Bank Employees Salary Hike By 17 Percent: దేశంలోని లక్షలాది బ్యాంక్‌ ఉద్యోగులకు మహా శివరాత్రి కానుక అందింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న జీతాల పెంపునకు అంగీకారం కుదిరింది. దీనివల్ల దేశవ్యాప్తంగా 8.50 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. 


జీతాల పెంపునకు సంబంధించి ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (IBA), బ్యాంకు యూనియన్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల ప్రస్తుత 11వ వేతన ఒప్పందం 2022 నవంబర్ 01తో ముగిసింది. జీతాల పెంపుపై ఏకాభిప్రాయానికి రావడానికి ఉద్యోగ సంఘాలు - IBA మధ్య అప్పటి నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు చర్చలు ఫలించాయి కాబట్టి, ఈ జీతాల పెంపు 2022 నవంబరు 01 నుంచి అమలవుతుంది. దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఏటా రూ. 8,284 కోట్ల అదనపు భారం పడుతుంది.


బ్యాంక్‌ ఉద్యోగుల జీతాన్ని 17 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ ఛైర్మన్ ఎ.కె. గోయల్ ప్రకటన చేశారు. తదుపరి సమీక్ష 2027 నవంబర్‌లో ఉంటుంది. 


వారానికి 5 రోజుల పనిపై అస్పష్టత
ప్రస్తుతం, బ్యాంక్‌లకు, నెలలోని అన్ని ఆదివారాలు + రెండు, నాలుగు శనివారాలు సెలవులు. మొదటి, మూడో శనివారాల్లో పని చేస్తున్నారు. ఈ విధంగా బ్యాంకు ఉద్యోగులకు నెలలో 6 వీక్లీ ఆఫ్‌లు లభిస్తున్నాయి. దీనిని 8 వీక్లీ ఆఫ్‌లకు పెంచాలని బ్యాంకు యూనియన్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. 


నెలలోని అన్ని ఆదివారాలతో పాటు అన్ని శనివారాలను సెలవులుగా మార్చడానికి ఆలిండియా బ్యాంక్స్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఒప్పుకుంది. అంటే, బ్యాంక్‌ ఉద్యోగులు వారానికి 5 రోజులు (సోమవారం నుంచి శుక్రవారం వరకు) మాత్రమే పని చేసే అవకాశం ఉంది. అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తేనే వారానికి 5 రోజుల పని విధానం అమల్లోకి వస్తుంది.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (RBI), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ‍(LIC) ఇప్పటికే వారానికి 5 పని రోజులు అమలవుతున్నాయి. కాబట్టి, బ్యాంకులకు కూడా అన్ని శనివారాలను సెలవుగా ప్రకటించాలని ఐబీఏ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. అయితే, ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అనమతి ఇస్తుందో, లేదో స్పష్టత లేదు.


5 పని దినాలతో మారనున్న పని గంటలు!
వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసినప్పటికీ, వారం మొత్తంలో చూస్తే బ్యాంక్‌ పని గంటలు తగ్గవని కేంద్ర ప్రభుత్వానికి బ్యాంక్‌ సంఘాలు హామీ ఇచ్చాయి. ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసే బ్యాంక్‌ బ్రాంచ్‌లు, 5 పని దినాల వ్యవస్థకు మారితే, ఈ సమయాన్ని పెంచుతాయి. '5-డే వర్క్‌ వీక్‌' (5-Day Work Week) ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే, ఈ ఐదు పని దినాల్లో పని గంటలను యూనియన్ల ఫోరం సవరిస్తుంది. ప్రస్తుతం, సోమవారం నుంచి శనివారం (రెండు, నాలుగు శనివారాలు మినహా) వరకు బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్‌లో ఉంటున్నాయి. ఐదు రోజుల పని ఫార్ములా అమలైతే, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు బ్యాంక్‌లు పని చేస్తాయని అంచనా. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుతిస్తే, ఒక నోటిఫికేషన్‌ తర్వాత కొత్త పని గంటలను ప్రకటిస్తారు.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి