Just In





YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Power Tariff Hike in Andhra Pradesh | గత 5 ఏళ్లలో వైసీపీ మోపిన భారం రూ.35వేల కోట్లు కాగా, 5 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపిన భారం రూ.18 వేల కోట్లు అని వైఎస్ షర్మిల ఆరోపించారు.

Andhra Pradesh Power Charges Hike | హైదరాబాద్: వైఎస్ జగన్ హయాంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయని, గత ప్రభుత్వం చేసిన పాపాలకు కూటమి ప్రభుత్వం ప్రాయశ్చిత్తం చేయడానికి బదులుగా ప్రజలపై బారం మోపడం సరికాదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పాపాలకు పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల నెత్తినే మోపుతోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్లలో తమ తప్పు లేదని, తమకు అసలు సంబంధం లేదని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రజల మీదే ఆ బారాన్ని మోపిందని విమర్శించారు. కూటమి సర్కార్ చెబుతున్నట్లుగా ఇది విద్యుత్ ఛార్జీల సర్దుబాటు కాదు.. ప్రజలకు "సర్దుపోటు" అని... ప్రజలకు కూటమి సర్కారు ఇచ్చిన భారీ కరెంటు షాక్ అని షర్మిల పేర్కొన్నారు.
ప్రజలకు కూటమి సర్కార్ శాపం
విద్యుత్ ఛార్జీల విషయంలో వైసీపీ చేసింది పాపం అయితే - రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ (టీడీపీ, జనసేన, బీజేపీ) పెడుతున్నది శాపం. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధం ఉంది. అధిక ధరకు విద్యుత్ కొనుగోలుతో పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపడం ఏంటని అని షర్మిల ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో వైసీపీ మోపిన భారం రూ.35వేల కోట్లు కాగా, కూటమి ప్రభుత్వం 5 నెలల్లో మోపిన భారం రూ.18 వేల కోట్లు.. ఇక వైసీపీకి మీకు ఏంటి తేడా ? అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల నిలదీశారు.
5 ఏళ్లలో వైసీపీ భారం, 5 నెలల్లో కూటమి సర్కార్ రూ.18వేల కోట్ల భారం
వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచేది లేదని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే, తప్పు ఎవరు చేసినా.. ప్రజలపై ఆ భారాన్ని మోపొద్దనే చిత్తశుద్ది ఉంటే వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజలపై పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని గల్లా పట్టి అడగాలి కానీ, ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేసినా ఊరుకునేది లేదని కాంగ్రెస్ తరఫున హెచ్చరించారు.
ట్రూఅప్ ఛార్జీల రూపంలో ప్రజల ముక్కు పిండి, అధిక కరెంటు బిల్లులు వసూళ్లు చేయడానికి నిరసనగా రేపటి (నవంబర్ 6) నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చినట్లు వైఎస్ షర్మిల తెలిపారు.
Also Read: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు