Asia Richest Person Gautam Adani: ఒక చిన్న వ్యాపారంతో బిజినెస్‌ జర్నీని ప్రారంభించిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఇప్పుడు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. ప్రస్తుతం, గౌతమ్ అదానీ నికర విలువ (Gautam Adani Net Worth) 111 బిలియన్ డాలర్లు. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో 11వ అత్యంత సంపన్న వ్యక్తి. ఈ జాబితాలో ముకేష్ అంబానీ 12వ ప్లేస్‌లో ఉన్నారు. అంబానీ ఆస్తుల విలువ (Mukesh Ambani Net Worth) 109 బిలియన్ డాలర్లుగా ఉంది.


అదానీ వెనకున్న అదృశ్య శక్తి
అదానీ గ్రూప్ వ్యాపారం అనేక రంగాల్లోకి, విదేశాల్లోకి విస్తరించింది. ముఖ్యంగా, గత పదేళ్ల అనూహ్యంగా పెరిగింది. అదానీ విజయ పరంపర రహస్యం మోదీ ప్రభుత్వమేనని మార్కెట్‌లో చెప్పుకుంటారు. గౌతమ్‌ అదానీ మాత్రం.. తన అప్రతిహత విజయాల క్రెడిట్‌ను తన భార్య ప్రీతి అదానీకి ఇచ్చారు. తన వెనకుండి నడిపించే శక్తి ఆమేనని సందర్భం వచ్చినప్పుడుల్లా వెల్లడిస్తుంటారు. విశేషం ఏంటంటే... ప్రీతి అదానీ వ్యాపార రంగంలో లేరు. వ్యాపారానికి బదులుగా అదానీ ఫౌండేషన్ నిర్వహణ బాధ్యతను ఆమె చూసుకుంటున్నారు. ఆ ఫౌండేషన్‌ ద్వారా వేలాది మంది ప్రజల జీవితాల్ల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తోంది. 


అదానీ ఫౌండేషన్ చైర్‌పర్సన్ ప్రీతి అదానీ 
అదానీ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ప్రీతి అదానీ వ్యవహరిస్తున్నారు. ఇది దేశంలోని అతి పెద్ద లాభాపేక్ష లేని సంస్థల్లో ఒకటి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద అదానీ గ్రూప్‌ ఈ ఫౌండేషన్‌ను నిర్వహిస్తోంది. ప్రీతి అదానీ 1965లో గుజరాత్‌లో జన్మించారు. 21 ఏళ్ల వయసులో, 1986లో గౌతమ్ అదానీని ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటికి గౌతమ్ అదానీ వయసు 24 ఏళ్లు. ప్రీతి అదానీ డెంటిస్ట్. అదానీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు కరణ్ అదానీ, జీత్ అదానీ. అదానీ వారసులు ఇద్దరూ అదానీ గ్రూప్ కంపెనీల్లో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


ప్రీతి అదానీ ఆస్తుల విలువ
ప్రీతి అదానీ, 1996లో అదానీ ఫౌండేషన్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఫౌండేషన్‌ విద్య, ఆరోగ్యం, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి రంగాల్లో సేవలు అందిస్తుంది. ప్రస్తుతం, 18 రాష్ట్రాల్లోని 5,753 గ్రామాల్లో పని చేస్తోంది. ప్రీతి అదానీ సంపద విలువ (Priti Adani Net Worth) దాదాపు 1 బిలియన్ డాలర్లుగా (రూ. 8326 కోట్లు) అంచనా వేశారు.


తాను 10వ తరగతి పాస్ అయిన వ్యక్తిని అని గౌతమ్ అదానీ ఒక సందర్భంలో చెప్పారు. ప్రీతి వైద్య విద్య చదివారని, అయినప్పటికీ తనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు. తన విజయానికి కారణం ఏంటని ఏవరైనా అడిగితే.. ఆ క్రెడిట్ కేవలం ప్రీతికే చెందుతుందని చెబుతాను అన్నారు.


సాధారణంగా, అదానీ దంపతుల జంట మీడియా ముందుకు రారు. ఇటీవల, జామ్‌నగర్‌లో, ముకేష్ అంబానీ & నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రి-వెడ్డింగ్ ఫంక్షన్‌లో ఈ ఇద్దరు కనిపించారు.


మరో ఆసక్తికర కథనం: ఆసియాలో అత్యంత సంపన్నుడు అదానీ - ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తిరుగుతాయ్‌