Tesla Cars in India: ఎలాన్ మస్క్ టెస్లాను భారతదేశానికి తీసుకురావడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2024 జనవరి నాటికి టెస్లాకు అవసరమైన అన్ని అనుమతులను అందించడానికి ప్రభుత్వ విభాగాలు వేగంగా పని చేస్తున్నాయని ఈటీ నివేదించింది. సోమవారం ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో టెస్లా పెట్టుబడి ప్రతిపాదనతో సహా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ తదుపరి దశపై చర్చించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.


కంపెనీ ఏం చెప్పింది?
టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారతదేశంలో కారు, బ్యాటరీ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఇందులో పేర్కొన్నారు. టెస్లా దేశంలో ఎకో ఫ్రెండీ సప్లై చెయిన్‌పై ప్రత్యేక ఆసక్తిని వ్యక్తం చేశారు. టెస్లాతో ఏవైనా విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలని, కంపెనీ ఇండియా తయారీ ప్రణాళికను త్వరగా ప్రకటించాలని, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలను ఆదేశించినట్లు ఒక అధికారి ఈటీకి తెలిపారు.


ఈ సమావేశంలో సాధారణ విధానపరమైన విషయాలపై ప్రధానంగా చర్చ జరిగింది. 2024 జనవరి నాటికి దేశంలో టెస్లా ప్రతిపాదిత పెట్టుబడి తీసుకురావడానికి ఫాస్ట్ ట్రాకింగ్ అప్రూవల్ ఇవ్వడమే ప్రధాన ఎజెండా అంశం అని ఒక ఉన్నత అధికారి ఈటీకి చెప్పారు. జూన్‌లో మోదీ యునైటెడ్ స్టేట్స్‌ పర్యటన సందర్భంగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అప్పటి నుంచి వాణిజ్యం, పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలు టెస్లా ప్రణాళికల గురించి చర్చలు జరుపుతున్నాయి.


ఇంతకుముందు టెస్లా పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలని కోరింది. 40,000 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలకు ప్రస్తుతం 60 శాతం, అంతకంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు 100 శాతం దిగుమతి సుంకం అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రో కార్బన్ వాహనాలకు భారతదేశ కస్టమ్స్ డ్యూటీ ఒకేలా ఉంటుంది. భారత ప్రభుత్వం స్థానిక తయారీని ప్రోత్సహించడానికి అధిక సుంకాలను విధిస్తుంది. అయితే టెస్లా తన కార్లను లగ్జరీ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలుగా వర్గీకరించాలని వాదిస్తోంది.


క్లీన్ ఎనర్జీతో నడిచే వాహనాలకు తక్కువ పన్నులు ఉండేలా దిగుమతి విధానంలో కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఒక అధికారి తెలుపుతున్న దాని ప్రకారం ఈ ప్రోత్సాహకం టెస్లాకు మాత్రమే కాదు. అన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్న ఏ కంపెనీకైనా ఇదే విధమైన ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది.


దిగుమతి సుంకం కోతలను చర్చలు చేయడంలో ఎదురైన సవాళ్ల కారణంగా టెస్లా గతంలో భారతదేశం కోసం దాని ప్రణాళికలను నిలిపివేసింది. భారత ప్రభుత్వం దిగుమతి సుంకం రాయితీలకు బదులుగా స్థానిక తయారీకి నిబద్ధతకు ప్రాధాన్యం ఇచ్చింది. వాహన తయారీదారులకు ప్రత్యక్ష రాయితీలను అందించే మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేలా కంపెనీలను ప్రోత్సహించింది.


చవకైన టెస్లా మోడల్ 2పై వర్క్ జరుగుతోందా?
రాయిటర్స్ నివేదిక ప్రకారం టెస్లా బెర్లిన్ సమీపంలోని తన కర్మాగారంలో 25,000 యూరోల (మనదేశ కరెన్సీలో సుమారు రూ. 22.3 లక్షలు) కారును కూడా ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. టెస్లాకి ఇది ఒక ముఖ్యమైన దశ అని చెప్పవచ్చు. ఇది చాలా కాలంగా దాని కార్లను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాన్ మస్క్ చవకైన ఎలక్ట్రిక్ కారు కోసం ప్రణాళికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. కంపెనీ ఇప్పుడు ఉత్పత్తి ప్రక్రియలలో విప్లవాత్మక మార్పులు చేయడం ద్వారా దాని ఎలక్ట్రిక్ కార్ల ధరను తగ్గించే టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తోంది. 2030 నాటికి 20 మిలియన్ వాహనాలను డెలివరీ చేయాలనేది టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని చేరుకోవడానికి పెద్ద ఎత్తున మరిన్ని మార్కెట్‌లకు విస్తరించడం చాలా అవసరం.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!