E20 Petrol India: దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసిన E20 పెట్రోల్ విధానంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. వాహనాల మైలేజ్ తగ్గుతోందని, పనితీరుపై ప్రభావం పడుతోందని యూజర్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ విమర్శలు కూడా పెరగడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, ఆటోమొబైల్ పరిశ్రమతో కలిసి, E20 విధానాన్ని సమర్థించే ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇటీవల, భారత అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కోర్టు విచారణ సందర్భంగా ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని "ఒక ప్రయోగం"గా అభివర్ణించినట్లు వార్తలు రావడం చర్చకు దారితీసింది. వచ్చే ఏడాదిలోనే దీని ఫలితాలు పూర్తిగా తెలుస్తాయని వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన వ్యాఖ్యలు E20 ఇంధన నాణ్యత గురించి కాకుండా ఎథనాల్ సరఫరా పరిమాణానికి సంబంధించినవేనని కేంద్ర ప్రభుత్వం తర్వాత స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రజల్లో ఇప్పటికే ఉన్న అనుమానాలు మరింత పెరిగాయి.
జులై 4న నిర్వహించిన సమావేశంలో మారుతి సుజుకి, టయోటా కిర్లోస్కర్ మోటార్ & హీరో మోటోకార్ప్ కంపెనీల ప్రతినిధులు E20 విధానానికి బహిరంగ మద్దతు ప్రకటించారు. మారుతి సుజుకి కార్పొరేట్ వ్యవహారాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ, 2023కు ముందు E10 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన వాహనాలను కూడా E20 పెట్రోల్తో విస్తృతంగా పరీక్షించామని తెలిపారు. వాహన భాగాల దెబ్బతినడం, తుప్పు పట్టడం లేదా పనితీరులో ఎలాంటి తీవ్రమైన సమస్యలు గుర్తించలేదని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: సేఫ్గా డ్రైవ్ చేస్తే భారీ డిస్కౌంట్ - టెలిమాటిక్స్తో మారిపోనున్న వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం!
హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆశుతోష్ వర్మ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కోట్లాది సర్వీస్ రికార్డులను పరిశీలించినా E20 పెట్రోల్ కారణంగా వాహనాల్లో అదనపు నష్టం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు.
టయోటా కిర్లోస్కర్ మోటార్ కంట్రీ హెడ్ విక్రమ్ గులాటి మాట్లాడుతూ, ఆటోమొబైల్ రంగంలో ప్రతి వాహనం & ప్రతి ఇంధనం కఠినమైన పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే మార్కెట్లోకి వస్తాయని వివరించారు. ఎథనాల్ వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.
2013-14లో కేవలం 1.5 శాతంగా ఉన్న ఎథనాల్ బ్లెండింగ్ 2025 డిసెంబర్ నాటికి 20 శాతానికి చేరుకుందని ఇంజినీర్స్ ఇండియా మాజీ ఛైర్మన్ వర్తికా శుక్లా తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాన్ని ఐదేళ్ల ముందుగానే సాధించడం విశేషమన్నారు.
ఇది కూడా చదవండి: టైర్పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
అయితే ప్రజల్లో అనుమానాలు మాత్రం తగ్గడం లేదు. ఇటీవల, బీహార్కు చెందిన కంటెంట్ క్రియేటర్ మనీష్ కశ్యప్ తన టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్లో సుమారు 12 వేల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఇంజిన్ వైబ్రేషన్ & నాకింగ్ సమస్యలు వచ్చాయని వీడియో విడుదల చేశారు. దీనికి E20 పెట్రోల్ కారణమని ఆరోపిస్తూ, వినియోగదారులకు సాధారణ పెట్రోల్ ఎంపిక కూడా ఉండాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన టయోటా, సంబంధిత వాహనాన్ని పూర్తిగా పరిశీలించినట్లు తెలిపింది. సమస్యకు కారణం E20 పెట్రోల్ కాదని, కలుషితమైన ఇంధనమే కారణమని స్పష్టం చేసింది. ఫ్యూయల్ ట్యాంక్ & ఫ్యూయల్ లైన్లను శుభ్రపరిచి, ప్రామాణిక E20 పెట్రోల్ నింపిన తర్వాత వాహనం సాధారణంగా పనిచేసిందని వెల్లడించింది. వినియోగదారులు గుర్తింపు పొందిన పెట్రోల్ బంకుల్లోనే ఇంధనం నింపాలని సూచించింది.
రాజకీయంగా కూడా ఈ అంశం వేడెక్కుతోంది. తగిన సంప్రదింపులు లేకుండానే కేంద్ర ప్రభుత్వం E20 అమలు చేసిందని ప్రతిపక్ష నేత ప్రియాంక్ ఖర్గే విమర్శించారు. జులై 5న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, రాజకీయ విశ్లేషకుడు తహసీన్ పూనావాలా ఆధ్వర్యంలో E20కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించగా, వందలాది మంది వాహనదారులు పాల్గొన్నారు.
అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం E20 విధానానికి కట్టుబడి ఉంది. ఈ ఇంధనం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గడం, విదేశీ మారకద్రవ్య పొదుపు, ముడి చమురు దిగుమతుల తగ్గింపు & రైతులకు ఎథనాల్ ముడి పదార్థాల డిమాండ్ పెరగడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. భవిష్యత్తులో E22, E25, E27 & E30 ప్రమాణాలను కూడా అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. అలాగే ప్రస్తుతం ఉన్న E10 & E20 వాహనాలపై E25 ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ARAIకి బాధ్యతలు అప్పగించింది.
ఇదిలా ఉండగా డీజిల్లో ఐసోబ్యుటానాల్ బ్లెండింగ్ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం విక్రయిస్తున్న డీజిల్ కార్లు ఆ ఇంధనానికి అనుకూలంగా లేనందున దీనిపైనా భవిష్యత్తులో విస్తృత చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
