రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా పట్టుబడి విచారణ ఎదుర్కొ్ంటున్నవారిలో ఒకరైన వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి కీలక వివరాలను బహిర్గతం చేశాడు. బెంగళూరులో ఓ భూ వివాదంలో వాటా ఇవ్వనందుకు గానూ ప్రధానంగా వివేకాను హత్య చేసేందుకు గంగిరెడ్డి ప్లాన్‌ చేశారని దస్తగిరి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అంతేకాక, ఈ హత్య వెనుక వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, డి.శంకర్‌ రెడ్డి వంటి పెద్దవాళ్లు కూడా ఉన్నారని చెప్పారు.


గత ఆగస్ట్ నెల 31న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తీరును వివరిస్తూ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. ప్రొద్దుటూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానంలో సీఆర్‌పీసీ 164(1) ప్రకారం దస్తగిరి ఆగస్టు 31న, సీబీఐకి ఆగస్టు 25న ఇచ్చిన వాంగ్మూలాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. దస్తగిరి తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పెద్ద పెద్ద నేతల పేర్లు ప్రస్తావించారు. వివేకా హత్యలో తనతో పాటు నలుగురు పాల్గొన్నట్టు దస్తగిరి అంగీకరించాడు.


ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి ఒప్పకున్నారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు పేర్కొన్నారు. అలా 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే ఈ హత్య కుట్ర రూపొందిందని చెప్పారు. ఈ హత్య చేస్తే నీ జీవితం సెటిలైపోతుందంటూ గంగిరెడ్డి తనతో చెప్పాడని దస్తగిరి ఒప్పుకున్నాడు. ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సునీల్‌ తనకు రూ.కోటి అడ్వాన్సు ఇచ్చాడని చెప్పారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోని వివరాల ప్రకారం.. 


దస్తగిరి వాంగ్మూలంలోని పూర్తి వివరాలు..
2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ఓడిపోయారు. వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శంకర్‌ రెడ్డి సరిగా మద్దతివ్వనందుకే ఓడిపోయారు. తర్వాత వివేకానంద రెడ్డి ఓ రోజు హైదరాబాద్‌ నుంచి తిరిగివస్తూ ముద్దనూరు రైల్వేస్టేషన్‌ వద్ద తనను పికప్‌ చేసుకోమని నాతో (దస్తగిరి) చెప్పారు. ఆయన్ను తీసుకొస్తుండగా మార్గమధ్యలో గంగి రెడ్డికి ఫోన్‌ చేసి ఇంటికి రమ్మన్నారు. మేం వివేకా ఇంటికి వెళ్లేసరికి గంగిరెడ్డి అక్కడ ఉన్నారు. తర్వాత ఆయన్ను వెంట బెట్టుకుని వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇంటికి బయల్దేరారు. దారిలో ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను మీరు మోసం చేశారు. నాకు అన్ని విషయాలు తెలిశాయని గంగి రెడ్డిపై వివేకానంద రెడ్డి మండిపడ్డారు. 


గంగిరెడ్డిని తిట్టిన వివేకా
అవినాష్‌ రెడ్డి ఇంటికి వెళ్లాక అక్కడున్న డి.శంకర్‌ రెడ్డిని ‘నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నన్ను మోసం చేశావు. నన్ను నా కుటుంబ సభ్యులకు దూరం చేశావు. నీ అంతు చూస్తానంటూ వివేకా హెచ్చరించారు. తర్వాత అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, శంకర్‌ రెడ్డిలను మీ అందరి సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. కాసేపటి తర్వాత వివేకా.. గంగిరెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డిలను మళ్లీ కార్యాలయానికి పిలిపించుకుని బాగా తిట్టారు. అప్పటి నుంచి పది రోజులపాటు వారిద్దరూ వివేకానంద రెడ్డితో మాట్లాడలేదు.


భూ సెటిల్‌మెంట్‌ డబ్బుల్లో వాటా అడిగిన గంగి రెడ్డి
కడపకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన భూ సెటిల్‌మెంట్‌ వ్యవహారం కోసం వివేకానంద రెడ్డి, గంగి రెడ్డిలను వారంలో మూడు నాలుగుసార్లు బెంగళూరు తీసుకెళ్లేవాణ్ని. సెటిల్‌మెంట్‌ పూర్తయ్యాక అందులో రావాల్సిన రూ.8 కోట్లు వివేకాకు వచ్చాయి. ఆ డబ్బుల్లో వాటా అడిగాడు. దీంతో గంగి రెడ్డిపై వివేకాపై కోపంగా అరిచారు. అంతకు కొన్నాళ్ల ముందే యాదటి సునీల్‌ యాదవ్‌ను గజ్జల ఉమాశంకర్‌రెడ్డి వివేకాకు పరిచయం చేశారు. తర్వాత కొన్నాళ్లపాటు వివేకా, గంగిరెడ్డి, సునీల్‌, ఉమాశంకర్‌రెడ్డి కలిసి కారులో బెంగళూరుకు వెళ్తుండేవారు. 


