Indias Largest IPOs Performance On Listing Day: హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో (Hyundai Motor IPO) వచ్చే వారంలో, అక్టోబర్‌ 15న ప్రారంభమవుతుంది, 17వ తేదీ వరకు లైవ్‌లో ఉంటుంది. ఆ సమయంలో, ఒక్కో షేరును రూ.1865-1960 చొప్పున అమ్మబోతోంది. తద్వారా 27,870 కోట్ల రూపాయలను సమీకరిస్తుంది. సైజ్‌ పరంగా, భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతి పెద్ద "ఇనీషియల్‌ పబ్లిక్‌ ఇష్యూ" ఇదే. ప్రైస్ బ్యాండ్ ప్రకటన తర్వాత, హ్యుందాయ్‌ కంపెనీ షేర్లు కేవలం 7 శాతం లేదా రూ.147 గ్రే మార్కెట్‌ ప్రీమియంతో (GMP) ట్రేడవుతున్నాయి. అంటే, ఈ IPOలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు పెద్దగా లిస్టింగ్ లాభాలను చూడకపోవచ్చు.


IPO ద్వారా రూ.10,000 కోట్లకు పైగా సమీకరించిన కంపెనీల షేర్లు లిస్టింగ్ రోజున ఎలా పని చేశాయో, ఏ మేరకు లిస్టింగ్‌ డే గెయిన్స్‌ (Listing Day Gains) అందించాయో చూద్దాం.


ప్రతికూల రాబడులు ఇచ్చిన ఎల్‌ఐసీ
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) 2022 మే నెలలో రూ.21,008 కోట్ల IPOతో వచ్చింది. ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద IPO. ఇష్యూలో రూ.949 ఉన్న ఒక్కో షేర్‌, 7.79 శాతం తగ్గి రూ.875 వద్ద లిస్ట్ అయింది.


27 శాతం పడిపోయిన పేటీఎం
పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (One 97 Communications Ltd), 2021 నవంబర్‌లో రూ.2150 ఇష్యూ ధరతో రూ.18,300 కోట్ల IPOతో వచ్చింది. రూ.2150 ధర ఉన్న షేరు రూ.1950 వద్ద లిస్ట్‌ అయింది. లిస్టింగ్ రోజున పేటీఎం షేర్ రూ.1560 వద్ద ముగిసింది. 


కోల్ ఇండియా అద్భుతం
అతి పెద్ద ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీ అయిన కోల్ ఇండియా (Coal India), 2010లో రూ.245 ఇష్యూ ధరతో రూ.15,199 కోట్ల ఐపీఓను ప్రారంభించింది. ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి గట్టి స్పందన లభించింది. 2010 నవంబర్ 4న, కోల్ ఇండియా స్టాక్ 40 శాతం లిస్టింగ్ గెయిన్స్‌తో రూ.342 వద్ద లిస్టయింది. 


తుస్సుమన్న రిలయన్స్ పవర్
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ ‍‌(Reliance Power) 2008లో IPOతో మార్కెట్‌లోకి వచ్చింది. ఇష్యూ ధర రూ.450 వద్ద కంపెనీ రూ.11,563 కోట్లు సమీకరించింది. ఈ IPOకి కూడా అద్భుతమైన స్పందన లభించింది. కానీ.. 2008 ఫిబ్రవరి 2న, ఈ స్టాక్ తన ఇష్యూ ధర కంటే 17 శాతం డిస్కౌంట్‌లో అరంగేట్రం చేసింది.


జారిపోయిన GIC
పబ్లిక్ సెక్టార్‌లోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC), 2017లో, ఇనీషియల్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.11,175 కోట్లు సమీకరించింది. ఇష్యూ ధర రూ.912 ఉన్న షేర్లు, 11 శాతం క్షీణతతో రూ.870 వద్ద లిస్ట్‌ అయ్యాయి.


హ్యాండ్‌ ఇచ్చిన ఎస్‌బీఐ కార్డ్స్‌ 
ఎస్‌బీఐ కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (SBI Cards & Payment Services), 2020 మార్చిలో, IPO ద్వారా రూ.10,354 కోట్లు సేకరించింది. కరోనా మహమ్మారి ప్రభావం ఈ IPOపై కనిపించింది. రూ.755 ఇష్యూ ధర ఉన్న షేర్లు 2020 మార్చి 17న రూ.683 వద్ద మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. పెట్టుబడిదార్లకు పెద్ద హ్యాండ్‌ ఇచ్చాయి. 


భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఇప్పటివరకు రూ.10,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సమీకరించిన ఆరు కంపెనీల్లో కోల్ ఇండియా మాత్రమే లిస్టింగ్‌ గెయిన్స్‌ అందించింది.


మరో ఆసక్తికర కథనం: రూ.10 వేల పెట్టుబడి రూ.9 లక్షలు అయింది, అంబానీకి చెందిన చాక్లెట్‌ కంపెనీ అదరగొట్టింది