కార్పొరేట్ సిటీగా వేగంగా అడుగులు వేస్తున్న వైజాగ్ దానికి తగ్గట్టుగానే అన్ని హంగులూ అమర్చుకుంటుంది. అందులో భాగంగా ఏర్పడిందే నైట్ ఫుడ్ కోర్టు. నైట్ లైఫ్‌కి ప్రాధాన్యత ఇస్తున్న యువత రాత్రి పది దాటిన తర్వాత ఫుడ్ కి ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం. నిజానికి విశాఖపట్నానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ నైట్ లైఫ్ విషయంలో హైదరాబాద్ లాంటి సిటీలతో చూస్తే కాస్త వెనకపడింది అనడంలో సందేహం లేదు. అందుకే కొంతమంది వైజాగ్‌ను పెద్ద పల్లెటూరు అని వ్యాఖ్యానించేవారు. అయితే అదంతా గతం.

 

ప్రస్తుతం స్మార్ట్ సిటీ గా వడివడిగా అడుగులు వేస్తున్న వైజాగ్ చాలా రకాల మార్పులకు లోనైంది. అందులో భాగంగా ఏర్పడిందే వైజాగ్ నైట్ ఫుడ్ కోర్ట్. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి రెండు వరకూ సెకండ్ షో చూసి వచ్చే వాళ్లకూ, అర్ధరాత్రి బస్సు దిగే ప్రయాణికులకు, ఐటీ, కాల్ సెంటర్‌ల నుంచి ఇళ్లకు తిరిగిచ్చే వారికీ సమయం కానీ సమయంలో ఫుడ్ కోసం  నేనున్నానంటూ నోరూరీస్తోందీ ఫుడ్ కోర్ట్ . 

 

ఒకప్పటి జైలు రోడ్డు -నేడు నైట్ ఫుడ్ కోర్టు :

 

నిజానికి దీనిని నైట్ ఫుడ్ కోర్ట్ అనడం కంటే నైట్ ఫుడ్ బజార్ అనడమే కరెక్ట్ . ఒకప్పుడు ఈ ప్రాంతంలో విశాఖ జైలు ఉండేది. దానిని ఇప్పుడు మరోచోటుకి తరలించి, ఇక్కడ పార్కు లా డెవలప్ చేసారు. దాని ముందున్న రోడ్డును జైలు రోడ్డు అనేవారు. కొన్నేళ్ల క్రితం వరకూ రాత్రిపూట  అటు రావాలంటేనే జనం భయపడేవారు. అలాంటిది ఇప్పుడు అర్ధరాత్రి కూడా పగలు తిరిగినట్టే జనం తిరుగుతున్నారు అంటే అది నైట్ ఫుడ్ బజార్ మహిమ.

 

రకరకాల సి ఫుడ్, బిర్యానీల నుంచి, ఇడ్లీ, దోశ, పరోటా, చికెన్, వెజ్‌రోల్స్‌ లాంటి పదార్థాలు నోరూరిస్తూ ఆహార ప్రియులను పిలుస్తూ ఉంటాయి . ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్‌ అయితే పిల్లలకు ఎప్పుడూ ఫెవరెట్. వీటితోపాటే మోమోస్, షవర్మా, కుల్చా లాంటి ఇప్పుడిప్పుడే ఉత్తరాంధ్రలో సైతం పాపులర్ అవుతున్న వంటకాలు, కబాబ్‌లూ, పుల్కాలూ లాంటివి స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌ను రారమ్మని పిలుస్తూ ఉంటాయి. మిగిలిన చోట్ల అందుబాటులో లేని సి ఫుడ్ విశాఖకు ప్రత్యేకం.

 

 పొంఫ్రెట్ నుంచి ప్రాన్స్ వరకూ రకరకాల సి ఫుడ్ ని మనముందే వండి వడ్డిస్తారు నైట్ ఫుడ్ బజార్ లో. అందుకే వైజాగ్ నైట్ ఫుడ్ బజార్ ఇతర సిటీ ల్లోని ఫుడ్ బజార్ల కంటే తొందరగా పాపులర్ అయింది . 

 

కొవిడ్  టైం లో దెబ్బ :

 

ఈ ఫుడ్ కోర్టును కొవిడ్ గట్టిగానే దెబ్బ తీసింది. ఎంతోమంది చిరు వ్యాపారులు బ్రతుకుతున్న ఈ నైట్ ఫుడ్ కోర్ట్ కొవిడ్ టైంలో ఆంక్షల వల్ల , జనాలు రాక  తీవ్రంగా దెబ్బతింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు కొంత అనుకూలించడంతో నైట్ ఫుడ్ బజార్ మళ్ళీ ఊపిరి పోసుకుంది. కానీ గతంలో తెల్లవారుజాము వరకూ ఉండే ఈ బజార్ ను ప్రస్తుతం అర్థరాత్త్రి వరకు మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు . త్వరలోనే మళ్ళీ పాత పద్దతిలోనే అనుమతులు ఇస్తామని వారు చెబుతున్నారు.

 

ఇక ఈ నైట్ బజార్‌లో మరో ప్రత్యేకత సేఫ్టీ. ఎప్పుడూ పోలీసులు కాపలా ఉండడం వల్ల ఆడపిల్లలకు సైతం ఈ నైట్ బజార్ సురక్షిత ప్రాంతంగా ఉంటుంది. అందుకే అర్ధరాత్రి సమయంలో కూడా ఆడపిల్లలు, మహిళలు ఈ నైట్ బజార్ లో తమకిష్ట మైన ఫుడ్ ఐటమ్స్ ఆరగిస్తూ కనిపిస్తూ ఉంటారు. వైజాగ్ లోని ద్వారకా బస్ స్టేషన్ సమీపంలోని ఈ నైట్ బజార్ ను మీరు కూడా  విశాఖ వచ్చినప్పుడు మిస్ కాకండి.