Adani Group Stocks: అదానీ గ్రూప్‌ షేర్లు మూడు రోజుల క్రితం నక్క తోక తొక్కినట్లున్నాయి. మూడు రోజులుగా ఈ గ్రూప్‌ స్టాక్స్‌ సూపర్‌ స్టార్లలా వెలిగిపోతున్నాయి, ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి.


అదానీ గ్రూప్‌ మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ తన ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఆ నివేదికను అదానీ గ్రూప్‌నకు క్లీన్ చిట్‌గా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో, అదానీ గ్రూప్‌ స్టాక్స్‌కు పూర్వవైభవం వచ్చింది. గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (combined market value) కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే దాదాపు లక్షా 80 వేల కోట్ల రూపాయలు పెరిగింది.


రూ.76,000 కోట్ల లాభం తీసుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్
గత గురువారం ‍‌(18 మే 2023) నాటి ముగింపు ధర నుంచి ఈ రోజు (మంగళవారం, 23 మే 2023) వరకు చూస్తే, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు దాదాపు 38% పెరిగి దాదాపు రూ. 76,000 కోట్ల లాభం తీసుకున్నాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌కు ముందున్న స్థాయికి పుంజుకున్న అదానీ పోర్ట్స్ షేర్లు కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 25,000 కోట్లకు పైగా లాభపడ్డాయి. ఇతర టాప్ గెయినర్స్‌ అదానీ విల్మార్, అంబుజా సిమెంట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్.


52 వారాల కనిష్ట స్థాయి నుంచి దాదాపు 96% ర్యాలీ చేసిన అదానీ పవర్ షేర్లు, ఇవాళ్టి ట్రేడ్‌లో 5% అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. ఇవి కూడా హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ కంటే ముందున్న లెవెల్‌కు చేరువయ్యాయి.


హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ కొట్టిన దెబ్బకు ఎక్కువగా నష్టపోయింది అదానీ టోటల్ గ్యాస్. రిపోర్ట్‌ తర్వాత చూసిన కనిష్ట స్థాయి నుంచి ఈ షేర్లు కేవలం 20% మాత్రమే పెరిగాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ పూర్వ స్థాయికి చేరాలంటే దీనికి ఇంకా 414% అప్‌సైడ్ అవసరం.


నెగెటివ్‌ న్యూస్‌ లేకపోవడంతో పాజిటివ్‌ సెంటిమెంట్‌
జనవరి 24 నాటి హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ తర్వాత అదానీ గ్రూప్‌ నెత్తిన చాలా బండలు పడ్డాయి. ఒకదాని వెంట ఒకటిగా దూసుకొచ్చిన ప్రతికూల వార్తలు గ్రూప్‌ స్టాక్స్‌ నడ్డి విరగ్గొట్టాయి. దీంతో, అదానీ షేర్లు దాదాపు 80% వరకు విలువ కోల్పోయాయి. ఇప్పుడు, ఎలాంటి నెగెటివ్‌ న్యూస్‌ లేదు. ఇదే పాజిటివ్‌ సెంటిమెంట్‌గా టర్న్‌ అయింది. ఫలితంగా, జీరోలు కాస్తా హీరోలుగా మారాయి.


సుప్రీంకోర్టు నియమించిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి వచ్చిన డేటా ఆధారంగా, అదానీ స్టాక్‌లో "అక్రమాలు జరిగినట్లు స్పష్టమైన రుజువులు కనిపించడం లేదు" అని సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన రిపోర్ట్‌లో పేర్కొంది. షేర్‌ ధరల్లో అవకతవకలకు సంబంధించి సెబీ వైఫల్యం ఉందా, లేదా అనేది నిర్ధారించడం సాధ్యం కాదని కూడా ప్యానెల్ తన నివేదికలో పేర్కొంది. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన ఆఫ్‌షోర్ సంస్థలపై సెబీ జరిపే విచారణకు సమాంతరంగా ఈ కమిటీ పని చేస్తోంది.


హిండెన్‌బర్గ్ ఇష్యూపై విచారణను పూర్తి చేయడానికి సెబీకి ఇచ్చిన గడువును ఆగస్టు 14 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు గత వారం ఆదేశాలు జారీ చేసింది.


ఇది కూడా చదవండి: ₹2000 నోట్ల ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం ఎంత?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.