YS Sharmila Merge Party With Congress: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక సమక్షంలో షర్మిల హస్తం పార్టీలో ఈ నెల 4న (గురువారం) చేరనున్నట్లు సమాచారం. ఆమెతో పాటు 40 మంది నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం అందుబాటులోని పార్టీ ముఖ్య నేతలతో షర్మిల సమావేశం అయ్యారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు రోజులు ఓపిక పడితే అన్ని విషయాలపైనా క్లారిటీ వస్తుందని షర్మిల చెప్పారు. కాగా, గురువారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా  షర్మిల ఇడుపులపాయకు బయలుదేరనున్నారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ పత్రికను సాయంత్రం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి నివాళి అర్పించనున్నారు.


కీలక పదవి


అన్ని విషయాలపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని షర్మిల వెల్లడించారు. తనతో కలిసి నడుస్తానన్న ఎమ్మెల్యే ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న షర్మిల.. తెలంగాణ ఇవ్వడం వల్లే ఏపీలో కాంగ్రెస్ నష్టపోయిందని అన్నారు. ఏఐసీసీ పదవి చేపడితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసే అవకాశం ఉంటుందన్న నేతల వాదనతో ఆమె ఏకీభవించారు. తెలంగాణలో సాధించిన విజయాల స్ఫూర్తితో ఏపీలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందని, ఇందులో భాగంగానే షర్మిలకు కీలక పదవి అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు, వైఎస్ షర్మిలకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని వైఎస్సార్టీపీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ఆమె ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పారు. పార్టీ నేతలకు కీలక పదవులు ఉంటాయని షర్మిల స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. సమావేశం అనంతరం షర్మిల కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి నివాళి అర్పిస్తారు. 


Also Read: AP Sanitation Workers Strike: మున్సిపల్‌ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం