నేడు ఉత్తర - దక్షిణ ద్రోణి /గాలి విచ్చిన్నతి ఉత్తర ఛాతిస్గఢ్ నుండి తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు: 
మొన్న తూర్పు మధ్యప్రదేశ్ నుండి తెలంగాణ వరకు ఉన్న ద్రోణి /గాలి విచ్చిన్నతి, ఈరోజు బలహీన పడింది. కాబట్టి, రాగల మూడు రోజులు తెలంగాణ  రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 5 వరకూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేశారు.


Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో  కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. రాగల 5 రోజులు ఎల్లో అలర్ట్ ఉంటుందని వాతావరణ అధికారులు వెదర్ బులెటిన్‌లో తెలిపారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 78 శాతం నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో చాలా కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.


‘‘నేడు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా భాగం మీదుగా గాలుల సంగమం కొనసాగుతోంది. దీని వలన గాలిలో ఏర్పడే వొత్తిడి వర్షాలకు కారణమౌతుంది. ఎప్పుడైతే వేడి ఉంటుందో, వర్షాలు వెంటనే ఏర్పడతాయి. ఇంతవరకు మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా విజయవాడలో మాత్రం వర్షాలు పడలేదు. కానీ ఇప్పుడు కొండపల్లి ప్రాంతం వైపుగా ఏర్పడుతున్న భారీ వర్షాలు నగరంలోనికి విస్తరిస్తున్నాయి. దీని వలన మరో గంట వ్యవధిలో నగరం వ్యాప్తంగా భారీ వర్షాలను, పిడుగులను చూడగలము. జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోగలరు.


నర్సీపట్నం - తుని వైపు భారీ పిడుగులు, వర్షాలు విస్తరిస్తోంది. ఇవి నేరుగా తుని టౌన్ వైపు విస్తరిస్తున్నాయి. దీని వలన ఆ ప్రాంతంలో మరో గంట సేపట్లో భారీ వర్షాలను చూడగలము. మరో వైపున యస్.కోట వైపుగా మొదలైన భారీ వర్షాలు నేరుగా విశాఖ నగరం సివారు ప్రాంతాలైన పెందుర్తి - గోపాలపట్నం వైపుగా విస్తరించనుంది. పిడుగులు మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఎన్.టీ.ఆర్. జిల్లాలోని గన్నవరం - బెజవాడ ఉత్తర భాగాల మీదుగా ఏర్పడుతున్న వర్షాలు నేరుగా కృష్ణా జిల్లా కైకలూరు మీదుగా విస్తరించనుంది. తిరుపతి జిల్లాలోని పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి.


ప్రస్తుతం కాకినాడ వైపుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా భాగాల్లో వర్షాలు విస్తరిస్తున్నాయి. నేడు కాకినాడలో ప్రస్తుతం కొనసాగుతున్న భారీ వర్షాలు మరో 20-30 నిమిషాల్లో బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి. అలాగే ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ విశ్లేషించారు.