Former Drinking Water and Sanitation Secretary Parameswaran Iyer appointed Niti Aayog CEO Govt Order - కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ (NITI Aayog)కు కొత్త సీఈవోను నియమించింది. తాగునీరు, పారిశుద్ధ్య శాఖా మాజీ సెక్రటరీ పరమేశ్వరన్‌ అయ్యర్‌ను రెండేళ్ల కాలానికి శుక్రవారం సీఈవోగా నియమించిందని పీటీఐ రిపోర్టు చేసింది. ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 1981వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. పారిశుద్ధ్య రంగంలో స్పెషలిస్టుగా ఆయనకు పేరుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌, ట్రైనింగ్‌ ఆయన నియామకాన్ని ధ్రువీకరించింది. 2022, జూన్‌ 30 అమితాబ్‌ కాంత్‌ పదవీకాలం ముగియడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


'పదవీ విరమణ చేసిన అమితాబ్‌ కాంత్‌ స్థానంలో ఐఏఎస్‌ అధికారి పరమేశ్వరన్‌ అయ్యర్‌ను కేబినెట్‌ నియామకాల కమిటీ నియమించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు రెండేళ్ల కాలం పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. అమితాబ్‌ కాంత్‌కు వర్తించిన షరుతులు, అధికారాలు ఆయనకూ వర్తిస్తాయి' అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


Also Read: వర్క్‌ ఫ్రం హోమ్‌ను చట్టబద్ధం చేయనున్న అక్కడి పార్లమెంటు!


Also Read: నష్టాల్ని తట్టుకోలేక 300 ఉద్యోగుల్ని తీసేసిన నెట్‌ఫ్లిక్స్‌


2017, ఫిబ్రవరి 17న అమితాబ్‌ కాంత్‌ను నీతి ఆయోగ్‌ సీఈవోగా ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పదవీకాలం ముగియడంతో 2019, జూన్‌ 30 వరకు దానిని పొడగించారు. 2021, జూన్‌లో ఆయన పదవీ కాలాన్ని మరోసారి పొడగించారు.


వియత్నాంలో ప్రపంచ బ్యాంకు హనోయి కార్యాలయంలో పనిచేస్తుండగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ను ప్రభుత్వం కలిసింది. నీతి ఆయోగ్‌ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరింది. అప్పుడాయన నీటి పారుదల, పారిశుద్ధ్య శాఖకు ఇంఛార్జ్‌గా ఉన్నారు. 2009లో ఆయన ఐఏఎస్‌ పదవి నుంచి స్వచ్ఛందంగా వీడ్కోలు పలికారు.