Gold Prices Hits Another Record: అత్యంత విలువైన లోహాలలో ఒకటైన బంగారం ధరల మారథాన్‌ కొనసాగుతూనే ఉంది. ఎల్లో మెటల్‌ అద్భుతమైన ర్యాలీతో కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభించింది, సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ రోజు, 01 ఏప్రిల్ 2024న, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రభావంతో మన దేశంలోనూ పసిడి నగలు ప్రజల కళ్లు బైర్లు కమ్మేలా ప్రకాశిస్తున్నాయి.


2024-25 ఆర్థిక సంవత్సరం తొలి రోజైన సోమవారం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు రికార్డు స్థాయిలో 2,281.60 డాలర్లకు చేరుకున్నాయి. ఈ రోజు ట్రేడ్‌ ప్రారంభంలో ఔన్సుకు దాదాపు 2,233 డాలర్ల వద్ద ప్రారంభమైన ఎల్లో మెటల్‌, అతి తక్కువ సమయంలోనే కొత్త రికార్డు స్థాయికి ఎగబాకింది.


MCXలోనూ సరికొత్త రికార్డు
అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన బూమ్ ప్రభావం దేశీయ మార్కెట్‌లోనూ కనిపిస్తోంది. MCXలో బంగారం ధర ఈ రోజు బిజినెస్‌ ప్రారంభమైన వెంటనే పెరిగింది. ఓపెనింగ్‌ సెషన్‌లోనే అది కొత్త రికార్డు స్థాయిని తాకింది. ఇంట్రాడేలో, MCXలో ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్ట్స్‌ 10 గ్రాములకు రూ. 69,487 స్థాయికి చేరుకున్నాయి. మన దేశ చరిత్రలో, 10 గ్రాములకు ఇదే అత్యధిక స్థాయి. అదే సమయంలో, జూన్ కాంట్రాక్ట్ ధర 10 గ్రాములకు రూ. 68,719 కు పెరిగింది.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ప్రస్తుతం, హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad), విజయవాడ (Gold Rate in Vijayawada) మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,600 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,380 దగ్గర ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 పలుకుతోంది. కిలో వెండి ధర హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ₹ 81,600 కతు చేరింది. 


విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 63,600 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 69,380 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 52,040 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 81,600 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 


ప్రపంచ పెట్టుబడిదార్ల సంప్రదాయ ఎంపిక
స్వర్ణం ధరలు పెరగడం ఆకస్మికంగా జరిగింది కాదు. సాంప్రదాయకంగా, బంగారం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదార్లకు ఇష్టమైన మార్గం. ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు, సేఫ్‌ హెవెన్‌ అయిన పసిడి డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచ పెట్టుబడిదార్లు పసుపు లోహాన్ని సురక్షితమైన పెట్టుబడుల్లో ఒకటిగా భావిస్తారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా ఇతర కారణాల వల్ల ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా మారినప్పుడల్లా, గ్లోబల్‌ ఇన్వెస్టర్లు బంగారం వెంట పరుగెత్తడం ప్రారంభిస్తారు.


ఇప్పుడు ధరలు పెరగడానికి కారణం
ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తూర్పు ఐరోపాలో రష్యా - ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే సంకేతాలు లేవు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. వీటితో పాటు, US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చిన సంకేతాలను బట్టి కూడా బంగారం ధరలకు మద్దతు లభించింది.ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో వడ్డీ రేట్లలో మూడు కోతలు ఉంటాయని  ఫెడరల్ రిజర్వ్ హింట్‌ ఇచ్చింది. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్ రాబడులు తగ్గుతాయి. ఈ నష్టం నుంచి సంపదను కాపాడుకోవడానికి పెట్టుబడిదార్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతకడం ప్రారంభిస్తారు. సాధారణంగా, ఈ వెదుకులాటలో స్వర్ణం ఎక్కువ ప్రయోజనం పొందుతుంది.


మరో ఆసక్తికర కథనం: ఈ రోజు బ్యాంక్‌ వైపు వెళ్లకండి, ఈ నెలలో మొత్తం 14 సెలవులు