Controversy in YSRCP Ticket Exercise :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కసరత్తు రాను రాను వివాదాస్పదమవుతోంది. నేరుగా సీఎం జగన్‌పైనే ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు తన ఆగ్రహాన్ని ఆపుకోలేదు.  తనపై వ్యతిరేకత ఉందని సీటు ఇవ్వనని చెబితే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. తాను జగన్ చెప్పిన పనులన్నీ చేశానని ఆయన అన్నారు. 


జగన్ చెప్పినట్లే చేస్తే నాపై వ్యతిరేకత ఎందుకు : ఎం.ఎస్ బాబు                 


జగన్ చెప్పిన పనులన్నీ చేసినప్పుడు అసంతృప్తి ఉంటే అది తనవల్ల ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. తాను ఏం తప్పు చేశానో జగన్ పిలిచి చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. తాను జగన్ ను కలిసినప్పుడు వ్యతిరేకత ఉందని తనతో అన్నారని ఎంఎస్ బాబు మీడియాకు తెలిపారు. తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లే తాను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగానని అన్నారు. ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదనిఅసంతృప్తి వ్యక్తం చేశారు. 


కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం - ముహూర్తం ఖరారు.?


దళితులనే మారుస్తున్నారు - ఓసీలను  మార్చట్లేదు  : ఎంఎస్ బాబు                  


తిరుపత్తి, చిత్తూరు జిల్లాల్లోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఓసలను మార్చలేదని, కేవలం దళితుల పట్లనే అన్యాయం జరుగుతుందని ఆయన ఫైర్ అయ్యారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే వారికి అన్యాయం జరిగిందని ఎంఎస్ బాబు అన్నారు. తాను చేసిన తప్పేంటో జగన్ చెప్పాల్సిందేనని అన్నారు. అయితే తాను వైసీపీలోనే కొనసాగుతానని, తనకు జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. దళితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.                            


మా డబ్బు ఇవ్వకుంటే ఎలా బతకాలి? త్వరగా విడుదల చేయాల్సిందే - ఏపీ ఉద్యోగుల డిమాండ్


డబ్బులిస్తే ఐప్యాక్ సర్వే  మార్చేస్తారు : ఎంఎస్ బాబు                       


ఐ ప్యాక్ సర్వేలను చూపించి వ్యతిరేకత ఉందని చెబుతున్నారని   డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారన్నారు.  పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతుందన్నారు. పూతలపట్టు నుంచి కుతూహలమ్మ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఎం.ఎస్ బాబును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సహించారు. గత ఎన్నికల్లో ఆయనే టిక్కెట్ ఇప్పించారు. అయితే ఇప్పుడు  టిక్కెట్ ఇవ్వడం లేదని నేరుగా సీఎం జగన్ పైనే విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది.  ఎక్కువగా  రిజర్వుడు నియోజకవర్గాల అభ్యర్థులనే మారుస్తూండటంతో వైసీపీలో కూడా విస్తృత చర్చ జరుగుతోంది.