Adani Energy: అదానీ గ్రూప్ తన పెట్టుబడుల జోరును భారీగా పెంచేస్తోంది. మోదీ 3.0లో ఎనర్జీ రంగంపై గౌతమ్ అదానీ భారీగా దృష్టి సారించారు. భారత్ భవిష్యత్తు ఎనర్జీ అవసరాలను తీర్చే క్రమంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. 


దేశంలో 40,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్మించేందుకు అదానీ గ్రూప్ 2030 నాటికి సుమారు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తోంది. గ్రూప్ 2050 నాటికి తన కంపెనీల్లో నికర సున్నా కర్భన ఉద్గారాలను సాధించాలనే లక్ష్యాన్ని నిర్థేశించుకుంది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ సోలార్, విండ్ ఎనర్జీ సహా పునరుత్పాదక వనరుల నుంచి 10,000 MW కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కొత్తగా 6000 MW నుంచి 7000 MW సామర్థ్యాన్ని జోడిచటం ద్వారా 2030 నాటికి 50,000 MW సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.  


అదానీ గ్రీన్ ప్లాన్స్:
అదానీ గ్రూప్ పునరుత్పాదక ప్రణాళికలు ఎక్కువగా లాభాన్ని కలిగించే కంపెనీల జాబితాలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(AGEL) ముందు స్థానంలో ఉంది. ఈ కంపెనీలో దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు అదానీ తాజా పెట్టుబడి ప్రణాళికల వల్ల రానున్న కాలంలో లాభపడతారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే దేశంలో భారీ స్థాయిలో సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ అగ్రగామిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 


రాత్రి పూట అవసరాల కోసం:
ఒక మెగావాట్‌కు రూ.5 కోట్ల చొప్పున, 2030 నాటికి పెట్టుబడి రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్, సీఈవో అమిత్ సింగ్ వెల్లడించారు. రాత్రి సమయంలో గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకోవడానికి కంపెనీ 5,000 మెగావాట్ల పంప్‌డ్ స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా సృష్టిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దీనికి కారణం రాత్రిపూట సూర్యరశ్మి అందుబాటులో లేకపోవడం, విద్యుత్ ఉత్పత్తికి విండ్‌మిల్‌ నడిచేందుకు అవసరమైన గాలి తీవ్రత వాతావరణంలో ఉండకపోవటమే కారణంగా వెల్లడించారు. 


అదానీ సొంత ఉత్పత్తి:
ఈ ఏడాది 6000 మెగావాట్ల సామర్థ్యం పెంచాలనే లక్ష్యం అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ముందు ఉంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కొత్తగా 2800 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించినట్లు సీఈవో అమిత్ సింగ్ వెల్లడించారు. దేశంలో ఏడాదిలో సృష్టించిన మొత్తం ఉత్పత్తి సామర్థ్యంలో ఇది 15 శాతమని పేర్కొన్నారు. ఈ ఏడాది 6000 మెగావాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు వెల్లడించారు. 2030 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 50,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీలో 80 శాతం సోలార్ నుంచి మిగిలినది విండ్ ఎనర్జీ నుంచి ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  


ఇందుకోసం బృందం సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్‌లలో ఉపయోగించే పొరలను తయారు చేయడానికి ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేస్తోంది. తక్కువ గాలి వేగం ఉన్న ప్రాంతాల కోసం మూడు మెగావాట్ల విండ్ ఫామ్‌ను నిర్మించాలని గ్రూప్ ప్రస్తుతం పరిశీలిస్తోందని సీఈవో స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రస్తుతం గుజరాత్‌లోని ఖవ్రా వంటి అధిక సామర్థ్యం గల ప్రాంతాలకు అనువైన 5.2 మెగావాట్ల సామర్థ్యం గల విండ్ టర్బైన్‌లను తయారు చేస్తోంది.