Gold Jewellery Demand In India 2024: బంగారంపై భారతీయులకు ఎంత మోజు ఉందో ప్రపంచం మొత్తానికీ తెలుసు. ప్రపంచ పసిడి మండలి (World Gold Council - WGC) ఎప్పటికప్పుడు రిలీజ్‌ చేసే రిపోర్ట్‌లు కూడా భారతీయుల మక్కువను చాటి చెబుతుంటాయి. WGC తాజా నివేదిక ప్రకారం, అతి పెద్ద పసిడి మార్కెట్లలో భారతదేశం ఒకటి, ఇది వేగంగా వృద్ధి చెందుతోంది. మన దేశంలో బంగారం ధరలు వేగంగా పెరగడానికి ఇదే కారణం. 


ఈ రోజు (శనివారం, 30 మార్చి 2024), దిల్లీలో 22 కేరెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ. 62,900 స్థాయికి చేరుకుంది. 24 కేరెట్ల స్వచ్ఛమైన పసిడి రేటు రూ. 68,600కు చేరింది. వాస్తవానికి ఈ రోజు రేటు రూ.280 తగ్గింది. నిన్న 24 కేరెట్ల గోల్డ్‌ రేటు రూ. 68,880 గా నమోదైంది. 


తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు 
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,750 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ.51,340 వద్దకు చేరాయి. విజయవాడ మార్కెట్‌లోనూ ‍(Gold Rate in Vijayawada) దాదాపుగా ఇవే రేట్లు అమలవుతున్నాయి. 


అతి త్వరలోనే బంగారం రూ.69,000 దాటే అవకాశం ఉందని సామాన్య జనంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే, ఆభరణాలకు డిమాండ్ తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు.


కొనుగోలుదార్లను ఆపలేకపోతున్న పసిడి రేట్లు 
2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY24) బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వంటి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదార్లు పసిడి కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున బంగారం కొని నిల్వ చేయడం ప్రారంభించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24), MCXలో బంగారం ధరలు దాదాపు 12 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 59,400 నుంచి రూ. 67,000 వేల మార్కును దాటాయి. నగల అమ్మకాలను పరిశీలిస్తే.. పెరుగుతున్న బంగారం ధరలు ప్రజలను ఏమాత్రం నిరోధించలేకపోయాయి.


పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ బలంగా ఉంటుందని అంచనా
పండుగల సమయంలో ఆభరణాల కొనుగోళ్లు వేగంగా పెరుగుతాయని పీఎన్‌జీ జ్యువెలర్స్ (PNG Jewellers) ఎండీ & సీఈవో సౌరభ్ గాడ్గిల్ చెబుతున్నారు. ఉగాది, హోలీ, గుఢి పడ్వా, అక్షయ తృతీయ, రంజాన్‌ వంటి పండుగల సందర్భంగా కస్టమర్లు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా రాబోతోంది. అందువల్ల, ఆభరణాల డిమాండ్ ఇంకా పెరుగుతుందన్న ఆశలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బంగారాన్ని అలంకరణగా మాత్రమే కాదు, సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. అందుకే ఆభరణాలపై ఎక్కువ పెట్టుబడి పెడతారు. రూరల్‌ ఇండియా నుంచి కూడా డిమాండ్‌ ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది. అయితే, సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆభరణాల కొనుగోళ్లలో కొంత తగ్గుదల కనిపించవచ్చని కొందరు మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు.


వచ్చే త్రైమాసికంలో డిమాండ్ 10 శాతం పెరగొచ్చు!
ఖిమ్జీ జ్యువెలర్స్ (Khimji Jewellers) డైరెక్టర్ మితేష్ ఖిమ్జీ చెబుతున్న ప్రకారం, భారతీయుల నుంచి అక్షయ తృతీయ కోసం ఆభరణాల డిమాండ్‌ సిద్ధంగా ఉంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పంటలు చేతికి రావడం కూడా మొదలైంది. ఇవన్నీ కలుపుకుని, నగలకు డిమాండ్ బలంగా ఉంటుందని భావిస్తున్నారు. జనం తమ బడ్జెట్ గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాల ట్రెండ్ ఆధారంగా, గోల్డ్‌ డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని మితేష్ ఖిమ్జీ ఆశిస్తున్నారు. వచ్చే త్రైమాసికంలో డిమాండ్ 10 శాతం పెరగవచ్చని వెల్లడించారు.


మరో ఆసక్తికర కథనం: ఎక్కువ ఆదాయం ఇచ్చే ఎస్‌బీఐ పథకం, ఆదివారంతో క్లోజ్‌, త్వరపడండి