Banks Meeting: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పిలుపు వచ్చింది.  ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, దేశంలోని నాలుగు అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు (Kotak Mahindra Bank) కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల (ఫిబ్రవరి‍) 22వ తేదీన ‍‌(బుధవారం), కేంద్ర ఆర్థిక శాఖతో ఈ బ్యాంకుల అత్యున్నత స్థాయి అధికారులు సమావేశం అవుతారు. దేశంలో అమలవుతున్న ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌పై (Emergency Credit Line Guarantee Scheme -ECLGS) సమీక్షించేందుకు ఈ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 


ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ అంటే ఏంటి?                   
కరోనా లాక్‌డౌన్ల సమయంలో వ్యాపారాలు జరక్క నష్టపోయిన పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా, 2020 మే నెలలో ECLGS ని ప్రకటించింది. ఆ సంవత్సరం మార్చిలో ప్రభుత్వం ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) ప్రభావితమైనందున, ఆయా పరిశ్రమలకు సహాయం చేయడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రుణం తీసుకున్న పారిశ్రామికవేత్తలు తర్వాతి కాలంలో రుణాలు తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు నష్టపోకుండా, కేంద్ర ప్రభుత్వమే 100% గ్యారంటీ కూడా ఇచ్చింది.


31 మార్చి 2023తో ముగియనున్న స్కీమ్ గడువు                
పథకం ప్రకటన సమయంలో ECLGS పరిమితి రూ. 3 లక్షల కోట్లు కాగా... తర్వాతి కాలంలో దానిని రూ. 4.5 లక్షల కోట్లకు పెంచారు. తాజాగా, 2022-23 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులోనూ దీనిపై ప్రకటన చేశారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించిన సమయంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) మార్చి 31, 2023 వరకు పొడిగించడం జరుగుతుందని ప్రకటించారు. దాని గ్యారెంటీ కవరేజ్‌ పరిమితిని రూ. 4.5 లక్షల కోట్లకు కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్లకు పెంచుతామని ప్రకటించారు. 130 లక్షలకు పైగా MSMEలకు ECLGS కింద అవసరమైన & అదనపు రుణాలు అందించామని ఆర్థిక మంత్రి తెలిపారు. మహమ్మారి ప్రతికూల ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి ఇది వారికి సహాయపడిందని చెప్పారు.


మార్చి 31, 2023 తర్వాత పథకాన్ని పొడిగించడంపై చర్చ                
ఈ నేపథ్యంలో, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం గడువు 31 మార్చి 2023తో ముగుస్తుంది. మార్చి 31, 2023 తర్వాత కూడా  ECLGS ను పొడిగించడంపై బ్యాంకుల సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మరికొన్ని పథకాలపైనా సమీక్షలు జరగవచ్చు. ఈ సమావేశానికి బ్యాంకింగ్ సెక్రటరీ వివేక్ జోషి అధ్యక్షత వహిస్తారు.