FPIs: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇండియన్‌ ఈక్విటీల మీద ఇప్పుడు అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూల దృక్పథంతో ప్రారంభించిన విదేశీ పెట్టుబడిదార్లు, ఈ నెలలో ఇప్పటివరకు రూ. 8,643 కోట్ల విలువైన ఇండియన్‌ షేర్లను కొన్నారు. వాల్యుయేషన్లు ఆకర్షణీయ స్థాయిలో ఉండటం వల్ల భారత మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు డేటాను బట్టి అర్ధం అవుతోంది. 


విదేశీ పెట్టుబడులు వచ్చిన వివిధ రంగాల గురించి చూస్తే... ఏప్రిల్ 15తో ముగిసిన పక్షం రోజుల్లో FPIలు ఫైనాన్షియల్ స్టాక్స్‌ మీద ఎక్కువ ప్రేమ చూపించారు, ఆ విభాగంలో రూ. 4,410 కోట్లు కురిపించారు. ఆ తర్వాత వాహన, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లలోనూ మంచి కొనుగోళ్లు చేసారు.


ఏప్రిల్‌ నెలలో ఈక్విటీలతో పాటు, డెట్ లేదా బాండ్ మార్కెట్‌లోకి కూడా రూ. 778 కోట్లను ఓవర్సీస్‌ ఫండ్‌ కంపెనీలు జమ చేశాయి.


మార్కెట్ నిపుణుల మాట ఇది
"ఎఫ్‌పిఐ ఇన్‌ఫ్లోస్‌ పరంగా భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థలలో ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా ఉంది. ప్రస్తుతం భారతీయ షేర్ల విలువలు సహేతుకమైన స్థాయికి వచ్చాయి. ఈ కారణంగానే విదేశీ మదుపర్లు ఆకర్షితులవుతున్నారు" - మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ


అంతకుముందు నెల మార్చిలో కూడా ఎఫ్‌పీఐలు నెట్‌ బయ్యర్స్‌గా నిలిచారు. అమ్మిన షేర్ల కంటే కొన్న షేర్ల విలువ ఎక్కువగా ఉంటే నెట్‌ బయ్యర్స్‌గా పరిగణిస్తారు. ఆ నెలలో నికరంగా రూ. 7,936 కోట్లను షేర్లలో ఎఫ్‌పీఐ ఇన్వెస్ట్ చేశారు. ఈ పెట్టుబడిలో ఎక్కువ భాగం అమెరికాకు చెందిన GQG పార్టనర్స్ ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లోకి వచ్చింది.


మార్చి నెలలో FIIల కొనుగోళ్ల జాబితాలో... సర్వీసెస్‌ (రూ. 7,246 కోట్లు), పవర్‌ (రూ. 3,214 కోట్లు), మెటల్స్ & మైనింగ్ (రూ. 2,938 కోట్లు), ఆటో (రూ. 2,695 కోట్లు), క్యాపిటల్ గూడ్స్ (రూ. 2,507 కోట్లు), కన్‌స్ట్రక్షన్‌ (రూ. 2,224 కోట్లు), FMCG (రూ. 1,765 కోట్లు), కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌ (రూ. 1,423 కోట్లు), కెమికల్స్‌ (రూ. 280 కోట్లు), కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ (రూ. 261 కోట్లు), రియాల్టీ (రూ. 104 కోట్లు) ఉన్నాయి.


గత నెలలో రూ. 6,910 విలువైన ఐటీ స్టాక్స్‌ను ఓవర్సీస్‌ ఇన్వెస్టర్లు విక్రయించారు. ఆయిల్‌ & గ్యాస్ (రూ. 6,824 కోట్లు), హెల్త్‌కేర్ (రూ. 1,587 కోట్లు) నుంచి కూడా డాలర్లు బయటకు వెళ్లిపోయాయి.


2022-23లో రూ. 37,631 కోట్లు ఉపసంహరణ
2022-23 ఆర్థిక సంవత్సరంలో, భారతీయ స్టాక్ మార్కెట్ల నుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 37,631 కోట్లను వెనక్కు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు దూకుడుగా వడ్డీ రేట్ల పెంచడంతో FPIలు నెట్‌ సెల్లర్స్‌గా నిలిచారు. అంతకుముందు, 2021-22లో, ఇండియన్‌ మార్కెట్ నుంచి రికార్డు స్థాయిలో రూ. 1.4 లక్షల కోట్ల ఉపసంహరించుకున్నారు. 2020-21లో, FPIలు షేర్లలో రూ. 2.7 లక్షల కోట్లు, 2019-20లో రూ. 6,152 కోట్లు పెట్టుబడి పెట్టారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.