AP High Court On Chintamani Play : చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించింది. ఈ నిర్ణయంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రఘురామకృష్ణరాజు తరపున ప్రముఖ న్యాయవాది ఉమేష్ వాదనలు వినిపించారు. చింతామణి నాటకాన్ని నిషేధించడం వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమే అని న్యాయవాది ఉమేష్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ నాటకాన్ని నిషేధించిన కారణంగా పలువురు జీవన ఉపాధి కోల్పోయారని కోర్టుకు తెలిపారు. దేవదాసి చట్టానికి వ్యతిరేకంగా ఈ నాటకం వచ్చిందన్నారు. ఇప్పుడు ఈ నాటకాన్ని నిషేధించాల్సిన అవసరంలేదని కోర్టుకు తెలిపారు. నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా న్యాయవాది ఉమేష్ హైకోర్టును అభ్యర్థించారు. అయితే న్యాయవాది ఉమేష్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి ధర్మాసనం అంగీకరించలేదు. ఈ నాటకానికి సంబంధించిన అసలు పుస్తకం అనువాద కాపీ సమర్పించాల్సిందిగా పిటిషనర్ ను ఆదేశించింది. విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. 


చింతామణి నాటకంపై నిషేధం 


చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర వైశ్యులను అవమానించేదిగా ఉందని తక్షణం ఆ నాటకాన్ని నిషేధించాలని కొంత కాలంగా ఆర్యవైశ్య సంఘాల సమావేశాల్లో తీర్మానాలు చేస్తూ వస్తున్నారు. చింతామణి నాటకం ఇప్పటిది కాదు. 1920 ప్రాంతంలో కాళ్ళకూరి నారాయణరావు రాశారు. ఆనాటి సాంఘిక దురాచారాలను, తప్పుడు సంప్రదాయాలను సంస్కరించేందుకు ఈ నాటకాన్ని అప్పటి పరిస్థితులను బట్టి రాశారు. నాటకాలే ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న రోజుల్లో ఈ చింతామణి నాటకానికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో తన వంతు పాత్ర పోషించింది. అలాంటి నాటకం చరిత్రలో నిలిపోయింది. వందేళ్ల తర్వాత ఇప్పుడు ఆ నాటకాన్ని నిషేధించడం అతిశయోక్తిగా ఉందని పలువు భావిస్తున్నారు. 


వందేళ్ల చరిత్ర గల నాటకం


చింతామణి నాటక ప్రదర్శనను ఏపీ ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధంపై కళాకారుల నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ వివాదం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7ను సవాల్ చేస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోర్టును  కోరారు. అప్పటి సమాజంలో వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రాశారని తెలిపారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న నాటకంపై నిషేధం విధించడం సరికాదన్నారు. ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ వేల మంది కళాకారులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తే కళాకారులు రోడ్డున పడతారన్నారు. నాటకంలోని ఒక పాత్ర కారణంగా మొత్తం నాటక ప్రదర్శనపై నిషేధం విధించడం సరికాదన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జీవో 7ను రద్దు చేయాలని ఎంపీ రఘురామ కోర్టుకు వెళ్లారు.