Car Discounts :   పండుగల సీజన్ వచ్చేసింది. కార్ల మార్కెట్ కూడా ఊపందుకుంటోంది. ఇప్పటి వరకూ చిప్‌ల కొరతతో మందకొడిగా ఉన్న పరిశ్రమ ఇప్పుడిప్పుడే వేగం పంజుకుంటోంది. వచ్చే పండుగల సీజన్‌లోమార్కెట్ ను కైవసం చేసుకునేందుకు పెద్ద పెద్ద కంపెనీలన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీలను ప్రయోగిస్తున్నాయి. బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి వాహ‌నాల‌పై డిస్కౌంట్లు, ఆఫ‌ర్ల‌తో   మారుతి సుజుకి, టాటా మోటార్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, హ్యుండాయ్ త‌దిత‌ర కార్ల త‌యారీ సంస్థ‌లు ప్రచారం ప్రారంభించాయి. 


కరోనా తర్వాత వాహనాలు ముఖ్యంగా వ్యక్తిగత కార్లు కొనాలనుకునేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకే కార్ల కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్లపై డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి.  హ్యుందాయ్ కంపెనీ  సాంత్రో, ఐ10 నియోస్‌, ఔరా, ఐ20, ఎక్స్‌సెంట్‌, కొనా ఈవీ వంటి వివిధ మోడ‌ల్ కార్ల‌పై  క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, అద‌న‌పు ఇన్సెంటివ్‌లు అందించ‌నున్నట్లుగా ప్రకటించారు.  మోడ‌ల్ ను బట్టి  కార్ల‌పై రూ.13 వేల నుంచి రూ.50 వేల వ‌ర‌కు రాయితీ  ఇవ్వనుంది. 



ఇక దేశీయ ఆటోమొబైల్ జెయింట్ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కూడా ఎక్స్‌యూవీ300, బొలెరో, బొలెరో నియో వంటి మోడ‌ల్ కార్ల‌పై ప‌లు ఇన్సెంటివ్‌లు, ఆఫ‌ర్లు అందిస్తాయి. అతిపెద్ద ఆటో మేజ‌ర్ మారుతి సుజుకిలో ఎంపిక చేసిన మోడ‌ల్ కార్లు ఎస్‌-ప్రెస్సో, ఆల్టో800, స్విఫ్ట్‌, సెలెరియో వంటి వేరియంట్ కార్ల‌పై రూ.9000-60,0000 వ‌ర‌కు డిస్కౌంట్లు అందిస్తున్న‌ది.


 
మ‌రో దేశీయ ఆటోమొబైల్ మేజ‌ర్ టాటా మోటార్స్ సైతం టియాగో, టైగోర్‌, నెక్సాన్‌, స‌ఫారీ వంటి మోడ‌ల్ కార్ల‌పై రూ.40 వేల వ‌ర‌కు డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. కేర‌ళ‌లో ఓనం వేడుక‌ల నుంచి డిస్కౌంట్లు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. గ‌త రెండేండ్లుగా కార్ల‌కు చాలా ఎక్కువ‌గా డిమాండ్ ఉంది. అయినప్పటికీ రూ.20 వేల నుంచి రూ.40 వేల వ‌ర‌కు రాయితీలు క‌ల్పిస్తోంది.