స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆగస్టు 15 వేడుకల్లో సామాన్యులను భాగస్వాములను చేయాలని కేంద్రం భావించింది. అందుకే దేశవ్యాప్తంగా సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, చేనేత కార్మికులు, మత్స్యాకారులు, భవన నిర్మాన కార్మికులను ఆహ్వానిస్తోంది. 


ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులను దేశవ్యాప్తంగా ఎంపిక చేసి వారికి ఆహ్వానాలు పంపింది. వీరితోపాటు పీఎం కిసాన్ లబ్ధిదారులు 1800 మందిని స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానించింది. వైబ్రెంట్‌ విలేజెస్‌లో భాగంగా ఆయా గ్రామాల రైతులు, మత్స్యకారులు, నేతన్నలు, సర్పంచ్‌లు, టీచర్స్‌, నర్సులను పిలిచారు. పార్లమెంట్‌ భవనం సెంట్రల్ విస్తా నిర్మించిన కార్మికులు, సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ, అమృత్‌ సరోవర్‌ ప్రాజెక్టులు, హర్‌ఘర్ జల్ యోజన ప్రాజెక్టులకు సేవలు అందించిన సిబ్బందిని ఫ్యామిలీతో కలిసి రావాలని సూచించారు. 
 
అలాంటి అవకాశాన్ని శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన కార్మికులు దక్కించుకున్నారు. ఎప్పటి నుంచో నేత పనే వృత్తిగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు రావాలని సమాచారం అందించారు. వాళ్లు ఇవాళ ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. 


పొందూరకు చెందిన 50 ఏళ్ల బల్ల భద్రయ్యకు, జల్లేపల్లి సూర్యకాంతానికి ఆహ్వానం అందింది. 35 ఏళ్ల నుంచి నేత పని చేస్తున్న భద్రయ్య 100 కౌంటర్‌ బంగారు అంచు కలిగిన పంచెలు నేయడంలో దిట్ట. సూర్యాకాంతం దారం తీయడంలో మంచి పనిమంతురాలు. భద్రయ్య తన భార్య లక్ష్మి, సూర్యకాంతం ముగ్గురు కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. 


వీళ్ల ముగ్గురు ఎర్రకోటలో జరిగే వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. మాజీ ప్రధానులు, ఇతర దేశాల ప్రతినిధులు కూర్చునే ఏరీయాలోనే వీళ్లకు సీట్లు ఇచ్చారు. స్వాతంత్య్రపోరాటంలో ఖాదీది కీలక పాత్ర అని చెప్పిన కేంద్రం దేశవ్యాప్తంగా 75 మంది కార్మికులు ఈ వేడుకలకు ఆహ్వానిస్తోంది. అందులో పొందూరు నుంచి ఇద్దరు ఉన్నారు. 


యూఎన్‌వో సదస్సుకు మన్యం విద్యార్థి


ఐక్యరాజ్య సమితి నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు అల్లూరి సీతారామారాజు పాడేరు జిల్లాకు ఎటపాక కేజీబీవీ విద్యార్థి చంద్రలేఖ ఎంపికయ్యారు. రాష్ట్రంలో అమలు అవుతున్న విద్యా ప్రమాణాలపై యూఎన్‌వోలో ఆమె ప్రసంగించనున్నారు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా చంద్రలేఖను యూఎన్‌వో సదస్సుకు ఎంపికయ్యారు. వంద మార్కులకు పరీక్షలో 94 మార్కులు సాధించారు. ఇంటర్వ్యూలో కూడా అదరు కొట్టేశారు. చంద్రలేఖ చదువుల్లో కూడా టాపర్. మొన్నటి పదోతరగతి పరీక్షల్లో 523 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు.