ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుకు పీఆర్సీ ప్రకటించింది.  ఇప్పటికే అమలు చేస్తున్న ఐ.ఆర్ కన్నా తక్కువగా ఫిట్‌మెంట్ ఖరారు చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమయింది. జీతాలు తగ్గుతాయా లేదా అన్న లెక్కలు ప్రతి ఒక్క ఉద్యోగి వేసుకుంటున్నారు. పెన్షనర్లకూ టెన్షన్ ప్రారంభణయింది.  ఈ క్రమంలో పీఆర్సీపై పూర్తి స్థాయి ఎనాలసిస్‌ను మీకందిస్తున్నారు. ఎవరికి జీతం పెరుగుతుంది..? ఎవరికి తగ్గుతుంది ? పె‌న్షనర్ల పరిస్థితేమిటన్నిది ఈ వివరాల్లో తెలుసుకోవచ్చు. 


Also Read: 23 శాతం ఫిట్మెంట్ ఓకే.... పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు హర్షం


జీతాలు వాస్తవంగా తగ్గుతాయి..! 


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి లభిస్తోంది. అంటే వాస్తవంగా 2018నాటికి పే రివిజన్ కమిషన్ సిఫార్సుల్ని ఆమోదించి ఆమలు చేయాల్సి ఉంది. కానీ ఆలస్యమవుతున్నందు వల్ల అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ప్రకటించింది. ఆతర్వాత సీఎం జగన్ అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఐఆర్‌ను 27  శాతానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే రెండున్నరేళ్ల తర్వాత పీఆర్సీ అమలుకు వచ్చే సరికి  ఫిట్‌మెంట్‌ను ఐఆర్‌గా ప్రకటించిన 27 శాతం కన్నా తక్కువగా 23.29 శాతమే ఖరారు చేశారు. దీంతో  ఇప్పటికే తీసుకుంటున్న జీతాల్లో మూడున్నర శాతం వరకూ కోత పడనుంది. ఉదాహరణకు 23 శాతం ఫిట్‌మెంట్‌తో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో పనిచేస్తున్న సెక్షన్‌ అధికారి మినిమమ్‌ బేసిక్‌ పే రూ.56,909.  హెచ్‌ఆర్‌ఏ 16 శాతం రూ.9,105 లభిస్తుంది. కానీ ఇప్పుడు 27 శాతం ఐఆర్‌తో వారు అందుకుంటున్న బేసిక్ 60వేలకుపైగానేఉంది. అంటే ఆ మేరకు కోత పడుతుందన్నమాట. ఇలా అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్క ఉద్యోగికి జీతం తగ్గుతుంది. 


Also Read: ఏపీ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్.. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు !


పెండింగ్ డీఏలు అన్నీ ఇచ్చి పతగ్గే జీతంతో కవర్ చేస్తున్న ప్రభుత్వం !


ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న అలెన్స్ సౌకర్యాల్లో డీఏ అత్యంత కీలకమైనది. కరువు భత్యంగా చెప్పుకునే ఈ డీఏను ప్రతి ఆరు నెలలకోసారి ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా ఇది ఉంటుంది. ఇలాంటి డీఏలు ఏపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పెండింగ్‌లో పెట్టింది. వీటన్నింటినీ ఇప్పుడు వచ్చే నెల నుంచి ఇవ్వాలని నిర్ణయించుకుంది.  2021 జూలై 1 నాటికి పెండింగ్‌లో ఉన్న డీఏ 20.2 శాతం అందరికీ ఇస్తారు. దీని వల్ల  ఫిట్‌మెంట్ తగ్గింపు వల్ల ఎంత జీతం తగ్గిపోతుందో అది మొత్తం ఈ డీఏల మంజూరుతో కవర్ అయిపోతుంది. పైగా ఒక వెయ్యి లేదా రెండు వేలు పెరుగుతుంది. అంటే.. వాస్తవంగా తగ్గే జీతం... డీఏలన్నీ మంజూరుచేయడంతో కవర్ అయిపోతుంది. నిజానికి ఈ డీఏలు ఉద్యోగుల హక్కు. పీఆర్సీతో సంబంధం లేదు. కానీ పీఆర్సీతో ముడి పెట్టడం ద్వారా ప్రభుత్వం జీతం తగ్గించినా తగ్గించలేదన్న ఓ అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నించింది. ఉద్యోగులు కూడా జీతం తగ్గలేదు కదా అని ఫీలయ్యే పరిస్థితి వచ్చింది. కానీ వాస్తవగా అయితే ఉద్యోగులు జీతాన్ని నష్టపోతున్నారు. ప్రభుత్వం ఈ విధానం అవలంభించడం వల్ల .. ఓ వైపు వేతనంలో కోత ద్వారా జరిగే నష్టం, డీఏ వల్ల రావలసిన ప్రయోజనాలు అందకపోవడం వల్ల జరిగే నష్టం.. ఇలా రెండు రకాలుగా నష్టపోతామని కొంత మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?



హెచ్‌ఆర్‌ఏ తగ్గిస్తే ఉద్యోగులకు మరింత కష్టం ! 


ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే  హెచ్‌ఆర్‌ఏ గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.  ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ  ... కార్యదర్శుల కమిటీ ఆధారంగా ఇచ్చారు. ఆ కమిటీ నివేదికలో  5 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉన్న ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏను 16 శాతంగా నిర్ణయించింది. మిగతా నగరాల్లో 8శాతం చాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉద్యోగులు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా...12 నుంచి 16 శాతం హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటున్నారు. సీఎస్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తే 80 శాతం మందికిపైగా ఉద్యోగులు ఐదారుశాతం వరకూ హెచ్‌ఆర్‌ఏను కోల్పోనున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, ఇంకా ఒకట్రెండు నగరాల్లో తప్ప 5 లక్షలపైన జనాభా గల నగరాలు లేవు. ఆయా నగరాల్లో పని చేసే ఉద్యోగులకు మాత్రమే 16శాతం హెచ్‌ఆర్‌ఏ ఉంటుంది. మిగిలిన వారికి అందేది 8 శాతమే. ఇది వారిని మరింతగా నష్టం చేకూరుస్తుంది.  హైదరాబాద్‌ నుంచి బదిలీ అయి.. హెచ్‌వోడీలు, సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం 30 శాతం హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటున్నారు. వీరికి ఇప్పుడు అందేది 16 శాతమే. 


Also Read: ఎప్పుడు : పదో తేదీ , ఎక్కడ : అమరావతి, ఏం జరగనుంది : ఆర్జీవీ - పేర్ని నాని భేటీ !


పెన్షనర్లకు అన్ని విధాలుగా నష్టమే ! 


27 శాతం ఐఆర్ తీసుకుంటున్న పెన్షనర్లకు ఫిట్మెంట్ 23.29 వల్ల 3.7 శాతం తగ్గుతుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ బేసిక్, ఐఆర్‌తో కలిసి రూ. 63688 డ్రా చేసుకుంటూంటే వచ్చే నెల నుంచి ఆ పెన్షనర్‌కు అందేది రూ. 62187 మాత్రమే. ఇలా వచ్చే పెన్షన్ స్థాయిని బట్టి తగ్గుతుంది.  రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ పే  ప్రతీ సంవత్సరం వార్షిక ఇంక్రిమెంట్ మంజూరుతో పెరుగుతూ ఉంటుంది. కానీ పెన్షనర్స్ బేసిక్ పెన్షన్ మార్పు PRCలలో మాత్రమే మారుతుంది. దీనివల్ల సీనియర్ పెన్షనర్లకన్నా వెనుక రిటైర్ అయిన జూనియర్ పెన్షనర్లు ఎక్కువ పెన్షన్ పొందడం జరుగుతుంది.  వయసు పెరిగే కొద్దీ ఉద్యోగులకు అడిషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పేరుతో పెన్షన్ పెంచుతారు. దాని గురించి పీఆర్సీలో ఎలాంటి ప్రస్తావన లేదు.  అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను 70 సంవత్సరాల వయసు దాటిన వారికి ఇస్తున్నారు. వయసు పెరిగే కొద్ది అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆస్పత్రి ఖర్చులు పెరుగుతాయన్న ఉద్దేశంతోనే ఇది   ఇస్తున్నారు. కేంద్రంలో 80 ఏళ్లు దాటిన ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో కూడా 80 ఏళ్లు దాటిన ఉద్యోగులకే ఈ ప్రయోజనం అందజేద్దామంటూ సీఎస్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీని వల్ల 70 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లు 15 శాతం, 75 నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లు 20 శాతం పెన్షన్‌ నష్టపోతారు. 


Also Read: ఏపీలో సినిమా వ్యాపారానికి మరో దెబ్బ... కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే!


    
వచ్చే నెల పే స్లిప్స్ వచ్చిన తర్వాతే అందరికీ ఓ క్లారిటీ !


ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది.కానీ చాలా విషయాల్లో ఇంకా అస్పష్టత ఉంది. దీంతో ఉద్యోగులు లెక్కలేసుకుంటున్నారు కానీ.. ప్రభుత్వం ఏం చేయబోతోందన్నదానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది.. ఏం మార్పులు చేసిందన్నది వచ్చే నెల మొదటి తేదీన ఉద్యోగులకు వచ్చే ప్లే స్లిప్.. ఈ నెల అందుకున్న పే స్లిప్‌తో పోల్చి చూస్తేనే మార్పులేమిటో అర్థమవుతాయి. అప్పటి వరకూ అంచనాలే. ! 


Also Read: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా?


 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.