Gold Rates At All-Time High: బంగారం ధరలు మునగ చెట్టులా పెరుగుతూనే ఉన్నాయి. ఏ రోజు చూసినా కొత్త ఎత్తులో కనిపిస్తూ జనాన్ని భయపెడుతున్నాయి. స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు లేదా 999 స్వచ్ఛత) 10 గ్రాముల ధర అతి త్వరలో రూ. 80,000కు చేరుతుందని "abp దేశం" కొన్ని రోజుల క్రితమే ఊహించింది. ఇప్పుడు అదే నిజమైంది. 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి రేటు శుక్రవారం నాడు (18 అక్టోబర్‌ 2024) మరో రూ. 550 పెరిగి, దిల్లీ మార్కెట్‌లో రూ. 79,900కు చేరింది. అంటే, రూ. 80,000కు కేవలం 100 రూపాయల దూరంలో ఉంది. శుక్రవారంతో కలిపి, దేశంలో గోల్డ్‌ రేట్లు పెరగడం వరుసగా నాలుగో రోజు. 


మరోపైపు, వెండి కూడా పసిడితో పోటీ పడుతోంది. శుక్రవారం నాడు, కిలో సిల్వర్‌ రేటు వెయ్యి రూపాయలు పెరిగి రూ. 94,500 కు చేరింది.


హైదరాబాద్‌లో పసిడి-వెండి ధరలు       
హైదరాబాద్‌ మార్కెట్‌లో చూస్తే, 24 క్యారెట్ల గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ. 78,980 పలికింది, రూ. 870 పెరిగింది. 22 క్యారెట్ల స్వర్ణం (ఆర్నమెంట్‌ గోల్డ్‌) 10 గ్రాముల ధర రూ. 72,400 వరకు వెళ్లింది, ఇది రూ. 800 పెరిగింది. కిలో వెండి రేటు ఏకంగా రూ. 2,000 పెరిగి రూ. 1,05,000 కు చేరింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో వెండి రేటు చాలా రోజులుగా రూ.లక్ష పైనే కొనసాగుతోంది.


అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌-సిల్వర్‌ రేట్లు        
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ గోల్డ్‌ రేటు కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. గ్లోబల్‌ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేట్‌ మొదటిసారిగా 2700 డాలర్ల మార్క్‌ను దాటింది. ఈ రోజు (శనివారం, 19 అక్టోబర్‌ 2024) 2736.40 డాలర్ల దగ్గర ట్రేడ్‌ అవుతోంది. సిల్వర్‌ రేటు 33.92 డాలర్ల దగ్గర ఉంది.


బంగారం, వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?          
-- భారతదేశంలో, ప్రస్తుతం, పండుగల సీజన్ (Festive season) నడుస్తోంది. ఇది ముగియగానే పెళ్లి మేళాలు మోగడం (Wedding season) ప్రారంభమవుతుంది. దీంతో, స్థానిక నగల వ్యాపారులు & ప్రజల నుంచి బంగారం, వెండికి డిమాండ్‌ పెరుగుతోంది.
-- భారతీయ స్టాక్ మార్కెట్ల పతనంతో బంగారం వైపు ఇన్వెస్టర్ల చూపు మళ్లింది. దీంతో, ఎల్లో మెటల్‌కు డిమాండ్ కనిపిస్తోంది, భారీగా అమ్ముడవుతోంది. దీనివల్ల కూడా ధరలు పెరుగుతున్నాయి. 
-- సాధారణంగా, బంగారాన్ని సురక్షిత పెట్టుబడి మార్గంగా పరిగణిస్తారు. స్టాక్‌ మార్కెట్లతో పాటు ప్రపంచ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పుడు దీనికి డిమాండ్‌ పెరుగుతుంది. పశ్చిమ ఆసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ మేఘాలు గోల్డ్‌ డిమాండ్‌ను పెంచుతున్నాయి. 
-- అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా ఒక కారణం. అక్కడ ఎవరు గెలుస్తారన్న ఊహాగానాల మధ్య, గ్లోబల్‌ ఇన్వెస్టర్లు గోల్డ్‌ను హెడ్జ్‌ చేస్తున్నారు.
-- యూఎస్‌ ఫెడ్‌ సహా కీలక దేశాల కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. ఫలితంగా, బాండ్లపై రిటర్న్‌ క్రమంగా తగ్గుతుంది కాబట్టి గోల్డ్‌కు డిమాండ్‌ పెరుగుతోంది.


మరో ఆసక్తికర కథనం: నెలనెలా రూ.లక్ష ఆదాయం, మీ పెట్టుబడి పెరుగుతూనే ఉంటుంది - ఇదొక స్మార్ట్‌ స్ట్రాటెజీ!