలో, కార్మికుడితో పాటు అతని కుటుంబానికి కూడా సామాజిక భద్రత పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆహారం, ఆశ్రయం, దుస్తులతో పాటు విద్య, ఆరోగ్యం, ఇంకా ఇతర అవసరాలను చేర్చి, వేతనాలను నిర్ణయిస్తారు. దీనివల్ల, కనీస వేతనం రూపంలో అందే డబ్బు చాలా వరకు పెరుగుతుంది.


మరో ఆసక్తికర కథనం: బీమా పాలసీ సరెండర్ రూల్స్‌ - ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క