Budget 2024  Business community  Reaction :  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌పై వ్యాపారవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నయి. పలువురు వ్యాపార ప్రముఖులు బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. మౌలిక సదుపాయాల రంగానికి పెద్ద పీట వేయడంతో  ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెబుతున్నారు. 


 
సమ్మిళిత వృద్ధికి అవకాశం ఇచ్చే బడ్జెట్ : సత్వ గ్రూప్ ఎండీ బిజయ్ అగర్వాల్
 
సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యమిచ్చే  సమతుల్య బడ్జెట్ అని సత్వ గ్రూప్ ఎండీ బిజయ్ అగర్వాల్ ప్రసంసించారు.  పరిశ్రమలు, వాణిజ్యం  వృద్ధి చెందుతున్న కొద్దీ ప్రతిభ, నైపుణ్యాభివృద్ధి కీలకం అవుతాయన్నారు.  విద్య, నైపుణ్య మౌలిక సదుపాయాల పెంపు, ఉపాధి కల్పనకు రూ.1.48 లక్షల కోట్లు కేటాయించడం దీర్ఘకాలిక అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు.  రియల్ ఎస్టేట్ రంగానికి కూడా  నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరం ఉంటుందని  ప్రభుత్వ చొరవ వల్ల స్కిల్డ్ లేబర్ సమస్య తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు, పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్ల కోసం కేటాయించిన రూ.10 లక్షల కోట్లతో సహా గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించడం గృహనిర్మాణ అవకాశాలను పెంచుతుందన్నారు.  మహిళలకు స్టాంప్ డ్యూటీని తగ్గించడం గృహ యాజమాన్య ఆకాంక్ష తీర్చుకునే వారికి మరింత మద్దతుగా ఉంటుందన్నారు.  ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల వైఖరిని సత్వ గ్రూప్ ఎండీ ప్రశంసించారు. 


ఇన్నోవేషన్‌లను ప్రోత్సహించేలా బడ్జెట్ : టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు 


 “కొత్త ఇన్నోవేషన్‌లను ప్రోత్సాహించే విధంగా 2024 బడ్జెట్‌లో  కీలక మైలురాయి పడిందని టీ హబ్‌ సీఈవో మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. ఇండియన్‌ స్టార్టప్‌ ఇకో సిస్టమ్‌లో సుస్థిర అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల పెట్టుబడిదారులకు విధించే ఏంజెల్ పన్ను రద్దు అనేది ఒక కీలకమైన చర్య అని ఆయన అన్నారు. ఇది నూతన ఆవిష్కరణలకు మంచి వాతావరణాన్ని కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఈ టాక్స్‌ రద్దు అనేది స్టార్టప్‌లకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారడానికి మార్గం సుగమం చేయడంలో ఇది కీలక అడుగు అని టీ హబ్‌ సీఈవో మహంకాళి అభిప్రాయపడ్డారు. అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించడానికి అంకితం చేయబడిన ₹ 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయడం మరొక ముందడుగు వేసే ప్రయత్నంగా ఆయన చెప్పారు. ఈ గణనీయమైన పెట్టుబడి వినూత్న స్టార్టప్‌లు మరియు సంచలనాత్మక పరిశోధనలకు మద్దతు ఇవ్వడం ద్వారా అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని ప్రోత్సహిస్తుందని వివరించారు. అంతరిక్ష సాంకేతికత మరియు రీసెర్చ్‌లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు దోహద పడుతుందన్నారు.


అంతేకాకుండా, ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ కింద రూ.1 లక్ష కోట్ల ఫైనాన్సింగ్ పూల్‌ను ప్రవేశపెట్టడం ఒక గేమ్-ఛేంజర్ నిర్ణయంగా ఆయన చెప్పారు. ఈ ఫండ్ ప్రాథమిక పరిశోధన మరియు ప్రోటోటైప్ అభివృద్ధికి సహాయపడుతుందని ‌అన్నారు. వాణిజ్య-స్థాయి ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు మరియు మార్కెట్‌కు అత్యాధునిక పరిష్కారాలను తీసుకురావడానికి స్టార్టప్‌లను అనుమతిస్తుందని వివరించారు.


బడ్జెట్‌లోని కీలక ప్రకటనలు శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థపై  సానుకూల ప్రభావం చూపించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు స్టార్టప్‌లకు అవసరమైన వనరులను అందిస్తాయి మరియు అభివృద్ధి చెందడానికి, ఆవిష్కరణలు చేయడానికి మరియు భారతదేశ ఆర్థిక వృద్ధి మరియు సాంకేతిక పురోగతికి గణనీయంగా దోహదపడతాయని టీ హబ్ సీఈవో విశ్వాసం వ్యక్తం చేశారు.