2018లో ఉద్యోగం మానేశా..
2018 డిసెంబరులో వివేకానంద రెడ్డి కారు వద్ద డ్రైవర్‌గా ఉద్యోగం మానేశాను. తర్వాత కూడా సునీల్‌, ఉమాశంకర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిని తరచూ కలిసేవాణ్ని. 2019 ఫిబ్రవరి 10న సునీల్‌.. నన్ను, ఉమాశంకర్‌ రెడ్డిని గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ గంగిరెడ్డి నాతో మాట్లాడుతూ..  ‘బెంగళూరు భూ సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో వివేకానంద రెడ్డి నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు. ఆయన్ను నువ్వు చంపెయ్‌’ అని అన్నారు. ఆయన దగ్గర పనిచేశా, హత్య చేయనన్నాను. ‘నువ్వొక్కడివే కాదు. మేమూ ఉంటాం. దీని వెనుక పెద్దవాళ్లు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డిలు ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్‌ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడు. అందులో రూ.5 కోట్లు నీకిస్తా’ అని గంగిరెడ్డి చెప్పాడు. నాలుగు రోజుల తర్వాత రూ.కోటి అడ్వాన్సు ఇచ్చాడు. మళ్లీ ఇస్తానంటూ రూ.25 లక్షలు తనే తీసుకున్నాడు. మిగిలిన రూ.75 లక్షలు నా స్నేహితుడు మున్నా దగ్గర ఉంచాను. డబ్బులు ఉంచినందుకు రూ.5 లేదా రూ.6 లక్షలు కమీషన్‌ ఇస్తానన్నాను.


Also Read: Viral video: వార్నీ.. దేవుడి కాళ్లకు మొక్కి మరీ గుడిలో హుండీని ఎత్తుపోయాడు, వీడియో వైరల్


గొడ్డలితో దాడి చేసింది ఆయనే..
హత్యకు ముందు అర్ధరాత్రి 1.30 గంట వరకూ మద్యం తాగి, బైక్‌పై వివేకా ఇంటి వెనుకకు వెళ్లాం. లోనికి వెళ్లాక వివేకా హాల్‌ నుంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. గంగిరెడ్డి బెంగళూరు భూ సెటిల్‌మెంట్‌ డబ్బుల్లో తనకూ వాటా ఇవ్వాలని ఆయన్ను అడిగాడు. ‘సెటిల్‌మెంట్‌ చేసింది నేనైతే... నీకు వాటా ఎలా ఇస్తాను?’ అని వివేకా ప్రశ్నించారు. ఉమాశంకర్‌ రెడ్డి కలగజేసుకుని తమకేమీ సాయం చేయనందున సెటిల్‌మెంట్‌ డబ్బులో వాటా ఇవ్వాలని అడిగాడు. ఇంతలో సునీల్‌ వివేకాను అసభ్యంగా తిడుతూ ముఖంపై కొట్టాడు. ఆయన వెనక్కి పడిపోయారు. ఉమాశంకర్‌రెడ్డి నా దగ్గరున్న గొడ్డలి లాక్కుని వివేకా తలపై కొట్టడంతో రక్తం వచ్చింది. 


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? ‘హ్యూమాన్జీ’ ఏమైంది?


గంగిరెడ్డి, సునీల్‌, ఉమాశంకర్‌రెడ్డి డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెతుకుతుండటంతో వివేకా వారిపై గట్టిగా అరిచాడు. దీంతో నేను ఆయన కుడి అరచేతిపై గొడ్డలితో కొట్టి, గాయపరిచాను. కాసేపటికి వారికి కొన్ని పత్రాలు దొరికాయి. అప్పటి డ్రైవర్‌ ప్రసాదే తనను చంపి పారిపోయాడని వివేకాతో బలవంతంగా ఓ లెటర్ రాయించి సంతకం పెట్టించాం. తర్వాత వివేకాను బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి పడేశాం. ఉమాశంకర్‌ రెడ్డి వివేకా తలపై అయిదారుసార్లు గొడ్డలితో దాడి చేయడంతో ఆయన చనిపోయారు. 2019 మార్చి 15న పోలీసులు మమ్మల్ని విచారణకు పిలిపించారు. అప్పుడూ గంగిరెడ్డి నాకు ధైర్యం చెప్పాడు.’’ అని దస్తగిరి విచారణలో ఒప్పుకున్నాడు.


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..