India-Pak Cricket Match: భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ ఉందంటే, కేవలం ఈ రెండు దేశాలు మాత్రమే కాదు, యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మునివేళ్లపై కూర్చుని చూస్తుంది. గ్రౌండ్‌లోని ఆటగాళ్ల కంటే ఎక్కువ భావోద్వేగాలు స్టాండ్స్‌లో, టీవీల ముందు కూర్చున్న అభిమానుల్లో కనిపిస్తాయి. క్రికెట్‌లో రెండు దేశాల మధ్య జరిగే ప్రతి మ్యాచ్‌లో పాత రికార్డులు బద్ధలై, కొత్త రికార్డులు వచ్చి చేరుతుంటాయి. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా దాయాది దేశాల మధ్య డైరెక్ట్‌ సిరీస్‌లు లేవు. వరల్డ్‌ కప్‌, ఆసియా కప్‌ వంటి వేదికల మీద మాత్రమే ఇండియా-పాక్‌ క్రికెట్‌ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ కారణంగా, థర్డ్‌ అంపైర్‌ డెసిషన్‌ కోసం ప్లేయర్లు ఎదురుచూసినంత ఉత్కంఠగా.. రెండు దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తుంటారు. 


క్రికెట్ అభిమానుల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. కొన్ని నెలల తర్వాత, క్రికెట్‌ మైదానంలో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు పొటేళ్లలా ఢీకొట్టబోతున్నాయి. ఈసారి వినోదం కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఆ మ్యాచ్ సాధారణమైనది కాదు, ప్రపంచ కప్‌లో భాగంగా జరుగుతుంది. దాయాదుల మధ్య జరిగే మ్యాచ్‌ ప్రభావంతో క్రికెట్‌ ప్రేమికుల్లో ఇప్పటికే ఫీవర్‌ పెరిగింది.


మూడు నెలల తర్వాత ఇండియా-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్
రాబోయే క్రికెట్ ప్రపంచ కప్ షెడ్యూల్ (2023 ICC Men’s Cricket World Cup Schedule) ప్రకారం, భారతదేశం - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 15 న జరుగుతుంది. గుజరాత్‌లో ఉన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సమరం సాగుతుంది. అంటే, రెండు దేశాల మధ్య భీకర పోరుకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. అయితే, ఆ ప్రభావం మాత్రం అహ్మదాబాద్ నగరాన్ని ఇప్పటికే చుట్టుముట్టింది.


రూమ్‌ రెంట్‌ ఒక రాత్రికి రూ. 50 వేలు
మ్యాచ్ షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి అహ్మదాబాద్‌లో పరిస్థితి మారిపోయింది. హోటల్ రూమ్‌ రెంట్లు విపరీతంగా పెరిగాయి. మ్యాచ్ వేదిక, డేట్‌ ప్రకటన తర్వాత... అహ్మదాబాద్‌లో ఒక రాత్రి హోటళ్ల అద్దె 5 రెట్లు పెరిగిందని ఈజ్ మై ట్రిప్ (EaseMyTrip) CEO నిషాంత్ పిట్టి చెప్పుకొచ్చారు. లగ్జరీ హోటళ్లలో ఒక్క రాత్రికి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు.


దాదాపు 7 రెట్లు పెరిగిన ఫ్లైట్‌ టిక్కెట్‌ రేట్లు
ఇండియా - పాక్‌ మ్యాచ్ ఎఫెక్ట్‌ హోటల్‌ రూమ్స్‌కే పరిమితం కాలేదు, విమాన ఛార్జీలు కూడా రికార్డులు సృష్టించడం ప్రారంభించాయి. మ్యాచ్‌కు ఒక రోజు ముందు, అక్టోబర్ 14న, దిల్లీ, ముంబై నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టిక్కెట్ రేట్లు 5 నుంచి 7 రెట్లు పెరిగాయి. సాధారణ రోజుల్లో, ఈ రెండు నగరాల నుంచి అహ్మదాబాద్‌కు దాదాపు రూ. 3000 కు విమాన టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు సిటీస్‌ నుంచి అహ్మదాబాద్‌కు అక్టోబర్ 14న ఫ్లైట్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకోవాలంటే, ఇప్పుడు రూ. 15,000 నుంచి రూ. 22,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.


మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' DMart, HDFC Bank, LTIMindtree


Join Us on Telegram: https://t.me/abpdesamofficial