Pawan Kalyan vs Jagan Mohan Reddy | అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరును వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. గోరంతను కొండంతగా చేసి చూపించడంలో ఏపీ సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మించిపోయారంటూ సెటైర్లు వేస్తున్నారు. అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేయడంలో చంద్రబాబు (Chandrababu) దిట్ట అయితే పవన్ కళ్యాణ్ గురువును మించిన శిష్యుడయ్యాడు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లలో గుంతలను పూడ్చడమే కానీ రోడ్లు వేసింది మాత్రం శూన్యమని వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
వైసీపీ హయాంలో రోడ్లు నిర్మించగా.. నేడు కూటమి ప్రభుత్వం రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చడానికి కేవలం రూ.860 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కొత్త రోడ్ల నిర్మాణ బాధ్యతల నుంచి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది. పీపీపీ విధానంలోనే కొత్త రోడ్లను నిర్మిస్తామని ప్రకటించి తద్వారా వాహనదారుల నుంచి పెద్ద మొత్తంలో టోలు ఫీజులు (Toll Tax) వసూలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. టీడీపీ పెద్దలే కాంట్రాక్టర్లుగా మారి టోలు వసూలు చేసుందుకు సిద్ధంగా ఉన్నారు.
వైసీపీ పాలనలో ఒక ఏడాది కోవిడ్ కాగా, మిగతా 4 ఏళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.43 వేల కోట్లు ఖర్చు చేశాం. రోడ్ల మరమ్మతుల కోసం రూ.4,648 కోట్లు ఖర్చు పెట్టింది. రాష్ట్రంలో రోడ్ల గుంతలు పూడ్చటంతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ ప్రభుత్వం కొత్త రోడ్లను నిర్మించింది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నిజాలు మాట్లాడితే బాగుంటుందని డిప్యూటీ సీఎంకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వైసీపీ అయిదేళ్లలో చేయలేనిది కూటమి ప్రభుత్వం కేవలం 6 నెలల్లో చేసి చూపించిందని, పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వంగా మారి చర్చకు దారి తీసింది.
ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం కామెంట్ చేశారు..
ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని మోదీ నాయకత్వంలో, సీఎం చంద్రబాబు పాలనలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ అరుదైన ఘనత సాధించిందని పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం పోస్ట్ చేశారు. వైసీపీ ఐదేళ్లలో 1800 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే 3,750 కి.మీ నిర్మించింది. వైసీపీ 5 ఏళ్లలో కేవలం 268 మినీ గోకులాలు నిర్మించగా, కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే 22,500 నిర్మించింది. వైసీపీ హయాంలో రూ.91 కోట్లు ఖర్చు పెడితే, కూటమి సర్కార్ 6 నెల్లోనే పీవీటీజీ హాబిటేషన్స్కు రూ.750 కోట్లు వెచ్చించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో చేసిన పోస్ట్ వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. గత ఐదేళ్ల పాలనను కేవలం 6 నెలల కూటమి పాలన తిరగరాసిందని పవన్ కళ్యాణ్ చేసిన పోస్టుపై వైసీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
Also Read: Pawan Kalyan: విజయవాడ బుక్ ఫెయిర్లో రూ.5 లక్షల బుక్స్ కొన్న పవన్ కళ్యాణ్, ఓ బుక్ చూడగానే సంతోషం