IT Firms Employee Count: 


దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ఐటీ రంగం! ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా రిక్రూట్‌మెంట్‌ జరుగుతూనే ఉంటుంది. కోట్లాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. అలాంటిది ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో టాప్‌-10 ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 21,327 మేర పడిపోయింది. గతేడాది ఇదే సమయంలోని 69,634తో పోలిస్తే ఇదెంతో తక్కువ! అతి పెద్ద కంపెనీలు వర్క్‌ఫోర్స్‌లో కోత పెట్టగా చిన్నవి, మధ్య స్థాయి కంపెనీలు మాత్రం నియామకాలు చేపట్టాయి.


ఆదాయం పరంగా భారత్‌లోని అతిపెద్ద పది ఐటీ కంపెనీలు ఆరింట్లో చివరి త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. మిగిలిన నాలుగు మాత్రం కొత్తగా నియమించుకున్నాయి. అంటే ఇంకా ఉపాధి కల్పనలో వృద్ధి కనిపిస్తున్నట్టేనని నాస్కామ్‌ రిపోర్టు వెల్లడించింది. అమెరికా, ఐరోపా నుంచి కంపెనీలకు గిరాకీ వస్తోందని పేర్కొంది. కాగా మార్చి నాటికి ఐటీ రంగం 54 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది.


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఎల్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌, పర్సిస్టెంట్‌, కోఫోర్జ్‌ చివరి త్రైమాసికంలో ఉపాధి కల్పించాయి. 6.15 లక్షల మంది ఉద్యోగులున్న టీసీఎస్‌ అత్యల్పంగా 523 మందిని తీసుకోగా పర్సిస్టెంట్‌ 241 మందిని తీసుకుంది. ఇక కోఫోర్జ్‌ 1000, ఎల్‌టీటీఎస్‌ 1159 మందిని నియమించుకున్నాయి. స్మార్ట్‌ వరల్డ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ను విలీనం చేయడం ద్వారా ఎల్‌టీటీఎస్‌లోకి 800 మంది వచ్చారు. ఏదేమైనా లార్జ్‌ క్యాప్‌తో పోలిస్తే మిడ్‌ క్యాప్‌ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చాయి.


వరుసగా మూడు త్రైమాసికాల్లో టెక్‌ మహీంద్రా, విప్రో, ఎల్‌టీ మైండ్‌ట్రీ, ఎంఫాసిస్‌ చేర్చుకున్న ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఇన్ఫోసిస్‌ 6,940, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2506, విప్రో 8812, టెక్‌ మహీంద్రా 4103, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ 1808 మందిని తొలగించాయి. ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఆయా కంపెనీలకు డిమాండ్‌ తగ్గడం, ఎదుర్కొంటున్న అనిశ్చితిని సూచిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే కొత్తవారిని తీసుకోవడం కన్నా ఉన్నవారి నైపుణ్యాలు పెంచేందుకే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.


కరోనా సమయంలో 2021, 2022లో చాలా మంది ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. గ్రేట్‌ రెసిగ్నిషన్‌ నుంచి బయటపడేందుకు కంపెనీలు వెంటవెంటనే నియామకాలు చేపట్టాయి. ఇప్పుడు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆటోమేషన్‌ రాకతో నియామక ప్రక్రియ సన్నగిల్లింది. ఐటీ ఇండస్ట్రీలో మూమెంటమ్‌ తగ్గినప్పటికీ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో పెరిగింది. ప్రస్తుతం ఇందులో ఉన్న 16-19 లక్షల మంది 2030 నాటికి 45 లక్షలకు పెరుగుతాయని అంచనా. ఇంజినీరింగ్‌ రంగంలోనూ కొంత జోరు తగ్గింది.